ధైర్యం.. తీవ్ర క్యాన్సర్ రోగినైనా బతికిస్తుంది. భయం.. చిన్న అల్సర్ ఉన్నా చంపేస్తుంది. ఇప్పుడు కరోనా, దాని తాలూకు భయం ‘క్యాన్సర్’లా పరిణమించింది. కొద్దిపాటి దగ్గు, జలుబు కూడా మనుషుల్ని వణికిస్తున్నాయి. ఏ నిపుణులూ ధ్రువీకరించకుండానే, ఏ పరీక్షలూ చేయించుకోకుండానే కరోనా బారిన పడ్డామేమో అనే నిర్ధారణకు వచ్చేస్తున్నారు చాలామంది. ఫలితంగా తీవ్ర ఒత్తిడికి గురవుతూ ప్రాణం మీదికి తెచ్చుకొంటున్నారు. మరికొందరు ‘కరోనా పాజిటివ్’ అని నిర్ధారణ కాగానే హైరానా పడుతున్నారు. ఇదొక ‘పానిక్ అటాక్’లా మారింది. ఈ పరిస్థితుల్లో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? మన ఆత్మీయులకు ఎలాంటి ధైర్యాన్ని ఇవ్వాలి?
‘పానిక్ అటాక్’.. భయాందోళనల కారణంగా శరీర వ్యవస్థలో వచ్చే కుదుపు. చాలామంది దీన్ని ‘హార్ట్ అటాక్’గా పొరబడతారు. నిజానికి, ఈ రెండు లక్షణాలూ దగ్గర దగ్గరగా ఉన్నా తీవ్రతలో మాత్రం చాలా తేడా ఉంటుంది. ‘ఏదో జరిగిపోతున్నది. నాకేదో అయిపోతున్నది..’ అన్న భయమే మనిషి ప్రాణం మీదికి తెస్తున్నది.
పానిక్ అటాక్ నేపథ్యం ఇదీ..
తీవ్ర ఒత్తిడి.అంతులేని ఆందోళన.హద్దులు తెలియని భయం. ఇవన్నీ శత్రుమూకలా విరుచుకు పడతాయి.
ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ మూకుమ్మడి దాడి ఫలితంగా బాధితుడు కొన్నిసార్లు అచేత స్థితిలోకి వెళ్లిపోతాడు. సాధారణంగా శరీరానికి ఓ రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఏదైనా ప్రమాదం ముంచు కొచ్చినప్పుడు, మెదడు శరీరానికి ‘పోరాడు లేదా పారిపో’ అన్న సంకేతాన్ని ఇస్తుంది. దీన్ని ‘ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్’ అంటారు. ఈ విపత్కర పరిస్థితుల్లో శరీరంలో ‘ఎపీనెఫ్రీన్’ అనే హార్మోన్ ఉన్నట్టుండి పెద్ద మొత్తంలో విడుదలవుతుంది. తక్షణం, మనలో విపరీతమైన ఆందోళన మొదలవుతుంది.
మన చుట్టూ ఉన్నవారిలో 20-25 శాతం మంది ఏదో ఒక దశలో ‘పానిక్ అటాక్’కు లోనవుతుంటారు. అనూహ్య పరిణామాలు ఎదురైనప్పుడు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, కోలుకోలేని దెబ్బ తగిలినప్పుడు మనసు గిలగిలా తన్నుకొంటుంది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురవుతారు.
ఆ పరిస్థితుల్లో మనిషి అచేతన స్థితిలోకీ వెళ్లిపోవచ్చు. కొందరిలో ఛాతినొప్పి కనిపిస్తుంది. దీంతో గుండెపోటేమో అనుకుంటారు. ప్రస్తుతం ఇలాంటి కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి.
లక్షణాలు ఇవీ
‘పానిక్ అటాక్’కు గురైనప్పుడు కాళ్లూ చేతులు తీవ్రంగా వణుకుతాయి. గుండెదడ పెరుగుతుంది. శిరోభారం వేధిస్తుంది. తలంతా తేలికై పోయినట్టు (లైట్ హెడెడ్నెస్) ఉంటుంది. అర్జెంటుగా మూత్రం వస్తున్నట్లు అనిపించడం, అస్థిమితంగా ఉండటం, అకస్మాత్తుగా చలి జ్వరం అనిపించడం, నిద్రమత్తు లాంటిది ఆవహించడం, ఒళ్లంతా మొద్దుబారిన భావన, అంతా కలలో జరుగుతున్నట్టు ఉండటం, ఎదురుగా ఉన్న దృశ్యాలను కూడా స్పష్టంగా చూడలేక పోవడం, తీవ్రమైన భయం, మృత్యుభీతి.. మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. అందరిలో ఈ అన్ని లక్షణాలూ కనిపించాలని లేదు. ఆ ప్రభావం ఎంతసేపు ఉంటుందన్నదీ చెప్పలేం. కొందరిలో పది నిమిషాలలోపు కావచ్చు, ఇంకొందరిలో అంతకంటే ఎక్కువ సమయమే ఉండవచ్చు. ఈ తీవ్ర ఒత్తిడిలోనే గుండె ఆగిపోయిన కేసులూ ఉన్నాయి.
