పెద్దల్లో చాలా సాధారణంగా కనిపించే గుండె జబ్బు కరోనరీ ఆర్టెరీ డిసీజ్. మన శరీరంలో గుండె ఒక పంపులా పనిచేస్తుంది. రక్తాన్ని శరీరంలోని అన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను కరోనరీ ఆర్టెరీస్ (హృదయ ధమనులు) అంటారు. మొత్తం మూడు కరోనరీ ఆర్టెరీలు ఉంటాయి. ఇవి జీవితాంతం గుండెకు నిరంతరాయంగా రక్తాన్ని సరఫరా చేస్తూనే ఉంటాయి. అయితే, హృదయ ధమనుల్లో కొవ్వు, క్యాల్షియం ప్లాక్స్ పేరుకోవడం, రక్తంలో అవరోధాలు లాంటివి వాటిని ఇరుకుగా మారుస్తాయి. ఒక్కోసారి రక్త సరఫరాను మొత్తానికే అడ్డుకోవచ్చు కూడా. దీంతో అకస్మాత్తుగా గుండెపోటు వస్తుంది. లక్షణాలను గుర్తించి తొలిదశలోనే చికిత్స తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే గుండెకు తీవ్రమైన హాని జరుగుతుంది. గుండెకు అండగా నిలిచే చికిత్సల్లో ప్రధానమైంది యాంజియోప్లాస్టీ.
Heart Angioplasty | అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ స్థాయులు, ధూమపానం, ఒత్తిడితో కూడిన జీవితం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు గుండె రోగాల ముప్పునకు ప్రధాన కారణాలు. గుండెకు రక్తం సరఫరా చేసే ధమనుల్లో కొవ్వు, క్యాల్షియం ప్లాక్స్ పేరుకుపోవడం, రక్తంలో అవరోధాల మూలంగా రక్తనాళాలు ఇరుకుగా మారిపోతాయి. మధ్య వయస్కులు, పెద్దల్లో మాత్రమే రక్తంలో అవరోధాలు, గుండె జబ్బుల లక్షణాలు కనిపిస్తాయని మొదట్లో అనుకునేవాళ్లు. కానీ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం ఇరవైల వయసు నుంచే మొదలవుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది. వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. అలా యువతరంలో గుండెజబ్బులు పెరిగిపోవడానికి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం కారణమవుతుంది.
ఛాతీ మధ్యలో పట్టేసినట్టు ఉంటుంది. ఎడమ భుజం గుంజినట్టుగా నొప్పి ఉంటుంది. ఇంకా దవడ నొప్పి, చెమట, తల తిరగడం, శ్వాస ఆడకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండె రక్తనాళాల్లో 70 శాతం, అంతకంటే ఎక్కువ అవరోధాలు ఉంటే ఏదైనా శారీరక శ్రమ చేస్తున్నప్పుడు ఈ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక రక్తనాళాలు అకస్మాత్తుగా మూసుకుపోయినప్పుడు అన్ని లక్షణాలు తీవ్రంగా బాధిస్తాయి. ఇదే గుండెపోటుకు దారితీస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్గా పిలుస్తారు.
గుండెపోటు ఓ అత్యవసర పరిస్థితి. గుండెపోటు సమయం పెరిగేకొద్దీ హృదయ కండరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఇలాంటప్పుడు వీలైనంత త్వరగా గుండెకు రక్త సరఫరా జరగడం చాలా కీలకమైన అంశంగా మారుతుంది.
