ఎండోమెట్రియోసిస్ కావచ్చు
ఎండోమెట్రియోసిస్..మహిళల్లో నెలసరి నొప్పితో వచ్చే తీవ్ర సమస్య. ప్రస్తుత కాలంలో మధుమేహంలా ఇదీ సర్వ సాధారణంగా మారిపోయింది. కాకపోతే జనంలో అవగాహన తక్కువ. ప్రతి పదిమందిలో ఇద్దరు ఈ రుగ్మతతో బాధపడుతున్నారని అంచనా. ప్రపంచవ్యాప్తంగా రెండుకోట్ల మంది మహిళలకు ఎండోమెట్రియోసిస్ సమస్య ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. భారత్లో ఆ సంఖ్య యాభై లక్షల పైమాటే. ఇది కూడా క్యాన్సర్ లాంటిదే. శరీరంలోని ఒక భాగం నుంచి మరో భాగానికి వ్యాపిస్తుంది.
నెలసరి సమయంలో నొప్పి సర్వసాధారణం. కానీ ఆ బాధ పరిమితంగా ఉంటే, అదీ చిన్నపాటి పెయిన్ కిల్లర్తో దారికొస్తే ఎలాంటి సమస్యా లేదు. కానీ కొంతమంది మహిళలు భరించలేనంత నొప్పితో సతమతం అవుతుంటారు. అలాటి పరిస్థితి ఎదురైనప్పుడు.. నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. నిర్లిప్తత అస్సలు పనికిరాదు. దాన్ని ఎండోమెట్రియోసిస్ లక్షణంగా అనుమానించాల్సిందే. ఈ వ్యాధి కారణంగా సంతానలేమితో బాధపడుతున్నవారు ఉన్నారు. ఇబ్బందిని బయటికి చెప్పుకోలేక.. చెప్పినా వైద్యులు సమస్య మూలాలపై దృష్టిసారించక.. రుగ్మత ముదిరిపోయి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న ఉదంతాలు అనేకం. అందుకని, మితిమీరిన నెలసరి నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. అవసరమైతే మనమే, ‘ఎండోమెట్రియోసిస్’గా అనుమానించాల్సిన అవసరాన్ని నిపుణులకు గుర్తు చేయాలి.
ఎండోమెట్రియోసిస్ అంటే..
గర్భాశయం లోపలి పొరను ‘ఎండోమెట్రియం’ అంటారు. నెలసరిలో ఈ పొర నుంచే రక్తస్రావం జరుగుతుంది. అయితే గర్భాశయం లోపల ఉండే ఎండోమెట్రియం పొర మాదిరిగానే, గర్భాశయం బయట కూడా ఒక కణజాలం ఉంటుంది. కొన్నిసార్లు, నెలసరి సమయంలో ఈ కణజాలం నుంచి రక్తస్రావం జరుగుతుంది. దీంతో అక్కడ వాపు ఏర్పడి.. నొప్పిగా అనిపిస్తుంది. ఇలా ఎండోమెట్రియంను పోలిన కణజాలం నుంచి జరిగే రక్తస్రావాన్నే ‘ఎండోమెట్రియోసిస్’ అంటారు. సాధారణంగా ఈ కణజాలం శరీరంలో ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఎక్కువమందిలో పెల్విస్ లేదా పెల్విస్లోని అండాశయం వద్ద ఉంటుంది.
అందుకనే, ఎండోమెట్రియోసిస్ సమస్య వచ్చినప్పుడు అది కేవలం అండాశయం పైన మాత్రమే కాకుండా దానిచుట్టూ ఉన్న పెరిటోనియం, బ్లాడర్, పేగులపైనా ప్రభావం చూపుతుంది. ఎండోమెట్రియోసిస్ కూడా క్యాన్సర్లానే శరీరంలోని అంతర్గత భాగాలకు వ్యాపిస్తుంది. ఫలితంగా మూత్రపిండాలు, కాలేయం తదితర కీలక అవయవాలు విఫలమవుతాయి. ఇది గర్భాశయం, అండాశయంపై ప్రభావం చూపడం వల్ల సంతానోత్పత్తి సమస్యలు ఎదురవుతాయి. ఈ వ్యాధికి కచ్చితమైన కారణాలు తెలియవు. కుటుంబ నేపథ్యాన్ని, జన్యుపరమైన అంశాలను తేలిగ్గా తీసుకోలేం. రుగ్మత మూలాలు తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి.
