మూత్రపిండాలు, మూత్రనాళంలో పేరుకుపోయి మూత్ర వ్యవస్థలో తీవ్రమైన నొప్పి కలిగించే స్ఫటికాలే కిడ్నీలో రాళ్లు. వీటిలో క్యాల్షియం ఆగ్జలేట్ స్ఫటికాలు ప్రధానమైనవి. యూరిక్ ఆమ్లం, స్ట్రువైట్, సిస్టయిన్ రాళ్లనూ తేలిగ్గా తీసుకోలేం. కిడ్నీల్లో రాళ్లను నివారించేందుకు ఆరోగ్యకరమైన ఆహార విధానాన్ని అనుసరించాలి.
తగినన్ని నీళ్లు ..
తగిన మోతాదులో నీళ్లు తాగడం వల్ల మూత్రంలో లవణాలు పలుచబడతాయి. అలా రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గిపో తుంది. రోజుకు ఎనిమిది నుంచి పన్నెండు గ్లాసుల నీళ్లు తాగాలని నిపుణుల సూచన.
ప్రొటీన్ల శక్తి
పుష్కలంగా నీళ్లు తాగడంతోపాటు అవసరమైనన్ని ప్రొటీన్లు కూడా తీసుకోవాలి. అయితే, ప్రొటీన్లు మోతాదు మించితే మాత్రం కిడ్నీలో రాళ్ల ముప్పు పెరుగుతుంది. మొక్కల నుంచి వచ్చే ప్రొటీన్లు ఎక్కువగా తినాలి. జంతు ఆధారితమైనవి తక్కువగా తీసుకోవాలి.
ఆగ్జలేట్.. మితంగా
పాలకూర, బీట్ దుంపలు, గింజలు, చాక్లెట్ లాంటి ‘ఆగ్జలేట్’ అనే రసాయనం ఉన్న ఆహార పదార్థాలను మితంగా తీసుకోవాలి. హద్దులుదాటితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. నారింజ, బత్తాయి, నిమ్మ, ద్రాక్ష మొదలైన వాటిలో సిట్రేట్ ఉంటుంది. ఇది కిడ్నీల్లో రాళ్లను నివారిస్తుంది.
క్యాల్షియం ముఖ్యం
కిడ్నీల్లో రాళ్లను నిరోధించడంలో క్యాల్షియం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పాల ఉత్పత్తులు, కూరగాయలు, ఆకుకూరలు.. ఇలా వివిధ ఆహార పదార్థాల నుంచి రోజుకు 1,000 నుంచి 1,200 మిల్లీగ్రాముల క్యాల్షియం శరీరానికి అందించాలి. క్యాల్షియం తక్కువైనా, ఎక్కువైనా కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవచ్చు. కాబట్టి, డాక్టర్ల సలహా మేరకే క్యాల్షియం సప్లిమెంట్లు వాడాలి.
ఉప్పు తక్కువగా
సోడియం ఎక్కువగా ఉన్న పదార్థాలు తింటే శరీరంలో క్యాల్షియం స్థాయులు పెరుగుతాయి. అలా కిడ్నీల్లో రాళ్ల్ల ముప్పు కూడా అధికం అవుతుంది. ఉప్పు మోతాదు రోజుకు 2,300 మిల్లీగ్రాములకు మించకుండా చూసుకోవాలి. ప్రాసెస్డ్, ప్యాకేజీ ఆహారం విషయానికొస్తే.. సోడియం తక్కువగా ఉన్నవాటినే ఎంచుకోవాలి.