హైదరాబాద్: గుడ్డు అనేది దాదాపు ప్రపంచమంతా ఎంతో ఇష్టంగా తినే ఆహారం. ఆరోగ్య నిపుణులు కూడా రోజుకు ఒకటి నుంచి రెండు గుడ్లు తినడం మంచిదని ఎప్పుడూ చెబుతుంటారు. కానీ, తాజాగా జరిగిన ఒక పరిశోధనలో మాత్రం గుడ్లు ఎక్కువగా తింటే మధుమేహం బారినపడే ప్రమాదం ఉందని తేలింది. ఎవరైతే రోజుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు తింటారో వారిలో మధుమేహం రిస్క్ 60 శాతం పెరుగుతుందని పరిశోధకులు తేల్చారు. పైగా పురుషుల్లో కంటే మహిళల్లో ఈ రిస్క్ ఎక్కువని తెలిపారు.
18 ఏండ్ల సుదీర్ఘ పరిశోధన..
చైనాలో వయోజనులు అతిగా గుడ్లను ఆహారంగా తీసుకుంటుండటంపై యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా నేతృత్వంలో చైనా మెడికల్ యూనివర్సిటీ, ఖతార్ యూనివర్సిటీ సంయుక్తంగా 1991 నుంచి 2009 వరకు సుదీర్ఘకాలం ఈ అధ్యయనం చేశాయి. టైప్-2 మధుమేహం కేసులు రోజురోజుకు పెరుగుతుండటానికి మన ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని పరిశోధకుడు మింగ్ లీ చెప్పారు. చైనీయులు గత కొన్ని దశాబ్దాలుగా తమ సంప్రదాయ ఆహారపదార్థాలైన ధాన్యాలు, కూరగాయలకు దూరమవుతూ వచ్చారు. క్రమంగా ప్రాసెస్డ్ ఫుడ్స్కు అలవాటుపడ్డారు. చైనాలో మధుమేహుల పెరుగడానికి ఇది కారణమని పరిశోధకులు తేల్చారు.
గుడ్డు రోజూ 50 గ్రాములకు మించితే 60 శాతం మధుమేహం రిస్క్..!
అయితే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్తోపాటు అతిగా గుడ్లను వినియోగించడం కూడా టైప్-2 మధుమేహుల సంఖ్య క్రమంగా పెరిగిపోవడానికి కారణమైనట్లు తమ 18 ఏండ్ల పరిశోధనలో తేలిందని రిసెర్చర్స్ వెల్లడించారు. ఈ 18 ఏండ్ల కాలంలో చైనాలో గుడ్ల వినియోగం రెండింతలు అయ్యిందని తెలిపారు. తరచూ గుడ్లను ఆహారంగా తీసుకునే వారిలో మధుమేహం రిస్క్ పెరుగుతున్నట్లు, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ఎక్కువగా ఉంటున్నట్లు తేలిందని పేర్కొన్నారు. రోజూ 38 గ్రాముల కంటే ఎక్కువ, 50 గ్రాముల కంటే తక్కువ గుడ్లను ఆహారంగా తీసుకునే వారిలో 25 శాతం.. రోజూ 50 గ్రాముల కంటే ఎక్కువగా గడ్లు తినేవారిలో 60 శాతం మధుమేహం రిస్క్ పెరుగుతుందని తేల్చారు.
గుడ్లను ఏ రూపంలో తీసుకుంటే మంచిది..?
చైనా హెల్త్ అండ్ న్యూట్రిషన్ సర్వే పేరుతో జరిగిన తమ పరిశోధనలో సగటున 50 ఏండ్ల వయసున్న 8,545 మంది చైనీయులు పాల్గొన్నారని మింగ్ లీ వెల్లడించారు. మధుమేహం బారినపడకుండా ఉండాలంటే గుడ్లను ఉడకబెట్టుకుని మాత్రమే తినడం ఉత్తమమని, దానికి ఉప్పు, కారం, కొత్తిమీరలాంటివి జోడించి తీసుకోవాలని ఆయన సూచించారు. లేదంటే గుడ్లతో వెజిటెబుల్ ఆమ్లెట్లు చేసుకోవాలని సలహా ఇచ్చారు. గుడ్లను నేరుగా కాకుండా కూరగాయలతో కలిపి తీసుకోవడం ద్వారా రిస్క్ తక్కువన్నారు. గుడ్లతో చేసుకునే డిష్లలో నెయ్యి, నూనె, చీజ్ లాంటివి వాడకపోవడం కూడా ఆరోగ్యానికి మంచిదన్నారు.