అప్పటివరకూ మామూలుగా ఉన్న వ్యక్తికి.. హఠాత్తుగా చెయ్యి మొద్దుబారుతుంది. కాలు కదపడమూ కష్టమవుతుంది. మూతి వంకర్లు పోతుంది, మాట పడిపోతుంది. మాట్లాడినా నత్తినత్తిగానే. శరీరం సమతూకం కోల్పోతుంది. చూపులో అస్పష్టత. ఒంట్లో మగతగా ఉంటుంది. స్పందనలు ఉండవు. విపరీతమైన తలనొప్పి, ఇవన్నీ ‘పక్షవాతం’ లేదా ‘బ్రెయిన్ స్ట్రోక్’ లక్షణాలే. లక్ష మందిలో సగటున 150 మంది ఏటా పక్షవాతానికి గురవుతున్నట్టు అంచనా. కొవిడ్ రోగుల్లో, కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో పక్షవాతం రావడానికి ఆస్కారం మరింత ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక పక్షవాతం అంటే… ఏ అరవైలలోనో వస్తుందన్నది కూడా ఇప్పుడు అపోహే! మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ధూమపానం తదితర కారణాల వల్ల 40 ఏండ్లలోపు వారిలో కూడా పక్షవాతం లక్షణాలు కనిపిస్తుండటం ఆందోళనకరం.

పక్షవాతం లేదా బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ప్రధాన కారణం మెదడుకు రక్తం సరఫరా చేసే నాళాలు పూడుకుపోవడం (బ్లాక్ కావడం). ఇందులో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది… ఇస్కిమిక్ స్ట్రోక్. మెదడుకు రక్తం సరఫరా చేసే నాళాల్లో అవరోధాలు లేదా గడ్డలు (క్లాట్స్) ఏర్పడటం వల్ల వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ కేసులలో 85 శాతం ఈ తరహావే. రెండోది.. హీమరేజిక్ స్ట్రోక్. మెదడులో నరాలు చిట్లడం వల్ల రక్తస్రావం జరిగినప్పుడు వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ కేసులలో హీమరేజిక్ కేసుల వాటా 15 శాతం. ఇకపోతే రెండు రకాల పక్షవాతాలు కూడా ఒకే రకమైన లక్షణాలను కలిగి ఉంటాయి.
ప్రపంచవ్యాప్తంగా మరణాలకు, అంగవైకల్యానికి రెండో ప్రధాన కారణంగా పక్షవాతం నిలుస్తున్నది. కొన్ని సర్వేల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 25 ఏండ్లు పైబడినవారిలో ప్రతి నలుగురిలో ఒకరు వారి జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారు. చికిత్స సమయానికి అందించకపోతే వీరిలో దాదాపు 40 శాతం మంది మరణించవచ్చని పరిశోధకుల అంచనా! ఇక భారతదేశం విషయానికి వస్తే, దేశంలో ప్రతి ఏటా సంభవించే అన్ని మరణాలలో, 7.4 శాతం మంది బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా జరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

పక్షవాతం అనగానే భయపడాల్సిన పన్లేదు. రోగిని వీలైనంత త్వరగా దవాఖానకు తీసుకువెళ్లగలిగితే ప్రాణాలు కాపాడుకోవచ్చు. రెండు రకాల స్ట్రోక్స్కూ వివిధ రకాలైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇక బ్రెయిన్ స్ట్రోక్తో రోగి హాస్పిటల్లో చేరగానే, డాక్టర్లు అది ఇస్కిమిక్ తరహానా లేదా హీమరేజికా అన్నది నిర్ధారణ చేస్తారు. దీనికోసం సీటీ స్కాన్ కానీ, ఎంఆర్టీ స్కాన్ కానీ చేస్తారు. ఇస్కిమిక్ స్ట్రోక్ అయితే, రెండు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిని దేనికదే ప్రత్యేకంగా గానీ, లేదంటే రెండిటినీ కలిపిగానీ అందిస్తారు.
ఈ పద్ధతిలో, రక్తనాళాల్లో గడ్డల్ని తొలగించే ఔషధాన్ని ఇంజెక్షన్ ద్వారా ఒంట్లోకి ఎక్కిస్తారు. అయితే, సమస్య మొదలైన 4-5 గంటలలోపే రోగిని దవాఖానలో చేర్పిస్తేనే ఈ థ్రాంబోలైసిస్ చికిత్స సాధ్యమవుతుంది. ఈ సమయంలో రోగులకు టిష్యూ ప్లాస్మోజెన్ యాక్టివేటర్ (టీపీఏ) లేదా టెనెక్టిప్లేస్ ఇంజెక్షన్ ఇస్తారు. దీనివల్ల రక్త సరఫరాకు ఆటంకంగా ఉన్న గడ్డ కరిగిపోయి రక్తనాళం తెరుచుకుంటుంది. రక్తనాళాల్లో అవరోధాలు చిన్నవైనప్పుడు, ఈ ఇంజెక్షన్తో సమస్య తీరిపోతుంది.

మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో గడ్డలను తొలగించేందుకు మెకానికల్ థ్రాంబెక్టమీని ఎంచుకుంటారు. అయితే, దీన్ని పక్షవాతానికి గురైన 24 గంటల్లోపు చేయాలి. రక్తనాళాల్లో ఆటంకం పెద్దగా ఉన్నప్పుడు థ్రాంబోలైటిక్ ఔషధాలు ఇవ్వకూడదు. కాబట్టి, ప్రత్యామ్నాయంగా వైద్యులు మెకానికల్ థ్రాంబెక్టమీ చికిత్సను ఎంచుకుంటారు. ఈ ప్రక్రియలో మెదడుకు ఎలాంటి కోతలూ పెట్టరు. కుట్లు కూడా పడవు. బుట్టను పోలిన ఓ పరికరం సాయంతో ఒక చిన్న గొట్టాన్ని కాలి రక్తనాళం ద్వారా శరీరంలోకి పంపిస్తారు. తర్వాత, ఫ్లోరోస్కోపిక్ గైడెన్స్ ద్వారా మెదడు నాళాలకు చేరేలా చూస్తారు. అలా మెదడులోని గడ్డలను తొలగిస్తారు. మత్తుమందు (లోకల్ అనస్థీషియా) ఇచ్చాకే ఈ చికిత్స చేస్తారు. మొత్తం చికిత్సకు గంట సమయం పడుతుంది.
కాగా హీమరేజిక్ స్ట్రోక్ చికిత్స కూడా ఇస్కిమిక్ తరహాలోనే ఉంటుంది. కాకపోతే, హీమరేజిక్లో ముందుగా రోగి రక్తపోటును (బీపీ) నియంత్రణలోకి తీసుకువస్తారు. మెదడులో రక్తస్రావాన్ని నివారించడానికి దెబ్బతిన్న నాళాలను క్లిప్పుల ద్వారా మూసేస్తారు. లేదంటే, ఎంబోలైజేషన్ ప్రక్రియ ద్వారా రక్తస్రావానికి అడ్డుకట్ట వేస్తారు.
పక్షవాతం చికిత్సలు ఏవైనా సరే వాటిని నిర్ణీత సమయంలోపే చేయాలి. ఆలస్యమైన ప్రతి నిమిషానికి రోగి తన మెదడులో 20 లక్షల న్యూరాన్లను నష్టపోతాడు. దీంతో వ్యాధి నుంచి కోలుకోవడం కష్టం అవుతుంది. అందుకే, సాధ్యమైనంత త్వరగా మెదడుకు రక్త ప్రసరణ జరిగేలా చూడాలి. అప్పుడే, మెదడు కణాలు నశించిపోకుండా నివారించగలం. థ్రాంబోలైసిస్, థ్రాంబెక్టమీ చికిత్సల ద్వారా పక్షవాతం కారకాలను
నివారించవచ్చు.
పక్షవాతానికి… ధూమపానం, మధుమేహం, అధిక ఒత్తిడి, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండె సంబంధ వ్యాధులే దారితీస్తాయి. ఈ రుగ్మత బారిన పడకూడదంటే ఏ విధమైన శారీరక శ్రమ లేని కూర్చుని ఉండే జీవనశైలిని వదిలించుకోవాలి. ధూమపానం మానుకోవాలి. జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. రోజువారీగా తగినన్ని నీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. డీహైడ్రేషన్ను దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదు. మన సన్నిహితుల నడకలో కానీ, మాటలో కానీ ఏ మాత్రం తేడా కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. మరో విషయం మహిళలతో పోలిస్తే పక్షవాతం పురుషులకు రావడానికి ఆస్కారం ఎక్కువ. పక్షవాతం రాగానే భయపడకూడదు. వెంటనే, తగిన సదుపాయాలు ఉన్న దవాఖానలో మంచి చికిత్స అందిస్తే రోగి త్వరగా కోలుకుంటాడనే విషయం మర్చిపోవద్దు.
పక్షవాత రోగుల్లో రక్తనాళాలు తిరిగి మామూలుగా అవడానికి రెండు రకాల చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి, థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్… దీన్ని బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన 4- 5 గంటల వరకు ఇవ్వవచ్చు. రెండోది, థ్రాంబొక్టెమి లేదా రక్తనాళంలో అవరోధాన్ని స్టెంట్ ద్వారా తొలగించే పద్ధతి. దీన్ని 24 గంటల వరకు చేయవచ్చు. ఇక ఎవరైనా పక్షవాతానికి గురికాగానే రోగులు కానీ, వారి బంధువులు కానీ కుంగిపోవాల్సిన అవసరం లేదు. స్ట్రోక్ వచ్చిన తర్వాత వీలైనంత త్వరగా హాస్పిటల్లో చేరిస్తే రోగి మునుపటిలా జీవించడానికి వీలు ఉంటుంది. ఇక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినవారు వారికి లక్షణాలు ప్రారంభమైన తర్వాత చికిత్సకు ఒక్కో గంట ఆలస్యం అయ్యేకొద్దీ, మంచి ఫలితం వచ్చే అవకాశాన్ని 30 శాతం వరకు తగ్గిపోతుంది.
బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు వీలైనంత వేగంగా చికిత్స అందించే ఉద్దేశంతో యశోద హాస్పిటల్స్ ‘స్ట్రోక్ కేర్ ఆన్ వీల్స్’ పేరిట ప్రత్యేకమైన అంబులెన్సులను ప్రారంభించింది. వైద్య రంగంలో అత్యాధునిక వైద్య విధానాలను అందుబాటులోకి తేవడంలో యశోద హాస్పిటల్స్ ఎప్పుడూ ముందే ఉంటుంది. పక్షవాతం రోగులకు మరింత మెరుగైన చికిత్సను అందించడానికి ఇప్పుడు ‘డైరెక్ట్ టు ఆంజియో సూట్’ (డీటీఏస్) టెక్నాలజీతో పనిచేసే బై-ప్లేన్ న్యూరో ఆంజియో ప్రొసీజర్ సూట్ అనే అధునాతన సాంకేతికతను యశోద హాస్పిటల్స్ అందుబాటులోకి తీసుకువచ్చాయి.
– డాక్టర్. షాహ్యాన్ మొహిసిన్ సిద్ధిఖీ సీనియర్ న్యూరో & ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్.