న్యూఢిల్లీ : పలు వ్యాధులున్న 60 ఏండ్లు పైబడిన వారు కొవిడ్-19 వ్యాక్సిన్ బూస్టర్ డోసుల కోసం డాక్టర్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం అధికారిక ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రికాషన్ డోసు తీసుకునే ముందు సీనియర్ సిటిజన్లు డాక్టర్ సర్టిఫికెట్ను దాఖలు చేయాల్సిన అవసరం లేదని, అయితే బూస్టర్ డోసు తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలని పేర్కొంది.
2022 జనవరి నుంచి నూతన వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనున్న నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మంగళవారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో సమావేశమైన అనంతరం ఈ ఉత్తర్వులను కేంద్రం జారీ చేసింది. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో సీనియర్ సిటిజెన్ల ఆదాయ వివరాలతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.
వ్యాక్సిన్ను కొనుగోలు చేసే స్ధోమత ఉన్నవారు ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలను వినియోగించుకోవాలని కోరింది. కోవిన్ ఖాతా ద్వారా ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు, 60 ఏండ్లు పైబడి పలు వ్యాధులతో బాధపడే వారు బూస్టర్ డోసులను తీసుకోవచ్చని పేర్కొంది. ఇక జనవరి నుంచి 15-18 ఏండ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అర్హులైన చిన్నారులు కోవిన్ యాప్లో తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.