నమస్తే డాక్టర్. పిల్లలు పుట్టినప్పుడు మూలకణాలను (స్టెమ్సెల్స్) దాచిపెట్టడం మంచిదని అంటున్నారు. ఏమిటీ ప్రక్రియ? ఎంత ఖర్చు అవుతుంది? భరోసా ఉందా?
ఓ పాఠకురాలు
మూలకణాలు అనేవి తల్లీ పిల్లలను కలిపే బొడ్డు తాడులోని రక్తంలోనూ, మాయలోనూ ఉంటాయి. ఇంగ్లిష్లో ‘స్టెమ్ సెల్స్’ అని పిలుస్తారు. వీటి నుంచి మనిషికి సంబంధించిన అన్ని అవయవాలనూ.. గుండె, కాలేయం, మూత్రపిండాలు.. ఇలా దేన్నయినా తయారు చేయవచ్చనే కోణంలో ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అంటే, భవిష్యత్తులో బిడ్డకు ఆరోగ్య సమస్య వచ్చి ఏదైనా అవయవం దెబ్బతిన్నప్పుడు పునర్నిర్మాణానికి పనికొస్తాయని ఆశ. అయితే, ఇదంతా ప్రస్తుతం పరిశోధనల దశలో ఉన్న అంశం మాత్రమే. వందకి వందశాతం ఫలితాలను ఇస్తుందని చెప్పలేం. అలా అని కొట్టిపారేయలేం. తమ బిడ్డ మూలకణాలను నిల్వ చేయాలనుకునేవారు, ఆ విషయాన్ని ప్రసవం చేస్తున్న దవాఖానకు తెలియజేస్తే.. పురుడు పోశాక బొడ్డుతాడు, మాయ నుంచి సుమారు వంద మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరించి ఇస్తారు.
దాన్ని ఆయా సంస్థలు నైట్రస్ ఆక్సైడ్ సాయంతో క్రయోఫ్రీజింగ్ చేస్తాయి. అంటే బిడ్డ కణాలను అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేస్తారన్నమాట. భవిష్యత్తులో రక్తానికి సంబంధించిన తీవ్ర వ్యాధులు వచ్చినా ఇవి బిడ్డకు ఉపయోగపడతాయి. వీటిని ఇతరుల కోసమూ వినియోగించవచ్చు. దాత నుంచి అవయవాలు సేకరించి మార్పిడి చేసినట్టు అన్నమాట. ఇక, ఈ మూలకణాలను ఇరవై సంవత్సరాలకు పైగా నిల్వ చేస్తామని కొన్ని సంస్థలు చెబుతున్నాయి. సంస్థల్ని బట్టి ధరలు ఉంటాయి. ఈఎంఐ రూపంలోనూ చెల్లించే వెసులుబాటు ఉంది. అమెరికాలాంటి దేశాల్లో ప్రభుత్వమే పౌరుల మూలకణాలను భద్రపరిచే బాధ్యత తీసుకున్నది. భారతదేశంలో మాత్రం అలాంటి సంస్థలతో ఆసుపత్రులు ఒప్పందాలు చేసుకోవద్దని ప్రభుత్వమే స్పష్టంగా చెబుతున్నది. అందువల్ల, బిడ్డ తల్లిదండ్రుల కోరిక మేరకే మూల కణాలకు సంబంధించిన రక్తాన్ని అందజేస్తారు వైద్యులు.