Fats | భారతీయుల ఆహారపు అలవాట్లలో గత కొన్ని దశాబ్దాలుగా గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు ఇంట్లో వండిన సాంప్రదాయ వంటకాలే ప్రధాన ఆహారంగా ఉండేవి. ప్రస్తుతం వాటి స్థానంలో చిరు తిండ్లు, ప్యాకెట్ స్నాక్స్, ఆన్లైన్ ఫుడ్ డెలివరీలు ఎక్కువగా చోటు దక్కించుకుంటున్నాయి. ఈ మార్పుల కారణంగా ఆహారంలో ఉపయోగించే కొవ్వుల (ఫ్యాట్స్) నాణ్యత, పరిమాణం ఆరోగ్యంపై చూపే ప్రభావం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో మంచి కొవ్వులను ఎంచుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్యాట్స్ ఆరోగ్యానికి హానికరమైనవే అనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే శరీరానికి శక్తిని అందించడం, కణాల నిర్మాణానికి తోడ్పడడం, విటమిన్ ఎ, డి, ఇ, కె వంటి కొవ్వులో కరిగే విటమిన్లను శరీరం గ్రహించేందుకు సహాయపడటం, ఎక్కువసేపు ఆకలి అవకుండా తృప్తి కలిగించడం వంటి కీలక బాధ్యతలను ఫ్యాట్స్ నిర్వహిస్తాయి. అందువల్ల వాటిని పూర్తిగా మానేయడం కాదు, సరైన రకం, సరైన మోతాదులో తీసుకోవడమే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
మోనో అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (ఎంయూఎఫ్ఏ), పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (పీయూఎఫ్ఏ) అధికంగా ఉండే వంటనూనెలు జీవక్రియలకు అనుకూలంగా పనిచేస్తాయి. అనేక వంటనూనెలలో కెరోటినాయిడ్లు, టోకోఫెరాల్స్, టోకోట్రియెనాల్స్, పాలీఫినాల్స్ వంటి సహజ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ఉదాహరణకు పామ్ ఆయిల్లో కెరోటినాయిడ్లు, టోకోట్రియెనాల్స్ సమృద్ధిగా లభిస్తాయి. అదే సమయంలో సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా అనేక సంప్రదాయ ఆహారాలు, వంటనూనెలలో సహజంగానే ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పరిమితుల మేరకు తీసుకుంటే అవి కూడా సమతుల్య ఆహారంలో భాగమే అవుతాయి. ఆహారంలో ఉండే కొవ్వులను ప్రధానంగా కనిపించే కొవ్వులు (Visible Fats), కనిపించని కొవ్వులు (Invisible Fats), పారిశ్రామిక ట్రాన్స్ ఫ్యాట్స్గా విభజిస్తారు. బియ్యం, ధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి ఆహారాల్లో సహజంగా ఉండేవి కనిపించని కొవ్వులు. నెయ్యి, వెన్న, వంటనూనెలు, వనస్పతి వంటి వంట సమయంలో కలిపేవి కనిపించే కొవ్వులు. వీటిని అధికంగా ఉపయోగించడం వల్ల రోజువారీ కొవ్వు వినియోగం తెలియకుండానే పెరిగిపోతుంది. ముఖ్యంగా నూనెలను పదేపదే వేడి చేసి వాడితే హానికరమైన ఆక్సిడేషన్ పదార్థాలు, కొంతమేర ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతాయి.
పాక్షిక హైడ్రోజనేషన్ ప్రక్రియ ద్వారా తయారయ్యే పారిశ్రామిక ట్రాన్స్ ఫ్యాట్స్ ను అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించారు. ఇవి రక్తంలో కొవ్వుల సమతుల్యతను దెబ్బతీసి, రక్తనాళాల పనితీరును ప్రభావితం చేసి గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి. వీటివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనం ఉండదని శాస్త్రీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. పామ్ ఆయిల్ వంటి కొన్ని సహజంగా స్థిరంగా ఉండే నూనెలు అనేక ఆహార పదార్థాల తయారీలో పారిశ్రామిక హైడ్రోజనేషన్ అవసరం లేకుండానే ఉపయోగించవచ్చు కాబట్టి వాటిలో పారిశ్రామిక ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండవు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ పారిశ్రామిక ట్రాన్స్ ఫ్యాట్స్ను తగ్గించే దిశగా పలు చర్యలు చేపట్టింది. వంటనూనెలు, ప్రాసెస్డ్ ఆహారాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ పరిమితిని దశలవారీగా తగ్గించడం, తప్పనిసరి లేబెలింగ్ విధించడం, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రపంచ ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ముందడుగు వేసింది. దీనివల్ల ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పురోగతి సాధించింది.
