న్యూఢిల్లీ : కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ సంక్రమణ రేటు పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా పేర్కొన్నారు. కరోనా పరీక్షలు, ప్రారంభ దశలో వైరస్ను గుర్తించడం ద్వారా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని అన్నారు. సంక్రమణ రేటు ఒకటి కంటే ఎక్కువ ఉంటే అది కొవిడ్-19 వ్యాప్తికి సంకేతమని చెప్పారు. కొవిడ్-19 నిబంధనలు పాటించేలా జిల్లా, స్ధానిక అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఆయన లేఖ రాశారు.
ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రాంతాల్లో కట్టడి చర్యలు చేపట్టాలని ప్రజలు కరోనా నిబంధనలను విధిగా పాటించేలా చూడాలని కోరారు. కొవిడ్-19 నిబంధనల విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా సంబంధిత అధికారులను బాధ్యుల్ని చేయాలని లేఖలో ఆయన స్పష్టం చేశారు. ప్రజలు వైరస్ విషయంలో తేలిగ్గా వ్యవహరించరాదని, హిల్ స్టేషన్స్లో రద్దీని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోరుతూ హోం శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హోంశాఖ కార్యదర్శి లేఖ రాశారు.