Influenza | వేసవి ప్రవేశిస్తున్న ప్రస్తుత సమయంలో దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు జలుబు, దగ్గు, వైరల్ జ్వరాల బారిన పడటం కలవరపెడుతున్నది. కొవిడ్ తరహా లక్షణాలున్న ఈ వ్యాధులకు ‘ఇన్ఫ్లూయెంజా-ఏ ఉప రకం హెచ్3ఎన్2’ వైరస్ ప్రధాన కారణమని ఐసీఎంఆర్ పేర్కొన్నది. ఈ వ్యాధుల బారిన పడినవారు 10 నుంచి 17 శాతం మంది మాత్రమే తీవ్ర అస్వస్థతకు గురై దవాఖానల్లో చేరుతున్నారని తెలిపింది. ఆందోళన అవసరం లేదని, జ్వరం 3 రోజులు, దగ్గు 3 వారాలపాటు ఉండొచ్చని ఐఎంఏ వెల్లడించింది. వైద్యుల సలహా లేకుండా యాంటిబయటిక్స్ వాడొద్దని హెచ్చరించింది.
న్యూఢిల్లీ, మార్చి 4: దేశ వ్యాప్తంగా హఠాత్తుగా పెరుగుతున్న జ్వరం, దగ్గు కేసులకు ‘ఇన్ఫ్లూయెంజా ఎ ఉపరకం హెచ్3ఎన్2’ వైరస్ ప్రధాన కారణమని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) గుర్తించింది. ఈ ఉప రకం వైరస్ ఫ్లూకు కారణమవుతుందని, ఇతర ఇన్ఫ్లూయెంజా ఉపరకాల కన్నా దీని వల్ల ఎక్కువ మంది దవాఖానాలో చేరుతున్నారని వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఉన్న తన వైరస్ పరిశోధన, చికిత్స ప్రయోగశాలల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఐసీఎంఆర్ ఈ ప్రకటన చేసింది. డిసెంబర్ 15 నుంచి నేటి వరకు తీవ్రమైన శ్వాస కోశ ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లూయెంజా అవుట్ పేషంట్ల అనారోగ్యానికి హెచ్3ఎన్2 వైరస్ కారణమని చెప్పింది. ఈ వైరస్ కారణంగా దవాఖానాలో చేరిన వారిలో 92 శాతం మంది జ్వరం, 86 శాతం మంది దగ్గు, 27 శాతం ఊపిరాడకపోవడం, 16 శాతం గురకతో బాధ పడుతున్నారని తెలిపింది. అదనంగా 16 శాతం మంది న్యుమోనియా లక్షణాలు, 6 శాతం మూర్ఛతో ఇబ్బంది పడుతున్నారని వివరించింది.
కరచాలనం, ఇతర పలకరింపు, సంప్రదింపు పద్ధతులు; పబ్లిక్ ప్రదేశాల్లో ఉమ్మడం, వైద్యుడిని సంప్రదించకుండా యాంటిబయాటిక్స్, ఇతర మందుల వాడకం; కలిసి భుజించడం, ఇతరులతో దగ్గరగా కూర్చోవడం.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న జ్వరం, దగ్గు కేసులకు సంబంధించి భారత వైద్య సంఘం(ఐఎంఏ) కీలక సూచనలు చేసింది. దేశవ్యాప్తంగా హఠాత్తుగా వాం తులు, ఒళ్లు నొప్పులు, అతిసారం, గొంతు నొప్పి కేసులు పెరిగాయని వెల్లడించింది. జ్వరం మూడు రోజుల పాటు, దగ్గు మూడు వారాల పాటు కొనసాగుతుందని తెలిపింది. యాంటిబయాటిక్స్ను విచక్షణారహితంగా వాడొద్దని సూచించింది. వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం వల్ల ఈ రోగాలు వస్తున్నట్టు తెలిపింది. రోగ లక్షణాలకు మాత్రమే చికిత్స చేయాలని వైద్యులకు సలహా ఇచ్చింది. పిల్లలు, పెద్దలు, గర్భిణుల్లో బాధితులు ఎక్కువగా ఉండటంతో వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆస్థమా రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. హెచ్1ఎన్1తో పోలిస్తే హెచ్3ఎన్2 వైరస్ వల్ల ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెప్తున్నారు. అపరిశుభ్రత వల్ల కేసుల సంఖ్య మరింత పెరుగుతున్నదని అంటున్నారు.
చేతులను సబ్బు, నీళ్లతో కడుక్కోవాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే మాస్క్ ధరించాలి. రద్దీ ప్రదేశాల్లో తిరగకూడదు. ముక్కు చీదినప్పుడు, దగ్గినప్పుడు నోటికి, ముక్కుకు చేతి రుమాలు లేదా చేయి అడ్డు పెట్టుకోవాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. కండ్లను, ముక్కును తాకవద్దు. ఒళ్లు నొప్పులు, జ్వరానికి పారసిటమాల్ తీసుకోవాలి.