Raccoon Dogs | న్యూఢిలీ: కొవిడ్ సంక్షోభం మొదలై మూడేండ్లు అవుతున్నా ప్రపంచ దేశాలు ఇప్పటికీ వైరస్ పుట్టుక ఎక్కడో కనుగొనలేకపోతున్నాయి. వుహాన్లోని ‘రకూన్’ జాతి కుక్కల్లో ఈ వైరస్ ఆనవాళ్లను ఓ అంతర్జాతీయ నిపుణుల బృందం గుర్తించింది. వాటి నుంచి ఇతర జంతువులకు లేదా మనుషులకు సోకి ఉండవచ్చునని లేదా వేరే జంతువుల నుంచే రకూన్ కుక్కలకు వైరస్ సోకి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అధ్యయనంలోని కీలక అంశాన్ని ప్రస్తావిస్తూ ‘న్యూయార్క్ టైమ్స్’ తాజాగా వార్తా కథనం వెలువరించింది. జనవరి 2020లో వుహాన్లోని చేపల మార్కెట్ నుంచి సేకరించిన ‘స్వాబ్స్’ ఫలితాలను యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా, ఉటా, సిడ్నీ, స్క్రిప్స్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకులు విశ్లేషించారు. నిజానికి, వుహాన్ నుంచే వైరస్ ప్రబలిందన్న సంగతి ప్రపంచానికి తెలియగానే వుహాన్లోని చేపల మార్కెట్, కృత్రిమ వైరస్పై పరిశోధనలు జరిపిన ల్యాబ్ను చైనా మూసేసింది. దీంతో చేపల మార్కెట్లోని గోడలు, నేల, జంతువుల్ని తరలించే పరికరాల నుంచి శాంపిల్స్ సేకరించి విశ్లేషించారు.
‘రకూన్ కుక్కల నుంచి సేకరించిన జన్యు సమాచారానికి, వైరస్ మూల కణానికి దగ్గరి పోలికలున్నాయి. వుహాన్ మార్కెట్ నుంచి వచ్చిన జన్యు సమాచారంలో వైరస్ ఆనవాళ్లు కచ్చితంగా ఉన్నాయి. అయితే వుహాన్ ల్యాబ్, చేపల మార్కెట్ జంతువుల జన్యు సమాచారం ఏ కాలం నాటిది అన్నది తెలియాల్సి ఉన్నది’ అని యూనివర్సిటీ ఆఫ్ ఉటాకు చెందిన వైరాలజిస్ట్ స్టీఫెన్ గోల్డ్స్టెయిన్ తెలిపారు. రకూన్ కుక్కల నుంచి నేరుగా మనుషులకు సోకిందనటానికి ఆధారాల్లేవని, ఆ కుక్క నుంచి వైరస్ మరో జంతువులోకి ప్రవేశించి, ఆ తర్వాత మనుషులకు ప్రబలి ఉండొచ్చునని నిపుణులు బృందం తెలిపింది. ఆ కుక్కల జన్యు సమాచారంలో గుర్తించిన వైరస్కు, అక్కడి మనుషుల కొవిడ్ వైరస్ నమూనాలకు దగ్గరి పోలికలున్నాయని పేర్కొన్నది.
భారత్లో మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 843 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 4 నెలల్లో నమోదైన రోజూవారీ కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,389కు చేరుకున్నది. దేశంలో ఎక్స్బీబీ 1.1.6 వేరియంట్ వల్లే ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వేరియంట్ కేసులు ఇప్పటివరకు భారత్లో 76 నమోదైనట్టు ఇండియన్ సార్క్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం(ఇన్సాకాగ్) పేర్కొన్నది.