హైదరాబాద్: గొంతులో సమస్య చాలా చిరాకు తెప్పిస్తుంది. ఈ సమస్యను ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఎదురవుతూనే ఉంటుంది. ఓ సారి గొంతులో గరగర ఇబ్బంది పెడుతుంది. మరోసారి గొంతు నొప్పి వేధిస్తుంది. ఇంకోసారి గొంతులో మంట కుదురుగా ఉండనివ్వదు. ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే పై సమస్యలన్నీ ఒకేసారి వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆ బాధను మాటల్లో వర్ణించలేము.
కొంతమందికి చల్లటి నీళ్లు తాగినప్పుడు, ఏదైనా చల్లటి పదార్థం తిన్నప్పుడు గొంతు సమస్యలు వస్తాయి. కొందరికి చల్లటి పదార్థాలతో పెద్దగా సమస్యలు రాకపోయినా పానీపూరి, బజ్జీలు, మిర్చీలు లాంటి బయటి తిండి తిన్నప్పుడు గొంతులో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇలా గొంతుకు సంబంధించిన ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే ఉపశమనం కలిగించే వంటింటి చిట్కా ఒకటి ఉంది. మరి ఆ చిట్కా ఏంటో తెలుసుకుందామా..?
ఇదిగో చిట్కా..
ఒక పాత్రలో పావు లీటర్ నీళ్లు పోసి దాన్ని పొయ్యిమీద పెట్టాలి. ఆ నీళ్లలో చిన్న అల్లం ముక్క, రెండు యాలకులు, ఓ పదీ పన్నెండు తులసి ఆకులు, పావు స్పూన్ పసుపు వేసి బాగా మరిగించాలి. ఆ మరిగించిన నీటిని వడకట్టి ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగాలి. అయితే.. డయాబెటిస్ ఉన్నవాళ్లు మాత్రం తేనెను కలపపోయినా పర్వాలేదు. ఈ చిట్కా గనుక పాటిస్తే క్షణాల్లోనే మీ సమస్య పరిష్కారమవుతుంది. తక్షణమే మంచి ఉపశమనం లభిస్తుంది.