Padmasanam | మనం నిత్యం చేసే, చేయాల్సి అత్యుత్తమ వ్యాయామాల్లో యోగా ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఎంతో ప్రాచుర్యం లభించింది. యోగాతో ఎన్నో మొండి వ్యాధులను నయం చేసుకోవచ్చునని యోగా నిపుణులు సెలవిస్తున్నారు. యోగా కేవలం శరీరంపైనే కాకుండా మెదడు, ఆత్మను వృద్ది చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా వ్యాధి నిరోధకవ్యవస్థను మెరుగుపర్చుకోవడమే కాకుండా వృద్ధాప్యంలో వచ్చే బోలు ఎముకల వ్యాధి, కీళ్ల నొప్పుల నుంచి దూరంగా ఉండవచ్చు.
నిత్యం యోగాతో ప్రయోజనాలు..
పద్మాసనంతో లాభాలు..
పద్మం ఆకారంలో ఉండే ఈ ఆసనం నిత్యం అలవర్చుకోవడం ద్వారా మనస్సును మనం చేసే పనిపై లగ్నం చేయవచ్చు. మోకాలి కీళ్లను బలోపేతం చేయడానికి పద్మాసనం చాలా మంచిది. బలహీనమైన మోకాళ్లు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు నిత్యం 10 నిమిషాల పాటు పద్మాసనం చేయడం అలవాటు చేసుకోవాలి. ఫలితంగా మోకాలి క్షీణత తగ్గుతుంది. అలాగే ఆర్థరైటిస్ నివారణకు కూడా సాయపడుతుంది.
ఒత్తిడి, ఆందోళన, ఇతర మానసిక రుగ్మతలకు దారితీసే అంశాలను పద్మాసనం చేయడం ద్వారా దూరం చేసుకోవచ్చు. నిత్యం 10 నిమిషాలు పద్మాసనం చేయడం వల్ల మరింత చురుకుగా ఉంటారు. శక్తివంతమైన అనుభూతి పొందుతారు. విరామ సమయంలో కూడా పద్మాసనం చేయవచ్చు.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో పద్మాసనం చేయడం వల్ల మరింత మేలు పొందవచ్చునంటున్నారు నిపుణులు. ఈ ఆసనం మనల్ని రోజంతా ఎనర్జిటిక్గా ఉంచుతుంది. పద్మాసనంలో కూర్చోవడం వల్ల శారీరక, మానసిక అలసట తొలిగిపోతుంది. శరీరం శక్తి స్థాయి కూడా పెరుగుతుంది.
నిద్ర పోవడంలో ఇబ్బంది పడుతున్నవారు, నిద్రలేమితో బాధపడుతున్నవారు పద్మాసనాన్ని తప్పనిసరిగా అలవర్చుకోవాలి. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చి నిద్ర విధానాన్ని క్రమబద్ధీకరిస్తుంది. పద్మాసనం భంగిమ మనలో ఒత్తిడిని తగ్గించి మంచి నిద్ర పోయేలా చేస్తుంది. త్వరగా నిద్రపోవడానికి, రాత్రంతా మంచి నిద్రను పొందడానికి పద్మాసనం ఎంతో సాయపడుతుంది.
జీర్ణక్రియను మెరుగుపర్చడంలో గ్రేట్గా ఉపయోగపడుతుంది. అజీర్తి, అసిడిటీ, గ్యాస్, మలబద్ధకం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు మూలమైన పొట్టను ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా చేస్తుంది. పద్మాసనంలో పెగు కదలికలు క్రమబద్ధీకరించి జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
పైన పేర్కొన్న ప్రయోజనాలతోపాటు నిత్యం పద్మాసనం చేయడం ద్వారా తొడలు, మోకాలు, కాళ్లు బలంగా తయరై కండరాల ఒత్తిడి తగ్గుతుంది. దీర్ఘకాలంలో కీళ్ల నొప్పులను నివారిస్తుంది.