ప్రస్తుతం ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) దృష్టి కేవలం హానికరమైన కొవ్వులను తొలగించడంపైనే కాకుండా, దేశవ్యాప్తంగా వినియోగించే వంటనూనెలలో కొవ్వు ఆమ్లాల సమతుల్యతను మెరుగుపరచడంపైనా ఉంది. దీనిలో పారిశ్రామిక ట్రాన్స్ ఫ్యాట్స్ను పూర్తిగా తొలగించడం, సమతుల్య ఫ్యాటీ యాసిడ్ కూర్పును ప్రోత్సహించడం, ఆహార పరిశ్రమలలో మార్పులు తీసుకురావడం, వినియోగదారులకు స్పష్టమైన లేబెలింగ్ ద్వారా సరైన సమాచారం అందించడం వంటి అంశాలు ఉన్నాయి. ఆహార పదార్థాలపై సాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ వివరాలను తప్పనిసరిగా ప్రకటించడం వల్ల వినియోగదారులు మంచి ఎంపిక చేసుకునే అవకాశం పెరిగింది. భవిష్యత్తులో అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు కలిగిన ఆహారాలకు ప్యాకెట్ ముందు భాగంలో హెచ్చరిక లేబెల్స్ అమలు చేసే దిశగా కూడా చర్యలు కొనసాగుతున్నాయి.
వ్యక్తిగత నియంత్రణ కంటే ఆరోగ్యకరమైన ఆహార వాతావరణాన్ని సృష్టించడమే దీని లక్ష్యం. 2024లో భారత వైద్య పరిశోధనా మండలి (ICMR)-జాతీయ పోషకాహార సంస్థ (NIN) విడుదల చేసిన డైటరీ మార్గదర్శకాల ప్రకారం ఏ ఒక్క వంటనూనె కూడా అన్ని పోషక అవసరాలను పూర్తిగా తీర్చలేదని పేర్కొంది. ఒమేగా-6, ఒమేగా-3 వంటి అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ను పొందేందుకు వివిధ రకాల నూనెలను మారుస్తూ ఉపయోగించడం లేదా శాస్త్రీయంగా సమతుల్యంగా మిళితం చేసిన నూనెలను వినియోగించడం ఉత్తమమని సూచించింది. దేశంలో గతంలో ప్రాంతానికో ప్రత్యేక వంటనూనె వినియోగించే సంప్రదాయం ఉండేది. ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఆవ నూనె, పశ్చిమ ప్రాంతాల్లో వేరుశెనగ నూనె, దక్షిణ భారతంలో కొబ్బరి నూనె, అలాగే నువ్వుల నూనె, పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వంటి నూనెలు ప్రాంతీయ ఆహార సంస్కృతిలో భాగంగా ఉండేవి. అయితే ఆధునిక జీవనశైలి, ప్రాసెస్డ్ ఆహారాల వినియోగం పెరగడంతో ఈ వైవిధ్యం తగ్గిపోయింది. వివిధ రకాల నూనెలను సమతుల్యంగా ఉపయోగించడం వల్ల శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ అందడంతో పాటు జీవక్రియ కూడా మెరుగుపడుతుంది.
ఆరోగ్యకరమైన వంటనూనెలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండటం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. వీధి ఆహార విక్రేతలు, చిన్న హోటళ్లు, ఆహార తయారీ సంస్థలు, సాధారణ కుటుంబాలు ఆరోగ్యకరమైన నూనెలను వినియోగించాలంటే అవి సరసమైన ధరలో సులభంగా లభించాలి. దీనికోసం వ్యవసాయం, ఆహార పరిశ్రమ, వాణిజ్య విధానాలు, ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలు, యువతలో అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాల వినియోగం పెరగడం మరో ఆందోళనకర అంశంగా మారింది. అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు కలిగిన ఆహారాలు చిన్న వయసులోనే వారి రుచి అలవాట్లను ప్రభావితం చేస్తాయి. అందువల్ల స్పష్టమైన లేబెలింగ్, ప్రకటనల నియంత్రణ, పాఠశాల స్థాయిలో పోషకాహార మార్గదర్శకాలు వంటి చర్యలు భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆహారంలో కొవ్వుల నాణ్యత వ్యక్తిగత అలవాట్లకే పరిమితమైన విషయం కాదు. ప్రజలకు అందుబాటులో ఉండే ఆహార వ్యవస్థపై కూడా అది ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన నూనెలు సులభంగా లభించేలా, స్పష్టమైన సమాచారం ఉండేలా, అందరికీ కొనుగోలు చేయగలిగే ధరలో అందుబాటులో ఉంటే ప్రజలు సహజంగానే మెరుగైన ఆహార ఎంపికలు చేసుకునే అవకాశం పెరుగుతుంది. హానికరమైన కొవ్వులను తగ్గించడంతో పాటు సమతుల్యమైన, పోషక విలువలు కలిగిన కొవ్వులను ప్రోత్సహించడం ద్వారా దేశం ఆరోగ్యకరమైన భవిష్యత్తు వైపు అడుగులు వేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.