కుంకుమ పువ్వు అనగానే గర్భిణులు మాత్రమే తినాలని చాలామంది అనుకుంటుంటారు. కానీ దాన్ని ఎవరైనా తినొచ్చు. కీళ్ల నొప్పులు తగ్గించడంతో పాటు నిద్ర లేమి, డిప్రెషన్, అంగస్తంభన సమస్యలు.. ఇలా చాలా వాటికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. కుంకుమపువ్వులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఒకసారి చూద్దాం..
చర్మానికి నిగారింపు తీసుకురావడంలో కుంకుమ పువ్వు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎలాంటి క్రీంలు వాడుకుండానే సహజసిద్ధంగా మన చర్మం మెరిసేలా చేస్తాయి. చర్మంపై మొటిమలు తగ్గించడంలోనూ ఇది దోహదపడుతుంది.
ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలోనూ కుంకుమ పువ్వు ఉపయోగపడుతుంది. ఇందులో పైటోకెమికల్స్, ఫెనోలిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి మెదడుకు అవసరమైన సెరోటోనిన్ను అందించడంలో సహాయపడుతాయి.
రుతుక్రమ సంబంధిత సమస్యలకు కూడా కుంకుమ పువ్వు చక్కగా పనిచేస్తుంది. కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఉండవు.
అంగస్తంభన సమస్యలు, వీర్య కణాలు తక్కువ ఉన్నవాళ్లు రోజూ కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల సత్ఫలితాలు కనిపిస్తాయి. బాదం పాలల్లో కుంకుమ పువ్వును కలిపి తీసుకోవడం వల్ల సెక్స్ సామర్థ్యంతో పాటు సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.
క్యాన్సర్ కారకాలపై ఫ్రీ రాడికల్స్ పెరగకుండా చూసే యాంటీ ఆక్సిడెంట్లు కుంకుమ పువ్వులో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కుంకుమ పువ్వును రోజూ తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం తగ్గుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
జీవక్రియను నియంత్రించడంలోనూ కుంకుమ పువ్వు కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి అవ్వదు. కొద్దిగా తినగానే కడుపు నిండినట్టు అనిపిస్తుంటుంది. కాబట్టి తక్కువ ఆహారం తీసుకుంటారు. దీనివల్ల బరువు తగ్గుతారు.
పడుకునే ముందు పాలల్లో కుంకుమ పువ్వు కలుపుకుని తాగితే మంచి నిద్ర పడుతుంది. ఇందులో మాంగనీస్ అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి ప్రశాంతత చేకూర్చి త్వరగా నిద్రపోయేలా చేస్తుంది.
కుంకుమ పువ్వులో క్రోసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది జ్వరాన్ని తగ్గించడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచడంలో దోహదపడుతుంది. పాలల్లో కుంకుమపువ్వు వేసుకుని తాగడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
కుంకుమ పువ్వులో క్రోసిటిన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఫలితంగా హృద్రోగాలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.
కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలను తగ్గించడంలోనూ కుంకుమ పువ్వు సహాయపడుతుంది. ఆస్తమా, కోరింత దగ్గు ఇలా పలు సమస్యలను తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది.
నెలలో కనీసం మూడు లేదా నాలుగుసార్లు కుంకుమ పువ్వు తింటే ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. చాలా రోజులుగా కడుపు ఉబ్బరంగా ఉన్నా ఆ సమస్య కూడా తగ్గుతుంది. అజీర్తి తగ్గించడంలో కుంకుమ పువ్వుది ప్రత్యేక స్థానం.