న్యూఢిల్లీ : పీచు పదార్ధాలు అధికంగా ఉండే ఆహారం ఏదైనా ప్రేవుల ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇక ద్రాక్ష పండ్లు నిత్యం తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడంతో పాటు ప్రేవుల ఆరోగ్యం మెరుగవుతుందని జర్నల్ న్యూట్రియంట్స్లో ప్రచురితమైన తాజా అధ్యయనం స్పష్టం చేసింది.
ఈ అధ్యయనంలో పాల్గొన్న వారికి పరిశోధకులు రోజూ రెండు సార్లు ద్రాక్ష పండ్లు (46) ఇచ్చారు. ఆపై నాలుగు వారాల తర్వాత నిర్వహించిన పరీక్షల్లో వారి ఎల్డీఎల్ (చెడు) కొలెస్ట్రాల్ 5.9 శాతం తగ్గినట్టు గుర్తించారు. ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలనూ గమనించారు.
ద్రాక్షలో ఉండే అధిక ఫైబర్తో పాటు క్యాటెచిన్స్ ప్రేవుల ఆరోగ్యానికి దోహదపడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక తరచూ ద్రాక్ష పండ్లను తినడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచడం, ఎముకలు, కండరాల పుష్టి, క్యాన్సర్, మధుమేహ ముప్పునూ నివారించవచ్చని పరిశోధకులు గుర్తించారు.