Chikungunya | కీళ్ల నొప్పులు, వాపు, బిగుతు వంటి లక్షణాలు చికున్గున్యా నుంచి కోలుకున్న తర్వాత కూడా కొన్ని వారాలు, నెలలు కొనసాగడం కొంతమందిలో కనిపిస్తుంది. జ్వరం, దద్దుర్లు తగ్గిపోయిన తర్వాత కూడా నొప్పి తిరిగి రావడంతో చాలామందికి మళ్లీ చికున్గున్యా సోకిందా అనే అనుమానం కలుగుతుంది. అయితే, సాధారణంగా ఇది కొత్తగా వైరస్ సోకడం కాకుండా, గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్ తర్వాత కీళ్లలో కొనసాగుతున్న వాపు, రోగనిరోధక వ్యవస్థలో మార్పుల కారణంగా ఏర్పడే సమస్యగా నిపుణులు చెబుతున్నారు. చికున్గున్యా రెండోసారి సోకడం చాలా అరుదుగా జరుగుతుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత శరీరంలో వైరస్ను నిరోధించే యాంటీబాడీలు దీర్ఘకాలం పాటు రక్షణ కల్పిస్తాయి. అందువల్ల నెలలు లేదా సంవత్సరాల తర్వాత మళ్లీ కీళ్ల నొప్పులు కనిపిస్తే, అది కొత్త ఇన్ఫెక్షన్ కంటే పోస్ట్-చికున్గున్యా కీళ్ల వాపు కారణంగా ఉండే అవకాశమే ఎక్కువగా ఉంటుంది.
చికున్గున్యా సమయంలో వైరస్ రక్తంలో చురుకుగా ఉన్న దశ సాధారణంగా కొద్దికాలమే ఉంటుంది. అయితే వైరస్కు సంబంధించిన ఆర్ఎన్ఏ అవశేషాలు, ప్రోటీన్లు కీళ్లలోని కొన్ని కణజాలాల్లో మిగిలిపోవడం వల్ల స్థానికంగా మళ్లీ మళ్లీ వాపు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా కీళ్లలోని సైనోవియల్ కణాలు, మాక్రోఫేజ్లలో వైరస్కు సంబంధించిన అవశేషాలు ఉండటం ఈ సమస్యకు ఒక కారణంగా చెబుతున్నారు. మరోవైపు, చికున్గున్యా సమయంలో శరీరంలో ఏర్పడే తీవ్రమైన రోగనిరోధక ప్రతిస్పందన కొంతమందిలో క్రమంగా నియంత్రణ తప్పుతుంది. ఫలితంగా కీళ్లను ప్రభావితం చేసే వాపు కొనసాగుతుంది. ఇంటర్ల్యూకిన్-6, టీఎన్ఎఫ్-ఆల్ఫా వంటి వాపును పెంచే సైటోకైన్లు ఎక్కువగా ఉండటం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ తరహా లక్షణాలు కూడా కనిపిస్తాయి. అలాగే చికున్గున్యా తర్వాత వచ్చే కీళ్ల సమస్యలు అందరిలో ఒకే విధంగా ఉండవు. కొంతమందిలో నొప్పి, బిగుతు కొంతకాలం కనిపించి తగ్గిపోతే, మరికొందరిలో అవి మళ్లీ మళ్లీ తిరిగి వస్తాయి. అందుబాటులో ఉన్న అధ్యయనాల ప్రకారం సుమారు 10 నుంచి 15 శాతం మందిలో ఇన్ఫెక్షన్ తర్వాత ఏడాదికి పైగా కీళ్ల సమస్యలు కొనసాగే అవకాశం ఉందని తేలింది. కొన్ని అధ్యయనాల్లో మూడు సంవత్సరాల వరకు కూడా కీళ్ల నొప్పులు తిరిగి వచ్చిన సందర్భాలు నమోదయ్యాయి.
45 ఏళ్లకు పైబడినవారు, మహిళలు, ఇప్పటికే ఆస్టియోఆర్థరైటిస్ వంటి కీళ్ల సమస్యలు ఉన్నవారిలో ఈ తరహా దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో మార్పులు, ముఖ్యంగా చలి లేదా అధిక తేమ, శారీరక శ్రమను ఎక్కువగా చేయడం, మానసిక ఒత్తిడి, ఇతర ఇన్ఫెక్షన్లు వంటి అంశాలు నొప్పి మళ్లీ పెరగడానికి కారణం అవుతాయి. చికున్గున్యా తర్వాత కీళ్ల నొప్పులను తగ్గించుకోవడానికి వైద్యుల సూచనతో చికిత్స తీసుకోవడం ముఖ్యం. అవసరాన్ని బట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు లేదా తీవ్రమైన, దీర్ఘకాలిక సమస్యల్లో కొన్ని ప్రత్యేక మందులను వైద్యులు సూచిస్తారు. స్వయంగా పెయిన్కిల్లర్లు తీసుకోవడం కంటే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం మంచిది. కీళ్ల కదలికను కొనసాగించేందుకు తేలికపాటి వ్యాయామాలు, స్ట్రెచింగ్, హైడ్రోథెరపీ వంటి తక్కువ ప్రభావం కలిగించే శారీరక కార్యకలాపాలు ఉపయోగపడతాయి. ఉదయం సమయంలో కీళ్ల బిగుతు ఎక్కువగా ఉంటే వెచ్చని కాపడం కొంత ఉపశమనాన్ని అందిస్తుంది. ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు ఉండే సమతుల్య ఆహారం కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా ఉంటుంది.
చికున్గున్యా నుంచి కోలుకున్న తర్వాత కూడా కీళ్ల నొప్పులు నాలుగు నుంచి ఆరు వారాలకు మించి కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం అవసరం. కీళ్లలో స్పష్టమైన వాపు, ఎర్రదనం, వేడి కనిపించడం, ఉదయం సమయంలో 45 నిమిషాలకుపైగా బిగుతు ఉండటం లేదా నడవడం, రోజువారీ పనులు చేసుకోవడంలో ఇబ్బంది కలిగేంత నొప్పి ఉంటే రుమటాలజిస్ట్ సలహా తీసుకోవడం మంచిది. చికున్గున్యా తర్వాత కీళ్ల నొప్పులు తిరిగి రావడం అంటే వైరస్ మళ్లీ శరీరంలోకి వచ్చిందని లేదా ఇతరులకు ఇన్ఫెక్షన్ వ్యాపించే పరిస్థితి ఉందని అర్థం కాదు. అయితే నొప్పి పదేపదే వస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా, వైద్యుల సూచనలతో తగిన చికిత్స తీసుకోవడం ద్వారా కీళ్లపై ఒత్తిడిని తగ్గించుకుని సమస్యను నియంత్రించవచ్చు.