ప్రభావాలు
ఈ సమస్య మహిళల జీవన శైలిని ప్రభావితం చేస్తుంది. వారి కెరీర్ను దెబ్బతీస్తుంది. తీవ్రమైన నొప్పి కారణంగా టీనేజ్ విద్యార్థినుల గైర్హాజరీ అధికంగా ఉంటుంది. దీంతో చదువుల్లో వెనుకబడతారు. గృహిణుల విషయానికొస్తే.. బాధను పంటి బిగువునే దాచుకుని.. నిత్యం పడుకునే ఉంటారు. ఓ దశలో పైకి లేవడమూ కష్టం అవుతుంది. కుటుంబ నిర్వహణ భారం అవుతుంది. ఏకాగ్రత లోపించడం వల్ల ఉద్యోగ బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించలేరు.
పదోన్నతులు చేజారిపోతాయి. కొన్నిసార్లు కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు ఎండోమెట్రియోసిస్ నొప్పిని ఓ సాకుగా, నాటకంగా భావిస్తారు. ఆ పరిస్థితుల్లో ఓదార్పు కరువై, డిప్రెషన్కు చేరువై ఆత్మహత్యకు పాల్పడుతున్న దాఖలాలూ ఉన్నాయి. దాంపత్య జీవితంలో సైతం సంక్షోభాలు మొదలవుతాయి. సంసారానికి పనికిరాని మహిళగా సమాజం ముద్ర వేస్తుంది. గృహహింసకు ఇదో ప్రధాన కారణం కూడా. అంతిమంగా, ఆలూమగల మధ్య అగాధం ఏర్పడి ఘర్షణలకు, విడాకులకు దారితీయవచ్చు.
నిర్ధారణ పద్ధతులు
సాధారణంగా, సంవత్సర కాలం వరకు ఎలాంటి వ్యాధి లక్షణాలూ కనిపించవు. నెలసరి సమయంలో వచ్చే నొప్పిని బట్టి వ్యాధిని అంచనా వేయవచ్చు. నిష్ణాతులైన వైద్యులు రోగి కుటుంబ నేపథ్యాన్ని బేరీజు వేయడం ద్వారా సులభంగా వ్యాధి లక్షణాలను గుర్తిస్తారు. అబ్డామినల్, వ్జైనల్, బైమాన్యువల్ క్లినికల్ పరీక్షలతో అయినా నిర్ధారించవచ్చు. రెక్టల్ పరీక్షతో కూడా కనిపెట్టవచ్చు. ఈ సమయంలో కొందరు కటిభాగంలో కండరాల నొప్పితో బాధపడతారు. అలాంటి వారికి అనస్తీషియా ఇచ్చి, పెల్విక్ పరీక్ష చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎంఆర్ఐతో సైతం నిర్ధారిస్తారు.
చికిత్స-ఔషధాలు
ఈ వ్యాధిగ్రస్తులకు వివిధ వైద్య విభాగాల సమన్వయంతో చికిత్స చేస్తారు. గైనకాలజిస్ట్, కోలరెక్టల్ సర్జన్, యూరాలజిస్ట్ తదితర వైద్యనిపుణులు ఒక బృందంగా ఏర్పడి.. చికిత్స, శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది. సర్జరీ సమయంలో ఎంతో అప్రమత్తత అవసరం. అటు రోగులకు, ఇటు వైద్యులకు అవగాహన కొరవడితే.. సమస్య ముదిరిపోతుంది. చివరికి, వేరియన్ సిస్ట్లా మారుతుంది. ఫలితంగా, అండాశయంలో ట్యూమర్ ఏర్పడుతుంది.
కొన్నిసార్లు గైనకాలజిస్టులు ఆ ట్యూమర్కు మాత్రమే చికిత్స చేసి, మూలవ్యాధిని వదిలేస్తారు. దీంతో నొప్పి అలానే ఉండిపోతుంది. ఎండోమెట్రియోసిస్కు చాలా ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా ఇంజక్షన్ రూపంలో ఉన్నాయి. అయితే ఈ మందుల వల్ల దుష్పరిణామాలు ఉంటాయి. ఎముకల సాంద్రత దెబ్బతింటుంది అయితే, సమగ్ర చికిత్స అనేది రోగి ఆరోగ్యస్థితి మీద ఆధారపడి ఉంటుంది. అవసరాన్ని బట్టి సర్జరీ చేయాలి. కాబట్టి, సమస్యను తొలిదశలోనే గుర్తించి వైద్యం తీసుకోవడం అన్ని విధాలా ఉత్తమం. సమగ్ర వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా.. ఎండోమెట్రియోసిస్ మాత్రమే కాదు, అనేక రుగ్మతల నుంచి దూరంగా ఉండవచ్చు. ఆరోగ్యకర జీవనశైలి కూడా దీనికి తోడు కావాలి.
లక్షణాలు
…?మహేశ్వర్రావు
బండారి
డాక్టర్ విమీ బింద్రా
ఎండోమెట్రియోసిస్ విభాగం
అపోలో హాస్పిటల్, హైదరాబాద్