Heart Disease | కార్డియోవాస్కులర్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యల్లో ఒకటి. కార్డియోవాస్కులర్ డిసీజ్ (CVD) అనేది గుండె (కార్డియో) లేదంటే.. శరీర రక్తనాళాల వ్యవస్థ (వాస్కులర్)ను ప్రభావితం చేసే వ్యాధి. దీంతో మరణాలు పెరుగుతున్నట్లుగా గురించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం.. హృదయ సంబంధ వ్యాధుల (CVD) కారణంగా ఏటా 17.9 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అస్తవ్యస్తమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండెజబ్బులు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. గుండె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ ఈ వ్యాధిని నివారించేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. గుండెజబ్బుల లక్షణాలను శరీరంలోని అనేక ఇతర భాగాల్లో వచ్చే సమస్యల ఆధారంగా సైతం గుండెజబ్బులను గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఆరోగ్య నిపుణులు అనేక అధ్యయనాల్లో గుండె సంబంధిత సమస్యలకు కారణాలను సైతం గుర్తించారు. చేతితో ఏదైనా బలంగా పట్టుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే.. అది గుండె ఆరోగ్యంగా లేదనడానికి సంకేతమని పలు పరిశోధనలు పేర్కొంటున్నాయి. గ్రిప్ స్ట్రెంగ్త్ ఆధారంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని అంచనా వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మైకం, బలహీనతలు అనేక వ్యాధులతో కలిగే అత్యంత సాధారణ సమస్య. అయినప్పటికీ ఇది చాలాకాలం పాటు కొనసాగితే.. దీనికి తీవ్రమైన శ్రద్ధ అవసరం. మైకం తరుచుగా గుండెకు సంబంధించిన సమస్య ఫలితంగా ఉండవచ్చని.. మెదడుకు తగినంత రక్తాన్ని పంప్ చేయకపోవడం వల్ల కూడా సంభవించవచ్చని పేర్కొంటున్నారు. గుండెజబ్బులకు సంబంధించిన ఇతర లక్షణాలో ఇది కూడా కనిపిస్తుందని, ఈ సమస్య ఎవరికైనా ఉంటే.. దాన్ని తీవ్రంగా పరిగణించాలని సూచిస్తున్నారు.
హృదయ సంబంధిత సమస్యలు పెరిగిన సందర్భంలో శరీరంలో రక్త ప్రసరణ ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంటుంది. కాలక్రమేణా దాని లక్షణాలు చర్మంపై కనిపిస్తూ వస్తాయి. నీలిరంగు, గోధుమరంగులోకి లేదంటే చర్మం కింద రక్తంలాంటి మచ్చలున్న చేతివేళ్లు గుండె సంబంధిత సమస్యలకు సంకేతమని నిపుణులు పేర్కొంటున్నారు. కొలెస్ట్రాల్ ఫలకాలు విరిగిపోయి చిన్న రక్తనాళాల్లో చిక్కుకుపోయి చర్మపై మచ్చలు, ఊదారంగులో కనిపిస్తాయని చెబుతున్నారు. చర్మంలో వస్తున్న మార్పులను నిశితంగా పరిశీలిస్తూ ఉండాలని చెబుతున్నారు.
చిగుళ్ల సమస్యలు సాధారణంగా నోటి అపరిశుభ్రత, దంత సమస్యలతో సాధారణంగా కనిపిస్తాయి. అయితే, ఇవి హృదయ సంబంధిత సమస్యలకు కూడా సంకేతమని నిపుణులు చెబుతున్నారు. రక్తస్రావం, చిగుళ్లవాపు సాధారణ చికిత్స తీసుకున్నా తగ్గకపోతే.. వాటిని తీవ్రంగా పరిగణించాలని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఓ సిద్ధాంతం ప్రకారం.. చిగుళ్ల నుంచి బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించి గుండెలో మంటను కలిగిస్తుంది. చిగుళ్ల సమస్యను స్ట్రోక్ ప్రమాదాన్ని సైతం పెంచుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.