..అవసరం లేదంటున్న నిపుణులు
బైపాస్ సర్జరీ.. హృద్రోగులకు బాగా పరిచయం ఉన్న శస్త్రచికిత్స. సాధారణంగా గుండెలోని రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు బైపాస్ సర్జరీ చేస్తారు. అయితే, బైపాస్ సర్జరీ తర్వాత, కొన్నేండ్లకు మరోసారి బైపాస్ చేయాల్సి వస్తుంది. ఇదంతా నిన్నమొన్నటి వరకూ అనివార్యం. కానీ ఇప్పుడు, కొత్త ఆవిష్కరణల ఫలితంగా ఆ అవసరం లేకుండా పోతున్నది.
‘బైపాస్ రోడ్డు’ అనే మాట మనం వింటూ ఉంటాం. తరచూ వాడుతూ ఉంటాం. ఒక మార్గానికి ప్రత్యామ్నాయం అని ఈ మాటకు అర్థం. హృద్రోగులకు సంబంధించి.. రోగి గుండె రక్తనాళాలు మూసుకుపోయినప్పుడు, శస్త్ర చికిత్స ద్వారా ఇంకో మార్గాన్ని ఏర్పాటు చేయడాన్నే బైపాస్ సర్జరీ అంటారు. ఈ పద్ధతిలో రక్త నాళాల్లో ఏర్పడిన అవ రోధాన్ని తొలగించకుండా.. కొత్తగా మరో మార్గం ద్వారా రక్తప్రసరణను మళ్లిస్తారు.
సాధారణంగా ఒకే రక్తనాళంలో బ్లాక్ ఉంటే స్టెంట్ వేస్తారు. అది కూడా రెండు సెంటీమీటర్ల కంటే తక్కువ పొడవు ఉంటేనే వీలవుతుంది. రక్తనాళం ప్రారంభంలో(ఆస్టియల్ స్టెనోసిస్)బ్లాక్ ఉంటే కనుక స్టెంట్ వేసే అవకాశం ఉండదు. రక్తనాళం మొత్తం బ్లాక్ అయినప్పుడు కూడా స్టెంట్కు అనువైన పరిస్థితులు ఉండవు. ఇక, బైపాస్ సర్జరీ చేయాల్సిందే.
బ్లాక్ ఏర్పడితే..
మనిషి గుండె యంత్రం లాంటిది. మెషీన్ నడవాలంటే ఇంధనం అవసరం. అలాగే గుండె పనిచేయడానికి ఆక్సిజన్, పోషకాలు అవసరం. గుండెకు అవసరమైన ప్రాణవాయువు, పోషకాలు రక్తం ద్వారానే అందుతాయి. హృదయ స్పందన జరిగిన ప్రతిసారీ.. గుండెకు రక్తం సరఫరా అవుతుంది. గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఈ స్పందనల ద్వారా.. నిమిషానికి ఐదు లీటర్ల రక్తం శరీరానికి బట్వాడా అవుతుంది. రెండు కరొనరీ ధమనుల ద్వారా గుండెకు రక్తం సరఫరా అవుతుంది. అందులో ఒకటి ఎడమ కరొనరీ ధమని. ఇది పెద్దగా ఉంటుంది. ఈ ధమని మళ్లీ రెండుగా విడిపోతుంది. అందులో ఒకటి గుండె ముందుభాగానికి, ఒకటి గుండె ఎడమ భాగానికి రక్తాన్ని సరఫరా చేస్తాయి. కుడి ధమని గుండె కుడిభాగానికే రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఈ రెండు కరొనరీ ధమనుల్లో కొవ్వు పేరుకు పోవడం వల్ల పూడికలు ఏర్పడతాయి. ఫలితంగా రక్త ప్రసరణ తగ్గుతుంది.
50 శాతం.. అంతకు ఎక్కువైతే
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో 50శాతం పూడికలు ఏర్పడితే ఛాతీ నొప్పితో పాటు వివిధ హృద్రోగ లక్షణాలు కనిపిస్తాయి. మొత్తం మూడు ధమనుల్లో బ్లాక్స్ ఏర్పడితే దాన్ని.. ‘ట్రిపుల్ వెసల్ డిసీజ్’ అంటారు. ఈ మూడు ధమనుల్లో కూడా 70 శాతం కంటే ఎక్కువ బ్లాకేజీలు ఉన్నా, ఎడమ ప్రధాన
ధమనిలో సగానికి మించి అంతరాలు ఏర్పడినా.. రోగికి ఛాతీ నొప్పి వచ్చినప్పుడు బైపాస్ అనివార్యం అవుతుంది. గుండె రక్తనాళాలకు బ్లాక్లు ఏర్పడినప్పుడే కాదు.. గుండెపోటుతో పాటు వీఎస్డీ (మెకానికల్ కాంప్లికేషన్స్) వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ బైపాస్ చేస్తారు.
