Glaucoma | గ్లోకోమా ప్రపంచవ్యాప్తంగా శాశ్వత అంధత్వానికి ప్రధాన కారణాలలో ఒకటిగా నిలుస్తోంది. ప్రపంచంలో 80 మిలియన్లకు పైగా ప్రజలను ఇది ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా భారతదేశంలో గ్లోకోమా రోగులలో దాదాపు 90 శాతం మందికి ఇది ఉన్నట్లు కూడా తెలియకపోవడం ఆందోళనకర విషయంగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం దృష్టి లోపాలలో దాదాపు 80 శాతం వరకు సరైన సమయంలో గుర్తిస్తే నివారించవచ్చు లేదా చికిత్స చేయవచ్చు. కానీ లక్షణాలు ఎక్కువగా కనిపించకపోవడం వల్ల చాలామంది తీవ్రమైన దృష్టి నష్టం జరిగిన తర్వాతే వైద్యులను సంప్రదిస్తున్నారు. గ్లోకోమా ఒకే ఒక్క వ్యాధి కాదు. ఇది కళ్లలోని ఆప్టిక్ నర్వ్ను (కంటి నుండి మెదడుకు సమాచారాన్ని పంపించే నాడి) ప్రభావితం చేసే వ్యాధుల సమూహం. సాధారణంగా కంటి లోపల ఒత్తిడి పెరగడం లేదా నాడికి సరైన రక్తప్రసరణ లేకపోవడం వల్ల ఈ నాడి క్రమంగా దెబ్బతింటుంది. వయస్సు పెరగడం ఒక ముఖ్యమైన ప్రమాద కారకం అయినప్పటికీ, శిశువులు, పిల్లలు, యువతలో కూడా ఈ వ్యాధి కనిపించే అవకాశం ఉంది.
గ్లోకోమా ప్రారంభ దశలో కనిపించే ముఖ్య హెచ్చరికలలో ఒకటి మసక దృష్టి. కంటిలో ఒత్తిడి పెరగడం వల్ల స్పష్టంగా కనిపించకుండా ఉండటం జరుగుతుంది. విశ్రాంతి తీసుకున్నా లేదా కళ్లద్దాలు మార్చుకున్నా మసక దృష్టి తగ్గకపోతే, వెంటనే కంటి నిపుణుడిని సంప్రదించడం అవసరం. ఇంకో ముఖ్య లక్షణం కాంతుల చుట్టూ వలయాలు కనిపించడం. ముఖ్యంగా రాత్రి సమయంలో లైట్ల చుట్టూ హాలోస్ కనిపించడం గ్లోకోమాకు సంకేతంగా భావించాలి. ఇది కంటి ఒత్తిడిలో మార్పులను సూచిస్తుంది, డ్రైవింగ్ వంటి పనుల్లో ఇబ్బందులను కలిగిస్తుంది. తలనొప్పులు కూడా గ్లోకోమాతో సంబంధం ఉండే అవకాశాలు ఉంటాయి. కంటిలో ఒత్తిడి పెరగడం వల్ల తరచుగా తలనొప్పి వస్తుంది. ఈ నొప్పి కొన్నిసార్లు స్వల్పంగా ఉండొచ్చు, కానీ కాలక్రమేణా తీవ్రంగా మారుతుంది.
తలనొప్పితో పాటు దృష్టి మార్పులు లేదా కంటి అసౌకర్యం ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని రకాల గ్లోకోమాలో, ముఖ్యంగా యాంగిల్-క్లోజర్ గ్లోకోమాలో, కంటి నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఇది గుచ్చినట్లుగా లేదా మంటగా అనిపిస్తుంది. ఇలాంటి తీవ్రమైన నొప్పి ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం అత్యవసరం. వ్యాధి ముందుకు సాగుతున్న కొద్దీ పక్కదృష్టి తగ్గిపోవడం కూడా గమనిస్తారు. దీనిని టన్నెల్ విజన్ అని పిలుస్తారు. దృష్టి పరిధి క్రమంగా కుచించుకుపోతూ చివరికి పూర్తిగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
40 సంవత్సరాల పైబడినవారు, డయాబెటిస్ ఉన్నవారు, అధిక మైయోపియా ఉన్నవారు లేదా కుటుంబంలో గ్లోకోమా చరిత్ర ఉన్నవారు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలి. కంటి ఒత్తిడి కొలత, ఆప్టిక్ నర్వ్ పరీక్షలు వంటి సమగ్ర పరీక్షలు చేయించడం ద్వారా వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. త్వరగా గుర్తించడం ద్వారా చూపును కాపాడుకోవడం సాధ్యమవుతుంది. భారతదేశంలో అంధత్వాన్ని తగ్గించడానికి సమగ్ర చర్యలు అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో కంటి పరీక్షలను అందుబాటులోకి తీసుకురావడం, కంటి వైద్య శిబిరాలు, మొబైల్ క్లినిక్లను ఏర్పాటు చేయడం ముఖ్యం. అలాగే కటారాక్ట్, గ్లోకోమా, డయాబెటిక్ రెటినోపతి వంటి వ్యాధులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. తక్కువ ఖర్చుతో చికిత్సలు, కళ్లద్దాలు వంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజల కంటి ఆరోగ్యాన్ని రక్షించవచ్చని నిపుణులు చెబుతున్నారు.