Summer Health Tips | వేసవి కాలం బయట పని చేసే కార్మికులకు ఒక పెద్ద సవాల్ లాంటిదని చెప్పవచ్చు. నిర్మాణ కార్మికులు, రోడ్డు పని చేసేవారు, వ్యవసాయ కూలీలు, వీధి వ్యాపారులు, రోజువారీ కూలీలు వంటి వారు మండే ఎండలో గంటల తరబడి పనిచేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఆహారం కేవలం ఆకలి తీర్చడానికే కాదు, శరీరానికి శక్తిని అందించడానికి, నీటి లోపాన్ని తగ్గించడానికి, అలసటను ఎదుర్కోవడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఎండలో పని చేసే కార్మికులు వేసవికాలంలో ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇవి తక్కువ ఖర్చుతో లభించడమే కాకుండా, శరీరానికి చల్లదనాన్ని అందించి తీవ్రమైన వేడిని తట్టుకునే శక్తిని ఇస్తాయి. వేసవిలో కార్మికులు భోజనంలో పెరుగు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాకుండా జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఆకలి తగ్గినప్పుడు కూడా పెరుగును సులభంగా తినగలుగుతారు. చాలామంది పెరుగును అన్నంతో కలిపి లేదా రోటీతోపాటు తీసుకుంటారు. ఇది శరీరానికి ఉపశమనం కలిగించడంతోపాటు తేలికైన పోషణను అందిస్తుంది.
పెరుగుతోపాటు మజ్జిగను కూడా కార్మికులు వేసవి ఆహారంలో ముఖ్యమైన భాగంగా చేసుకోవాలి. రోజంతా చెమటలు పట్టే పనులు చేసే వారికి మజ్జిగ దాహాన్ని తగ్గించి శరీరాన్ని తాజాగా ఉంచుతుంది. జీలకర్ర పొడి, ఉప్పు లేదా పుదీనాతో తయారు చేసే మజ్జిగ మరింత రుచికరంగా ఉండటంతోపాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తక్కువ సమయంలో తాగగలిగే ఈ పానీయం ఎండలో పనిచేసే వారికి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అధిక మసాలాలు, నూనెతో చేసిన ఆహారం వేసవిలో భారంగా అనిపిస్తుంది. కనుక పెరుగన్నం, పప్పన్నం లేదా తేలికపాటి ఖిచిడీ వంటి ఆహారాలను ఎంచుకోవాలి. ఇవి కడుపుని నింపడంతోపాటు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా అన్నం త్వరగా జీర్ణమై శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయ, దోసకాయ, నిమ్మకాయ, టమాటా వంటి ముడి కూరగాయలు కూడా వేసవిలో కార్మికుల భోజనంలో తరచూ కనిపిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. ముఖ్యంగా దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో దాహాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పుతో కలిసి తింటే భోజనానికి రుచి పెరగడంతోపాటు వేడి ప్రభావాన్ని కూడా కొంత మేర తగ్గిస్తుంది.
అవకాశం ఉన్నప్పుడు కొబ్బరి నీరు, సీజనల్ పండ్లు కూడా కార్మికులు ఆహారంలో భాగంగా తీసుకోవాలి. కొబ్బరి నీరు శరీరాన్ని త్వరగా హైడ్రేట్ చేయడంలో సహాయపడుతాయి. పుచ్చకాయ, తర్బూజా వంటి పండ్లు అధిక నీటి శాతంతో ఉండటంతో వేసవిలో శరీరానికి చల్లదనం అందిస్తాయి. మామిడి పండ్లు కూడా శక్తినిస్తాయి కానీ ఎక్కువగా తీసుకుంటే భారంగా అనిపించే అవకాశం ఉంటుంది కనుక మితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది కార్మికులు ఉదయం ఇంటి నుంచి తీసుకెళ్లే రోటీలు, కూరలపై ఆధారపడతారు. కనుక సొరకాయ, బీరకాయ, గుమ్మడికాయ, ఆలుగడ్డ వంటి సీజనల్ కూరగాయలతో చేసిన సాధారణ కూరలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి ఎక్కువసేపు నిల్వ ఉండటమే కాకుండా జీర్ణక్రియకు కూడా అనుకూలంగా ఉంటాయి. తక్కువ నూనె, కొద్దిపాటి ఉప్పుతో తయారుచేసే ఈ భోజనం శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.
ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో సత్తు వేసవిలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాల్లో ఒకటి. నీటిలో సత్తు, నిమ్మరసం, ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇది ఒకేసారి దాహాన్ని తీర్చడమే కాకుండా పొట్టని కూడా నింపుతుంది. అలాగే అటుకులు వంటి తేలికపాటి ధాన్యాలతో తయారుచేసిన ఆహారాలు కూడా సులభంగా జీర్ణమై శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.వేసవిలో కార్మికులు ఈ సంప్రదాయ ఆహారాలు తీసుకోవడం ద్వారా కేవలం ఆకలి తీరడమే కాదు, మండే ఎండను ఎదుర్కొనే శక్తిని అందించే సహజ రక్షణ కవచాలుగా కూడా పనిచేస్తాయి. తక్కువ ఖర్చుతో, సులభంగా లభించే ఈ ఆహారాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.