ముంబై: కరోనా కష్టకాలంలో చాలా మంది సాంప్రదాయ వైద్యం వైపు మళ్లడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంట్లోనే కషాయాలు చేసుకున్నారు. ఆయుర్వేద మందులను ఆశ్రయించారు. చివరికి వన మూలికలు కరోనాను కట్టడి చేస్తాయంటే వాటి వెంటా పరుగులు పెట్టారు. ఏపీలో ఆనందయ్య మందుకు ఎంత డిమాండ్ ఏర్పడిందో మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అందరి నోళ్లలో బాగా నానిన పదం తిప్ప తీగ. దీని ఆకులు తింటే కరోనా దరికి చేరదన్న ప్రచారం నేపథ్యంలో దీనికి ఎన్నడూ లేని డిమాండ్ ఏర్పడింది. చివరికి కొందరు ఇళ్లలోనే ఈ మొక్కను పెంచుకోవడం ప్రారంభించారు. అతిగా తింటే ఏదైనా విషమే అన్నట్లు ఇప్పుడీ తిప్పతీగతో కూడా అలాంటి ప్రమాదమే ఉన్నదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.
కాలేయానికి డేంజర్
గతేడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఇలా తిప్పతీగ వాడి కాలేయం దెబ్బతిన్న ఆరుగురు పేషెంట్లకు ముంబై డాక్టర్లు చికిత్స అందించారు. వీళ్లు పచ్చకామెర్లు, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్స్కు వచ్చినట్లు డాక్టర్లు చెప్పారు. వీళ్లకు పరీక్షలు నిర్వహించగా.. అందరూ తినోస్పోరా కార్డిఫోలియా (తిప్పతీగ) ఆకులను తిన్నట్లు గుర్తించారు. దీనినే హిందీలో గిలోయ్ అని, సంస్కృతంలో గుడుచి అంటారు.
కడుపులో ఫ్లుయిడ్ నిండిపోవడంతో 62 ఏళ్ల ఓ మహిళ చికిత్స పొందుతూ నాలుగు నెలల తర్వాత మృతి చెందింది. ఇది కాలేయ వైఫల్యానికి సూచిక. ఈ తిప్పతీగ వల్ల కాలేయానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్లు తొలిసారి బయాప్సీ ద్వారా తాము కనుగొన్నట్లు హెపటాలజిస్టు డాక్టర్ ఆభా నగ్రాల్ వెల్లడించారు. వీళ్ల బృందం చేసిన అధ్యయనం తాలూకు ఫలితాలను క్లినికల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ హెపటాలజీ జర్నల్లో ప్రచురించారు.
లివర్ డ్యామేజీ నిజమే..
ఈ అధ్యయనంతో సంబంధం లేని మరో లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఏఎస్ సోయిన్ కూడా తిప్ప తీగ వల్ల కాలేయానికి నష్టం వాటిల్లుతున్నట్లు స్పష్టం చేశారు. తాను కూడా ఇలాంటి ఐదు కేసులను చూసినట్లు చెప్పారు. అందులో ఒకరు చనిపోయారని తెలిపారు. తమ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి చాలా మంది కరోనా సమయంలో తిప్పతీగ ఆకులు తిన్నారు. అయితే వాళ్లలో చాలా మంది కాలేయం దెబ్బతిన్నది అని ఆయన వెల్లడించారు. ఇలా కాలేయ సమస్యలతో వచ్చిన వాళ్లు ఈ తిప్పతీగను తినడం ఆపేసిన రెండు నెలల తర్వాత పూర్తిగా కోలుకున్నారు. నిజానికి కరోనాకు ప్రత్యామ్నాయ మందుగా ఈ తిప్పతీగను ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా సిఫారసు చేసింది.