‘అల్పాహారాన్ని చక్రవర్తిలా..మధ్యాహ్న భోజనం రాజులా.. రాత్రి భోజనం బిచ్చగాడిలా తినండి..’ అనేది పాత సామెత. చిన్నప్పటినుంచి ఇది వింటూ పెరిగాం. అయితే, ఇటీవల చాలామంది బరువు తగ్గేందుకు డైట్ పాటిస్తున్నారు. ఇందులో భాగంగా ఒకపూట మాత్రమే భోజనం చేస్తున్నారు. రాత్రి ఏమి తినకుండా ఉపవాసం ఉంటున్నారు. డిన్నర్ను స్కిప్ చేసి మరుసటిరోజు అల్పాహారం తీసుకుంటున్నారు. అయితే, దీనివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాత్రి భోజనం మానేస్తే…!!
రాత్రి భోజనం మానేయడం వల్ల నిద్రపై ప్రభావం పడుతుంది. దీంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. దీర్ఘకాలికంగా డిన్నర్ మానేస్తే అనేక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉన్న నిద్రకు భంగం కలుగుతుంది. నిద్ర నాణ్యత తగ్గిపోతుంది. ఇది నిద్రలేమికి దారితీస్తుంది. అలాగే, శరీరానికి పోషకాలు, అవసరమైన కేలరీలు అందవు. అందువల్ల నిద్రను నియంత్రించే హార్మోన్లు అయిన సెరోటోనిన్, మెలటోనిన్లను ఉత్పత్తి చేసేందుకు తగిన సంఖ్యలో కేలరీలను పొందడం చాలా కష్టమవుతుంది.
న్యూట్రియెంట్స్ జర్నల్ ప్రకారం, పోషకాల లోపం వల్ల తగినంత నిద్ర ఉండదు. దీతో నిద్ర సంబంధిత రుగ్మతలు వస్తాయి. విటమిన్ డీ లోపం ఏర్పడుతుంది. నిద్రలేమివల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. మానసిక స్థితి, శక్తి, జీవక్రియపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
స్లీప్ ఫౌండేషన్ ప్రకారం, నిద్ర మనస్సు, శరీరాన్ని రీఛార్జ్ చేసేందుకు సహాయపడుతుంది. ఇది స్పష్టంగా ఆలోచించడం, విషయాలను గుర్తుంచుకోవడం, దృష్టి కేంద్రీకరించడంలాంటి సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. న్యూరోసైకియాట్రిక్ డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, తీవ్రమైన నిద్ర లేమి.. జ్ఞాపకశక్తి , శ్రద్ధను ఒకే విధంగా ప్రభావితం చేస్తుంది.