Period Blood | మహిళల నెలసరి రక్తం (పీరియడ్ బ్లడ్)ను సాధారణంగా శరీర వ్యర్థంగా భావిస్తారు. అయితే తాజా పరిశోధనలు ఈ భావనను పూర్తిగా మార్చుతున్నాయి. పీరియడ్ రక్తంలో అనేక రకాల బయోమార్కర్లు ఉండటంతో అది శరీర ఆరోగ్య పరిస్థితులను అంచనా వేయడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు వెల్లడించాయి. అమెరికాలోని ఫైన్స్టీన్ ఇనిస్టిట్యూట్స్కు చెందిన శాస్త్రవేత్తలు మాట్లాడుతూ గర్భాశయానికి సంబంధించిన అనేక వ్యాధులను పీరియడ్ రక్తం ద్వారా గుర్తించవచ్చని పేర్కొన్నారు.
డయాబెటిస్ నిర్ధారణలో కూడా పీరియడ్ రక్తం కీలక పాత్ర పోషించగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి. BMJ Reproductive Health జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో పీరియడ్ రక్తంలో ఉన్న HbA1c స్థాయిలు సాధారణ రక్తంతో పోలిస్తే సమానంగా ఉన్నట్లు తేలింది. 172 మంది మహిళలపై చేసిన ఈ అధ్యయనంలో ఆరోగ్యవంతులు, డయాబెటిస్ ఉన్నవారిలో కూడా ఈ స్థాయిల మధ్య బలమైన సంబంధం కనిపించింది. దీని ద్వారా సూదులు లేకుండానే రక్తంలో చక్కెర స్థాయిలను తెలుసుకునే అవకాశం ఏర్పడుతోంది. క్యాన్సర్ నిర్ధారణలో కూడా పీరియడ్ రక్తం ఉపయోగకరంగా మారుతోంది. ముఖ్యంగా HPV ద్వారా సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదాన్ని గుర్తించడం, అలాగే CA-125, CEA వంటి బయోమార్కర్ల ద్వారా ఎండోమెట్రియల్, బ్రెస్ట్, లంగ్ క్యాన్సర్లను ముందుగానే గుర్తించే అవకాశాలు ఉన్నాయి. MenstruAI అనే స్మార్ట్ ప్యాడ్ ద్వారా ఈ మార్పులను రంగు మార్పుల ద్వారా లేదా మొబైల్ యాప్ సహాయంతో గుర్తించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.
ఇక పీరియడ్ రక్తం ఎందుకు ప్రత్యేకమంటే అది గర్భాశయంలో జరిగే మార్పులను ప్రతిబింబిస్తుంది. ఎండోమెట్రియం పొర విడిపోవడం వల్ల హార్మోన్లు, ఇన్ఫ్లమేషన్, రక్తంలో చక్కెర స్థాయిల వంటి అనేక అంశాలపై సమాచారం అందుతుంది. కొన్ని అధ్యయనాలు రెండు నెలలపాటు నమూనాలను పరిశీలించి, డయాబెటిస్, ఇన్ఫ్లమేషన్ వంటి ఆరోగ్య సూచికలను కచ్చితంగా గుర్తించగలవని నిర్ధారించాయి. ఉదాహరణకు HbA1c మూడు నెలల సగటు షుగర్ స్థాయిని చూపుతుంది. ఇది మహిళల ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపనుంది. ముఖ్యంగా డయాబెటిస్ను ప్రారంభ దశలోనే గుర్తించడం సులభమవుతుంది. పీరియడ్ రక్తం ద్వారా HbA1c పరీక్షలను ఇంట్లోనే చేయడం సాధ్యమవుతుండటంతో ఆరోగ్య పర్యవేక్షణ మరింత సులభం అవుతుంది. ఇది వ్యాధి నియంత్రణకు ఉపయోగపడుతుంది.
క్యాన్సర్ స్క్రీనింగ్లో కూడా ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. బయాప్సీల వంటి కఠిన పరీక్షలు అవసరం లేకుండానే పీరియడ్ రక్తం ద్వారా క్యాన్సర్ సూచనలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంది. దీనివల్ల చికిత్సను ప్రారంభ దశలోనే ప్రారంభించవచ్చు. గర్భాశయం, ప్రధాన ఆరోగ్యంపై కూడా పీరియడ్ రక్తం కీలక సమాచారం అందిస్తుంది. ఎండోమెట్రియోసిస్ వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం సాధ్యమవుతుంది. HMGB1 వంటి మార్కర్లు ఈ వ్యాధి పురోగతిని తెలియజేస్తాయి. పీరియడ్ రక్తం ద్వారా ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకునే అవకాశం మహిళలకు అందుబాటులోకి వస్తోంది. సూదులు లేకుండా, సులభంగా పరీక్షలు చేసుకోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.