Omicron : కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. వైరస్ బారి నుంచి తమనుతాము కాపాడుకోవడానికి ప్రజలు మందులను అతిగా వాడరాదని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ కోరారు. ఒమిక్రాన్ సాధారణ జలుబు లాంటిది కాదని, దీన్ని తేలికగా తీసుకోరాదని స్పష్టం చేశారు.
ఒమిక్రాన్తోనే కేసుల పెరుగుదల ప్రారంభమైందని, ఈ వేరియంట్ డెల్టా స్ధానంలో ప్రాబల్య స్ట్రెయిన్గా ముందుకు రానుందని చెప్పారు. మందుల వాడకం హేతుబద్ధంగా ఉండాలని, ఆయా మందులను అతిగా వాడటం దుర్వినియోగం చేయడం పట్ల తాము ఆందోళన చెందుతున్నామని డాక్టర్ పాల్ పేర్కొన్నారు. ఇంటి వద్ద చికిత్స పొందే వారు గోరువెచ్చని నీటితో పుక్కిలించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, కర్నాటక, యూపీ, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 159 దేశాల్లో కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు. గత రెండువారాల్లో ఎనిమిది యూరప్ దేశాల్లో కరోనా కేసులు రెట్టింపయ్యాయని చెప్పారు. ఇక బుధవారం నాటికి భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య పది లక్షలకు చేరువైంది.