పలు కారణాలు
మానసిక కారణాలతోపాటు భౌతిక జబ్బులుకూడా పానిక్ అటాక్ను కలిగిస్తాయి. ఉదా॥కు హైపర్ థైరాయిడిజం, హైపర్ పారా థైరాయిడిజం వంటి సమస్యలున్నప్పుడు, ఒంట్లో చక్కెర శాతం పడిపోయే పరిస్థితి (హైపోైగ్లెసీమియా) నెలకొన్నప్పుడు, హృద్రోగం ఉన్నప్పుడు కూడా ‘పానిక్ అటాక్’కు ఆస్కారం ఉంటుంది. మధుమేహం, యాంటీ మలేరియా ఔషధాలు వాడుతున్నవారు కూడా ఆ పరిధిలోకే వస్తారు. మితిమీరిన మద్యం మత్తు, ధూమపాన వ్యసనాలవల్ల కూడా ఇలాంటి అటాక్ జరుగవచ్చు. బిహేవియర్ థెరపీ (బీటీ), కౌన్సెలింగ్, ఔషధాలతో రోగిని మామూలు స్థితికి తీసుకొస్తారు వైద్యులు.
ఏదైనా ప్రమాదమే
‘పానిక్ అటాక్’ని అధిగమించడానికి ఆత్మవిశ్వాసమే దివ్యౌషధం. ఆరోగ్యవంతమైన జీవనశైలి, వ్యాయామంతో దీని బారినుంచి తప్పించుకోవచ్చు. మిగిలిన వారితో పోలిస్తే, రోజూ వ్యాయామం చేసేవారిలో మానసిక ఒత్తిడి తక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ధూమపానం, మద్యపానం, కెఫిన్ వంటివి పానిక్ అటాక్స్ను ప్రేరేపిస్తాయి కాబట్టి, వీటికి దూరంగా ఉండాలి. యోగా, ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ మనసుకు ఒత్తిడిని తట్టుకునే శక్తినిస్తాయి. కనుక, వీటిని అలవాటు చేసుకోవాలి.
మనోబలమే మందు
పానిక్ అటాక్, హార్ట్ అటాక్ల లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉన్నా తీవ్రతలు మాత్రం పూర్తి వేరుగా ఉంటాయి. పానిక్ అటాక్లో తాత్కాలికంగా మాత్రమే ఊపిరి ఆడనట్టుగా అనిపిస్తుంది. హార్ట్ అటాక్ మరింత ప్రాణాంతకం. రెండు అటాక్లూ హఠాత్తుగా మొదలవుతాయి. పానిక్ అటాక్ 10 నిమిషాలనుంచి పావుగంట వరకు ఉంటుంది. సమయం గడిచేకొద్దీ పరిస్థితి మెరుగవుతుంది. కానీ, హార్ట్ అటాక్ లక్షణాలు సమయం గడిచేకొద్దీ తీవ్రమవుతాయి. రెండు సమస్యలకు మనోబలమే మందు.
ఏం చేయాలి?
ముందు భయం పోవాలి!
కరోనా అనగానే మరణమే అన్న దుష్ప్రచారం పెరిగిపోవడంతో ఎక్కడ లేని అపోహలు, భయాలు చోటుచేసుకొంటున్నాయి. ఈ కారణంగానే ‘పానిక్ అటాక్స్’ పెరిగి పోతున్నాయి. ఈ అవగాహనా రాహిత్యంలో అందరి పాత్ర ఉంది. ‘మీకు కొవిడ్ వచ్చిందా? హాస్పిటల్స్లో బెడ్లు లేవట? ఎందుకు ఇంట్లో ఉంచారు? ఆక్సిజన్ శాచురేషన్ 94 ఉందా? ఇలా రకరకాల ప్రశ్నలతో వేధిస్తారు. తలా తోకా లేని సలహాలతో అయోమయానికి గురిచేస్తారు. కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయితే చాలు, రోగుల్లో ఒక విధమైన ప్రాణభయం మొదలవుతున్నది. అందులోనూ, ఎప్పుడూ నలుగురి మధ్య తిరిగే వ్యక్తులు ఆసుపత్రిలో చేరడంతో ఒంటరితనం ఫీలవుతున్నారు. ఇలాంటివారిలో భయాందోళనలు పోగొట్టేందుకు ఐసీయూలో, వార్డుల్లో కొవిడ్ రోగులకు సైక్రియాట్రిస్ట్ల ద్వారా తగిన అవగాహన కల్పిస్తున్నాం. టెన్షన్ తగ్గించుకున్న వారిని ఇంట్లోనే ఉంచి చికిత్స ఇస్తున్నాం. ఫోన్ద్వారా రోజువారీ పరిస్థితిని తెలుసుకుని, తగిన వైద్య సలహాలు ఇస్తున్నాం.
గోపిచంద్ మన్నం
కార్డియాలజీ నిపుణుడు
స్టార్ హాస్పిటల్స్