కడుపులో నలుసు పడగానే అమ్మ మనసు మురిసిపోతుంది. కమ్మని ఊహలు పూల కొమ్మల్లా అల్లుకుపోతాయి.బిడ్డ కోసం లాలి పాటలు, గోరుముద్దల కథలు నేర్చుకుంటుంది. బుజ్జాయికి స్వెటర్ అల్లుకుంటుంది. అదే సమయంలో తన గురించీ జాగ్రత్త లు తీసుకోవాలి. వివిధ రుగ్మతల నుంచి పొట్టలోని పసిగుడ్డును కాపాడుకోవాలి. సకాలంలో టీకాలు వేయించుకోవాలి. పోషకాహారం తినాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అన్నిటికీ మించి, సీజనల్ వ్యాధులను ఆమడదూరంలో ఉంచాలి.
రుతువులతోపాటు వాతావరణంలో ఏర్పడే మార్పుల వల్ల వచ్చే వ్యాధులే.. సీజనల్ రుగ్మతలు. అందులోనూ, వానకాలంలో దోమల వృద్ధి అపారంగా ఉంటుంది. దీనివల్ల డెంగీ, మలేరియా వంటి విష జ్వరాలకు ఆస్కారం ఉంది. వానకాలం, చలికాలంలో గాలిలో తేమ అధికంగా ఉండటం వల్ల వైరస్ల వ్యాప్తి కూడా ఎక్కువే. ఫలితంగా స్వైన్ఫ్లూ, ఇన్ఫ్లుయెంజా వంటి ఫ్లూ వ్యాధులు వస్తుంటాయి. సీజనల్ వ్యాధులు ఎంత సాధారణమో.. చికిత్స తీసుకోకపోతే అంత ప్రమాదకరం కూడా. ఇతర వ్యాధులతో పోలిస్తే.. సీజనల్ వ్యాధుల ప్రభావం గర్భిణుల మీద కొంత ఎక్కువే.
రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల..
గర్భధారణ సమయంలో మహిళల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. అందుకే, సాధారణ మహిళలతో పోలిసే గర్భిణులు మరింత పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది. నిపుణుల సలహా మేరకు.. న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ వాడినా మంచిదే. సొంత వైద్యం తల్లీబిడ్డలకు ప్రమాదకరం కూడా. ఆ ఔషధాల ప్రభావం తల్లితో పాటు కడుపులో ఉన్న బిడ్డపైనా పడుతుంది. సంబంధిత వైద్యుల సూచన లేకుండా యాంటీ బయోటిక్స్ అస్సలు వాడకూడదు. సీజనల్ వ్యాధులను ప్రారంభ దశలో గుర్తించి.. వెంటనే చికిత్స అందిస్తే చాలు. తల్లి క్షేమం. బిడ్డ సురక్షితం.
సీజనల్ శత్రువులు
అబార్షన్ ముప్పు అధికం
సీజనల్ వ్యాధులన్నీ ప్రమాదకరం కాకపోయినా కొన్ని మాత్రం గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందులోనూ డెంగీ, డయేరియా, కామెర్లు వంటివి గర్భిణులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పొట్టలోని బిడ్డను పొట్టన పెట్టుకునే ప్రయత్నం చేస్తాయి. డెంగీ జ్వరం వల్ల ప్లేట్లెట్స్ పడిపోతాయి. ప్రసవ సమయంలో ఇది చాలా ప్రమాదకర ధోరణి. తల్లికి కామెర్లు కనుక వస్తే , బిడ్డకూ సోకే ప్రమాదం ఉంది. డెంగీ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులకు తీవ్ర జ్వరం, వాంతులు, విరేచనాలు కూడా తోడవుతాయి. దీనివల్ల గర్భిణి డీ-హైడ్రేషన్కు గురికావచ్చు. ఇది కడుపులోని బిడ్డపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందులోనూ, మూడు నెలల్లోపు గర్భిణులు సీజనల్ వ్యాధుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం చేస్తే అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. పరిస్థితి గర్భ విచ్ఛిత్తి వరకూ వెళ్తుంది. వాంతులు, నీళ్ల విరేచనాలు, హైఫీవర్ లాంటివి.. బిడ్డ ఆరోగ్యాన్ని ప్రతి కూలంగా ప్రభావితం చేస్తాయి. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు టీకా తీసుకోవడం మంచిది. నాలుగో నెలలో ఇన్ఫ్లుయెంజా(ఫ్లూ) వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫ్లూ వ్యాక్సిన్ సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే గర్భిణులకు ముందస్తు ఫ్లూ టీకా ఒక వరం లాంటిది.
ప్రసూతివైద్యుల పర్యవేక్షణలోనే
డెంగీ, మలేరియా, జలుబు, జ్వరం తదితర సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు గర్భిణులు సాధారణ వైద్యానికి పరిమితం కాకూడదు. ప్రసూతి నిపుణుల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకోవాలి. ఎందుకంటే, సదరు వైద్యులకు గర్భిణి ‘ప్రసూతి చరిత్ర’ మొత్తం తెలిసి ఉంటుంది. పొట్టలోని బిడ్డపై మందుల చెడు ప్రభావం పడకుండా.. తక్కువ డోసేజ్తో ప్రత్యామ్నాయ ఔషధాలను సూచిస్తారు. కాబోయే తల్లి వాంతులు, విరేచనాల వల్ల డీ-హైడ్రేషన్కు గురికాకుండా జాగ్రత్తపడాలి. తీవ్ర జ్వరం వచ్చినప్పుడు క్రమపద్ధతిలో తగ్గించుకోవాలే కానీ, శక్తివంతమైన ఔషధాలు వాడకూడదు. గర్భిణికి మానసిక ప్రశాంతత చాలా అవసరం. ఒత్తిడి పెరిగేకొద్దీ రోగనిరోధక శక్తి తగ్గుతుంది. సీజనల్ వ్యాధులు చుట్టుముట్టేస్తాయి. మనోధైర్యంతో ఆరోగ్య సమస్యలను సమర్థంగా ఎదుర్కోవచ్చు. దీనివల్ల రోగం దానంతట అదే నయం అవుతుంది.
ఇవీ జాగ్రత్తలు
…?మహేశ్వర్రావు బండారి
డాక్టర్ రాజేశ్వరి
ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడీ ,అబ్స్టెట్రీ అండ్
గైనకాలజీ విభాగం , నిలోఫర్ హాస్పిటల్