కరోనా మహమ్మారిపై పోరాడేందుకు గత రెండేండ్లుగా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. మందులు, వ్యాక్సిన్లు, ఆహారం, పానీయాలకు సంబంధించి అనేక అధ్యయనాలు జరుపుతున్నారు. కరోనా నుంచి ప్రజలను రక్షించే వివిధ ప్రక్రియలపై పరిశోధకులు తీవ్రంగా ప్రయత్నాలు జరుపుతుండగా.. మరోవైపు వైన్ తాగడంతో కరోనాకు చెక్ పెట్టొచ్చు అని కొత్త పరిశోధన వాదన వెలుగులోకి వచ్చింది.
ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్ జర్నల్లో ఇటీవల ప్రచురించిన ఒక పరిశోధన వ్యాసం ప్రకారం, వైన్ తాగే అభిరుచి కరోనా నుంచి కాపాడుతుంది. వారానికి 5 గ్లాసులు లేదా అంతకంటే ఎక్కువ రెడ్ వైన్ తీసుకునే వ్యక్తులు వైరస్ బారిన పడే ప్రమాదం 17 శాతం తక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో బీర్ తాగడం వలన 28 శాతం ఎక్కువ ప్రమాదం ఉన్నదని వారు తేల్చారు.
బ్రిటిష్ వెబ్సైట్ మిర్రర్ ప్రకారం, చైనాలోని షెన్జెన్ కంగ్నింగ్ హాస్పిటల్లో బ్రిటిష్ పౌరుల డాటాను విశ్లేషించడం ద్వారా ఈ అధ్యయన పత్రాన్ని రూపొందించారు. ఇందులో బ్రిటన్ ప్రజల మద్యపాన అలవాట్లు, కరోనా హిస్టరీపై అధ్యయనం జరిపారు. రెడ్ వైన్లో పాలీఫెనాల్ అనే సమ్మేళనం ఉంటుందని, ఇది ఫ్లూ, ఇతర శ్వాసకోశ వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుందని పరిశోధకులు అంటున్నారు. ఈ పానీయం తీసుకోవడం వల్ల కరోనా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని సెలవిస్తున్నారు. అలాగే, వైట్ వైన్, షాంపైన్ కూడా కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని కాపాడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. వీరి పరిశోధన ప్రకారం, వారానికి 1-4 గ్లాసుల వైట్ వైన్ లేదా షాంపైన్ తాగే వారు కరోనా ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని 8 శాతం తగ్గిస్తారు.
బీర్ తాగడం ప్రమాదకరం
పరిశోధకుల ప్రకారం, బీర్, పండ్లరసాలు తాగేవారికి కరోనా వచ్చే అవకాశం 28 శాతం ఎక్కువ. వారానికి 5 గ్లాసులు లేదా అంతకంటే ఎక్కువగా బీర్ లేదా పండ్ల రసాలను తీసుకునే అలవాటు ఉన్నట్లయితే.. ఇప్పుటి నుంచే జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించడం చాలా మంచిదని వారు సెలవిస్తున్నారు. కాగా, ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తాగే వ్యక్తుల్లో అందరికంటే వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలో పేర్కొన్నారు.