శరీర భాగాల్లో కాస్త నొప్పిగా అనిపించినా చాలామంది పెయిన్ కిల్లర్స్ను ఆశ్రయిస్తారు. చీటికిమాటికి నొప్పినివారణ మాత్రుల వాడుతుంటారు. ఇలా వాడడం శరీరానికి చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. పెయిన్ కిల్లర్స్ను రెగ్యులర్గా వాడితే జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. మూత్రపిండాలు దెబ్బతింటాయి. కాలేయం ప్రమాదంలో పడుతుంది. పెయిన్ కిల్లర్స్ వల్ల మానసిక కల్లోలం, మలబద్ధకం, జుట్టు పల్చబడడం, లేదా జుట్టు రాలడం, ఏకాగ్రత తగ్గడం, చర్మ సమస్యలు వస్తాయి. అయితే, వీటికి బదులుగా మన వంటింట్లో దొరికే సహజ పెయిన్కిల్లర్స్ను ఓసారి ట్రై చేయమంటున్నారు ఆరోగ్య నిపుణులు. వంట గదిలోనే ఐదు రకాల సహజ నొప్పి నివారిణులు ఉన్నాయని చెబుతున్నారు. మరి అవేంటో చూద్దామా..
1. పుదీనా
పుదీనా.. కండరాల నొప్పి, పంటి నొప్పి, తలనొప్పి, నరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని ఆకులను నమలడం జీర్ణక్రియకు సహాయపడడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది. చికాకును దూరం చేస్తుంది. కడుపులో తిమ్మిరి, కండరాలు, నరాలు పట్టేసినట్లు ఉంటే పుదీనాతో ఉపశమనం కలుగుతుంది. పడుకోబోయే ముందు 8 నుంచి 10 చుక్కల పిప్పరమెంటు నూనెను వేడినీళ్లలో వేసి వాసన చూస్తే ఫలితం ఉంటుంది.
2.అల్లం..
అల్లంలోని శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ నొప్పి, తిమ్మిర్లు, కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. అల్లం కండరాల తిమ్మిరి, పీరియడ్స్ నొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది కండరాలకు విశ్రాంతినిస్తుంది.
3. రోజ్మేరీ ఆయిల్..
రోజ్మేరీ ఆయిల్.. ఒక శక్తివంతమైన నూనె. ఇది నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ నూనె మెదడులోని నొప్పి-సంబంధిత ఓపియాయిడ్ న్యూరాన్లపై పనిచేస్తుంది. తలనొప్పి, కీళ్ల నొప్పులకు చికిత్స చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. అదనంగా, రోజ్మేరీ ఆయిల్ మంటను తగ్గిస్తుంది, కండరాల నొప్పిని తగ్గిస్తుంది. మెదడు ఆరోగ్యం, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
4. లవంగాలు..
లవంగం పంటి నొప్పిని దూరం చేస్తుందని అందరికీ తెలిసిందే. కణికను కొరికి, ప్రభావితమైన పంటిపై వదిలివేయడం వల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తుందని విస్తృతంగా నమ్ముతారు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. లవంగాన్ని మెత్తగా చూర్ణం చేసి ఆలివ్ నూనెతో కలిపి మీ నోటి లోపల నొప్పి ఉన్నచోట అప్లై చేయొచ్చు.
5. పసుపు..
పసుపు..యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులో కర్కుమిన్ అనే క్రియాశీల సమ్మేళనం యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. కండరాల నొప్పి, వాపును తగ్గిస్తుంది. ప్రతిరోజూ పసుపు టీ, పసుపు పాలను తాగితే మంచి ఫలితముంటుంది.