Health | మా పాపకు ఆర్నెల్లు. జ్వరంగా ఉందంటే పీడియాట్రిషన్ దగ్గరకు తీసుకెళ్లాం. జలుబు, దగ్గు లాంటివేం లేవు. పరీక్షలు చేస్తే యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందని తెలిసింది. యాంటిబయాటిక్స్ ఇస్తే జ్వరం తగ్గింది. అయినా కూడా ఇంకా వేరే టెస్టులు, స్కాన్లు చేయాలని వైద్యులు సూచించారు. చిన్నపాపకు ఈ టెస్టులు, స్కాన్లు చేయించడం అవసరమా? సలహా ఇవ్వండి.
– ఓ పాఠకురాలు
మీరు చెప్పిన వివరాల ప్రకారం మీ పాపకు యూరినల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తెలుస్తున్నది. మామూలుగా జలుబు, దగ్గుతో జ్వరం ఉన్నట్లయితే వాటికి సంబంధించిన వైరస్ కారణంగా భావించొచ్చు. కానీ, జలుబు లేకుండా జ్వరం వస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ కావొచ్చని అనుమానిస్తారు. అటువంటి సమయంలోనే మీ వైద్యుడు యూరిన్ టెస్టులు చేయించారు.
యూరిన్ ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయ్యింది. అది మూత్రాశయానికే పరిమితమయ్యిందా? లేక మూత్రపిండాల వరకు పాకిందా? అనే విషయం తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. అంతేకాకుండా మూత్రనాళాలు, మూత్రపిండాలు, మూత్రాశయంలో ఏమైనా పుట్టుకతోనే నిర్మాణపరమైన లోపాలేమైనా ఉన్నాయేమో పరిశీలిస్తారు. ఇంకా ఎంసీయూజీ (మైక్చురేటింగ్ సిస్టోయూరెథ్రోగ్రామ్) చేయడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకవేళ మూత్రపిండాల్లో తయారైన మూత్రం మూత్రనాళాల ద్వారా మూత్రాశయంలోకి చేరుతుంది.
మూత్రాశయం నుంచి మూత్రం తిరిగి మూత్రనాళాల్లోకి రాకూడదు. అలా రావడం వల్ల తరుచూ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. అందుకే టెస్టులు చేస్తారు. ఇన్ఫెక్షన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకునేందుకు డీఎంఎస్ఏ (డైమెర్క్యాప్టో సక్సినిక్ యాసిడ్) స్కాన్ చేస్తారు. దీనిద్వారా కిడ్నీల్లో స్కార్ ఏమైనా ఏర్పడిందా? అని తెలుసుకునేందుకు కూడా టెస్టులు చేయిస్తారు. కాబట్టి ఈ టెస్టులన్నీ చేయించడం మంచిది.
డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్