బ్లాకేజీ లక్షణాలు
ఈ లక్షణాలను విస్మరించకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. బ్లాక్లను నిర్ధారించడానికి నిపుణులు.. ఈసీజీ, ట్రెడ్మిల్ పరీక్ష లేదా ఎక్సైర్సైజ్ ఈసీజీ, ఇకో కార్డియోగ్రఫీ, కరొనరి యాంజియోగ్రామ్ (దీనిద్వారా 100 శాతం బ్లాకుల నిర్ధారణ జరుగుతుంది) తదితర పరీక్షలను సిఫారసు చేస్తారు. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి వెంటనే చికిత్స ప్రారంభిస్తారు.
బైపాస్ సర్జరీ ఇలా..
బైపాస్ సర్జరీ కోసం సాధారణంగా శరీరంలోని రక్తనాళాలను వినియోగిస్తారు. ప్రత్యేకించి ధమనులు లేదా కాళ్లలో ఉన్న సిరలను ఎంచు కుంటారు. ధమనుల్లో ఎడమ పక్కన ఉన్న రొమ్ము ధమని (ఇంటర్నల్ మామరీ ఆర్టరీ)ని తీసి గుండె ముందు వైపున ఉన్న (లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ) ఎల్ఏడీ ధమనికి వేస్తారు. మిగిలిన ధమనులకు కాలి నుంచి తీసిన సిరలను వేస్తారు. కాలి నుంచి తీసిన సిరలు పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాలు మాత్రమే పనిచేస్తాయి. ఈ క్రమంలో పది సంవత్సరాలు గడిచిన తరువాత మళ్లీ గుండెకు వేసిన సిరల గ్రాఫ్ట్లలో బ్లాక్లు ఏర్పడే అవకాశాలు అధికం. దీనివల్ల రెండోసారి బైపాస్ సర్జరీ అవసరం పడుతుంది. మొదటి సారి బైపాస్ చేయించుకున్న వారిలో పదేండ్ల తరువాత 10 శాతం, 15 ఏండ్ల తర్వాత 15-20 శాతం మందికి బైపాస్ అవసరం పడుతుంది. రెండోసారి బైపాస్ సర్జరీలో కుడి రొమ్ము ధమని లేదా మణికట్టు ధమని వేయడం జరుగుతుంది. లేదంటే, మరో కాలిలోని సిరలను తీసి వాడతారు.
రెండు పద్ధతులు
బైపాస్ సర్జరీని రెండు పద్ధతుల్లో చేస్తారు. అందులో మొదటిది.. ఆన్ పంప్ విధానం. దీనిలో హార్ట్ లంగ్ మిషన్ను ఉపయోగించి గుండె స్పందనను నిలిపేసి.. శస్త్రచికిత్స చేస్తారు. రెండో పద్ధతిలో గుండె స్పందిస్తున్నప్పుడే (బీటింగ్ హార్ట్) బైపాస్ సర్జరీ చేస్తారు. ఇది ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఆధునిక పద్ధతి. మన దేశంలో అత్యధికంగా బీటింగ్ హార్ట్ పద్ధతిలోనే 60 శాతం రోగులకు బైపాస్ సర్జరీలు చేస్తున్నారు. నిజానికి, నిపుణులు సరైన శస్త్రచికిత్స మార్గాన్ని ఎంచుకోగలిగితే.. రెండోసారి సర్జరీ చేయాల్సిన అవసరమే రాదు. రోగి సైతం తనవంతుగా.. జీవనశైలిలో తగినన్ని మార్పులు చేసుకోవాలి.
ఆ పరిస్థితి రాకూడదంటే..
సాధారణంగా సిరలు ఎక్కువ కాలం పనిచేయవు. బైపాస్ సర్జరీలో సిరలు వాడటం వల్ల.. అవి పదీ పదిహేను సంవత్సరాల తరువాత పూడికకు గురవుతాయి. దీనివల్ల రోగికి మరో బైపాస్ అనివార్యం అవుతుంది. కాబట్టి, మొదటిసారి బైపాస్ చేసే సమయంలోనే సాధ్యమైనంత వరకు కాలిలోని సిరలను వాడకపోవడమే మంచిది. సిరలకు బదులుగా రొమ్ము ధమనులు లేదా రేడియల్ ఆర్టరీలను వాడాలి. అంటే మల్టిపుల్ ధమనులను వినియోగించాలి. దీని వల్ల 95 శాతం మేర రెండోసారి బైపాస్ అవసరం పడదు. కాకపోతే, శస్త్ర చికిత్స తర్వాత.. రక్తపోటు, మధుమేహం, కొవ్వు నియంత్రణలో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. వేళకుమందులు వాడాలి. జీవనశైలి లోపాలను పరిహరించుకోవాలి. ఒత్తిడికి లోనుకాకూడదు.
…?మహేశ్వర్రావు బండారి
డాక్టర్ సజ్జ లోకేశ్వర్రావు
సీనియర్ కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్
స్టార్ హాస్పిటల్, హైదరాబాద్