Mumps | చాలాకాలం తర్వాత మళ్లీ గవద బిళ్లల కేసులు విజృంభిస్తున్నాయి. కొద్దిరోజులుగా మహారాష్ట్ర, తెలంగాణలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముంబై, హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో గవద బిళ్లలు అంటే ఏంటి? వాటి లక్షణాలు ఏంటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గవద బిళ్లలు అంటే ఏంటి?
గవద బిళ్లలు అనేది మిక్సో వైరస్ పరోటెడిస్ అనే వైరస్ వల్ల వస్తుంది. వీటినే చంప గడ్డలు అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇది 5 నుంచి 15 ఏండ్ల పిల్లల్లో వస్తుంది. చెవి ముందు, కింద, దవడ భాగం వరకు విస్తరించి ఉన్న పరోటిడ్ లాలాజల గ్రంథి వాచిపోయి నొప్పిగా అనిపిస్తుంది. దీనివల్ల జ్వరం, తలనొప్పి, చెవి నొప్పి మొదలవుతాయి. నోరు పూర్తిగా తెరిచి ఆహారం మింగడం కూడా కష్టమవుతుంది.
ఎలా వ్యాపిస్తుంది?
గవద బిళ్లలు నోటి నుంచి గాలి ద్వారా విస్తరిస్తాయి. తుమ్ము, దగ్గు, ఎంగిలి ఈ వైరస్కు వాహకాలుగా పనిచేస్తాయి. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన రెండు మూడు వారాలకు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకిన 10 మందిలో ఒకరికి మెదడువాపు వచ్చే అవకాశం ఉంది. నలుగురిలో ఒకరికి వృషణాలు వాచిపోయి.. నొప్పిగా ఉంటుంది. ఈ రోగుల వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల భవిష్యత్తులో పిల్లలు పుట్టకపోవచ్చు. 20 వేల మందిలో ఒకరికి చెవుడు కూడా వస్తుంది. 10 వేల మందిలో ఒకరు మరణించే ప్రమాదం ఉంది.
గవద బిళ్ల లక్షణాలు
దవడ ఉబ్బడం
ఆకలి లేకపోవడం
జ్వరం
తలనొప్పి
చెవినొప్పి
లాలాజల గ్రంథుల్లో నొప్పి
నోరు తెరిచి ఆహారం మింగలేకపోవడం
అలసట
కండరాల నొప్పి
నియంత్రణ
గవదబిళ్లలు సోకిన వారు వారం రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలి. పోషకాహారం తీసుకోవాలి. తగినంత విశ్రాంతి అవసరం. వైద్యుల సూచన మేరకు జ్వరం, నొప్పులకు సంబంధించిన మందులు వాడాలి. ఫేస్ మాస్క్లు కూడా దొరుకుతాయి. ఇక, పిల్లలకు ఎంఎంఆర్ ( మీజిల్స్, మంప్స్, రుబెల్లా ) టీకాలను ఇప్పించడం ద్వారా కొంతమేర గవద బిళ్లలను నియంత్రించవచ్చు. ఈ వ్యాక్సిన్ను రెండు డోసుల్లో ఇస్తారు. తొలి డోసును 9 నుంచి 12 నెలల మధ్యలో.. రెండో డోసును 12 నుంచి 15 నెలల మధ్యలో ఇస్తారు.