నిద్రలేమితో బాధపడేవారికి డాక్టర్లు సాధారణంగా మెగ్నీషియం సిఫారసు చేస్తుంటారు. కారణం, శరీరంలో మెగ్నీషియం తగిన పరిమాణంలో ఉంటే, వివిధ శారీరక విధులు సక్రమంగా జరుగుతాయి. రోగ నిరోధక శక్తిని ఇవ్వడంలో, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో, నరాలూ కండరాలూ సమర్థంగా పనిచేయడంలో మెగ్నీషియం కీలకపాత్ర పోషిస్తుంది.
మెగ్నీషియం లోపిస్తే.. మెదడుకు వివిధ నరాలు సంకేతాలను పంపే వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటాయనీ, నిద్రకు పురికొల్పే మెలటోనిన్ లాంటి హార్మోన్ల స్థాయులు మారిపోతాయనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గింజలు, కూరగాయలు, ఆకుకూరలు, విత్తనాలు, బీన్స్, యోగర్ట్, చేపలతో కూడిన సమతుల ఆహారం తీసుకుంటే శరీరానికి తగినంత మెగ్నీషియం లభిస్తుంది. మిగిలినవారితో పోలిస్తే, కాళ్లను కదపడానికి ఇబ్బందిపడే ‘రెస్ట్లెస్ లెగ్స్ సిండ్రోమ్’ బాధితులకు మెగ్నీషియంను మరింత గట్టిగా సిఫారసు చేస్తున్నారు వైద్యులు. ఈ సిండ్రోమ్ వల్ల నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. మెగ్నీషియం ప్రభావంతో నరాల నుంచి మెదడుకు సిగ్నల్స్ సరిగ్గా అందుతాయి. దీంతో, వారు నిద్రలేమిని జయించే అవకాశం ఉంది.