‘మంప్స్’ అంటే ఏమిటి? ఎందుకొస్తాయి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఈ వ్యాధి ‘మిక్సో వైరస్ పరోటెడిస్’ అనే వైరస్ వల్ల వస్తుంది. దీనినే ‘గవద బిళ్లలు’, ‘చెంప గడ్డలు’ అనీ పిలుస్తారు. చెవి ముందు, కింద, దవడ భాగం వరకు విస్తరించి ఉన్న పరోటిడ్ లాలాజల గ్రంథి వాచిపోయి నొప్పిగా అనిపిస్తుంది. దీనివల్ల జ్వరం, తలనొప్పి, చెవినొప్పి మొదలవుతాయి. నోరు పూర్తిగా తెరిచి ఆహారం మింగడం కష్టం అవుతుంది. అరుదైన సందర్భాల్లో వాంతులు, కడుపునొప్పి రావచ్చు.
ఆ వ్యాధి నోటి నుంచి గాలి ద్వారా విస్తరిస్తుంది. తుమ్ము, దగ్గు, ఎంగిలి.. వాహకాలుగా పనిచేస్తాయి. వైరస్ శరీరంలో ప్రవేశించిన రెండుమూడు వారాలకు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. రోగం సోకిన పదిమందిలో ఒకరికి మెదడువాపు రావచ్చు. నలుగురిలో ఒకరికి వృషణాలు వాచిపోతాయి. నొప్పిగానూ ఉంటుంది. సమస్య యుక్త వయసులో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగుల వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల భవిష్యత్తులో పిల్లలు పుట్టకపోవచ్చు. ఇరవై వేలమందిలో ఒకరికి చెముడు కూడా వస్తుంది. పదివేలమందిలో ఒకరు మరణిస్తారు. పిల్లలకు ఎంఎంఆర్ టీకాలను ఇప్పించడం ద్వారా వ్యాధి నియంత్రణ కొంతమేర సాధ్యమే.