హైదరాబాద్: మధుమేహం ఉన్నవాళ్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏది తినొచ్చో, ఏది తినగూడదో తెలుసుకుని ఆరోగ్యానికి ఎలాంటి హానీ లేదు అనుకున్న వాటిని మాత్రమే తమ మెనూలో చేర్చుకుంటారు. అయితే, కోడిగుడ్ల విషయంలో మాత్రం షుగర్ పేషెంట్లకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. తాము కోడిగుడ్లు తింటే గుండె జబ్బులు వస్తాయని చాలామంది డయాబెటిక్ రోగులు భయపడుతున్నారు. అందుకే గుడ్లను పూర్తిగా దూరం పెడుతున్నారు. కానీ అందులో వాస్తవం లేదని తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో తేలింది.
మధుమేహుల్లో కోడిగుడ్లు తినని వారికంటే అవి తినే వారిలోనే గుండె వ్యాధుల ముప్పు తక్కువగా ఉన్నదని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ప్రీ-డయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారిలో గుడ్డువల్ల గుండె సమస్యలు తగ్గినట్లు అధ్యయనకారులు వెల్లడించారు. ‘సిడ్నీ యూనివర్సిటీ’ పరిశోధకులు జరిపిన ఈ అధ్యయనం ప్రకారం గుడ్డు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదే. ఏడాదిపాటు వారానికి 1 నుంచి 12 గుడ్ల మధ్య తినే డయాబెటిక్ బాధితులకు గుండె జబ్బుల ముప్పు తక్కువట.
పరిశోధన జరిగిందిలా..
ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిని పరిశోధకులు మొత్తం మూడు గ్రూపులుగా విభజించారు. వారిలో ఒక్కొక్కరికి గరిష్టంగా వారానికి 12 గుడ్లు, కనిష్టంగా ఒక గుడ్డు చొప్పున ఇచ్చారు. ఇలా మూడు నెలలపాటు వారికి గుడ్లు అందించారు. చివరిగా అందరి ఆరోగ్యాన్ని పరిశీలించారు. ఈ పరిశీలనలో వారానికి 12 గుడ్లు తిన్నవారిలో కూడా గుండె సంబంధిత వ్యాధులకు కారణమయ్యే ప్రమాదకారకాలేవీ కనపించలేదట.
అందుకే గుడ్లను ఆహారంలో భాగం చేసుకోవడంవల్ల డయాబెటిక్ రోగులకు ముప్పేమీ లేదని పరిశోధకులు తేల్చారు. అందులోని ప్రొటీన్లు, సూక్ష్మ పోషకాలు డయాబెటిక్ రోగుల ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయని నిర్ధారణకు వచ్చారు.