న్యూఢిల్లీ : కరోనా చికిత్సలో గేమ్ ఛేంజర్ గా భావిస్తున్న మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టెయిల్ మెరుగైన ఫలితాలు అందిస్తోంది. ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో కొవిడ్-19 లక్షణాలతో బాధపడుతున్న ఇద్దరు రోగులకు ఆరవ రోజున ఈ ఔషధం ఇవ్వగా 12 గంటల్లోనే వారి ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు వెల్లడించారు. సరైన సమయంలో మోనో క్లోనల్ యాంటీబాడీస్ చికిత్స చేపడితే రోగులు సత్వరమే కోలుకుంటారని ఆస్పత్రిలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ పూజ ఖోస్లా పేర్కొన్నారు.
హైరిస్క్ గ్రూప్ ల్లో ఈ చికిత్స ద్వారా రోగులను దవాఖానల్లో చేర్పించడం, వ్యాధి తీవ్ర దశకు చేరకుండా నివారించవచ్చని చెప్పారు. స్టెరాయిడ్ల వాడకాన్ని తగ్గించడంతో పాటు బ్లాక్ ఫంగస్ వంటి ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రోగులను కాపాడవచ్చని అన్నారు. ఇక తీవ్ర జ్వరం, దగ్గు, నీరసంతో ఇబ్బంది పడుతున్న 36 ఏండ్ల ఆరోగ్య కార్యకర్తకు మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టెయిల్ చికిత్స అందించగా రోగి ఆరోగ్యం 12 గంటల్లోనే మెరుగైందని, అతడిని డిశ్చార్జి చేశామని సర్ గంగారాం ఆస్పత్రి ఓ ప్రకటనలో పేర్కొంది.