పైన చెప్పిన లక్షణాలతోపాటు గుండెపోటు నిర్ధారణకు ఈసీజీ స్కానింగ్ అవసరం అవుతుంది. అయితే చాలావరకు మొదటి ఈసీజీ స్కానింగ్ సాధారణంగానే తేలుతుంది. కాబట్టి గుండెపోటు నిర్ధారణకు కొంతకాలం తర్వాత మళ్లీ ఈసీజీ చేయించాలి. ఈసీజీకి అదనంగా ఎకోకార్డియోగ్రఫీ, ట్రోపోపిన్ లాంటి రక్త పరీక్షలు కూడా గుండెపోటు నిర్ధారణలో ఉపయోగకరంగా ఉంటాయి. కాగా శరీరంలో ప్రధాన ధమనిలో చీలిక ఉండే అవోర్టిక్ డిసెక్షన్, ఊపిరితిత్తుల్లో రక్త సరఫరాకు అవరోధాలు ఉండే పరిస్థితి ‘పల్మనరీ ఎంబాలిజం’ కూడా గుండెపోటు లక్షణాలనే కలిగి ఉంటాయి. కాబట్టి రోగికి ప్రాణాంతకమైన వివిధ జబ్బులను గుర్తించడానికి కొన్నిసార్లు ట్రిపుల్ రూల్ ఔట్ సీటీ యాంజియోగ్రఫీ ప్రయోజనకరంగా ఉంటుంది.
కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, గుండెకు రక్తం సరఫరా అయ్యే నాళాల్లో అవరోధాల కారణంగా గుండెపోటు వస్తుందన్న విషయం తెలిసిందే. ఈ సమస్యకు మూలం ఏంటంటే.. రక్త ఫలకికలు (ప్లేట్లెట్స్) ఒక దగ్గర గుత్తులుగా పేరుకుపోయి రక్త నాళాల్లో అవరోధం ఏర్పడటం. కాబట్టి ప్లేట్లెట్లు ఒక దగ్గర పేరుకోకుండా, సమీకరణం చెందకుండా ఉండే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. చాలా ఏండ్లుగా బాధా నివారిణిగా వాడుతున్న యాస్పిరిన్ ప్లేట్లెట్లు గుత్తులుగా ఏర్పడకుండా నివారించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఒక్క లక్షణంతోనే యాస్పిరిన్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టింది. యాస్పిరిన్ కాకుండా క్లోపిడోగ్రెల్, ప్రాసుగ్రెల్, టికాగ్రెలార్ లాంటి చాలా ప్రభావవంతమైన సంప్రదాయ ఔష ధాలూ అందుబాటులో ఉన్నాయి. స్టాటిన్స్ను కూడా వైద్యులు సిఫారసు చేస్తారు. ఇక గుండెపోటు నిర్ధారణ అయ్యాక చేయాల్సిన కచ్చితమైన చికిత్స త్రాంబోలైటిక్ థెరపీ. ఇందులో భాగంగా 4వ లైన్ లేదా ప్రాథమిక యాంజియోప్లాస్టీ ద్వారా రక్తనాళాల్లో అవరోధాలను నిర్మూలిస్తారు.
గుండెపోటు లక్షణాలు కనిపించగానే వీలైనంత త్వరగా రోగిని దవాఖానకు తీసుకువెళ్లాలి. తొలిదశలోనే రోగ నిర్ధారణ చేయించుకుంటే కచ్చితమైన చికిత్స దొరుకుతుంది. లేకుంటే సమయం మించిపోయే కొద్దీ బాధితుడికి తీవ్రమైన హాని చేసినవాళ్లం అవుతాం. లక్షణాలను పట్టించుకోకపోతే రక్తనాళాల్లో రక్తస్రావం పెరిగిపోతుంది. ఇలాంటప్పుడు కార్డియాలజిస్ట్ రక్తనాళాల్లో అవరోధాలను తొలగించడానికి ఇంజెక్షన్ చేస్తారు. దీనివల్ల రోగికి తొలిదశలోనే కచ్చితమైన చికిత్స లభిస్తుంది. మంచి హృద్రోగ నిపుణులు అందుబాటులో లేనప్పుడు స్థానిక ఆరోగ్య కేంద్రాల్లో ఇంజెక్షన్ చికిత్స విధానాన్ని అనుసరిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగకరం కూడా.
దీన్ని క్యాథ్ల్యాబ్లో చేస్తారు. గుండెపోటు లక్షణాలు కనిపించిన వెంటనే రోగి దవాఖానలో చేరినప్పుడు అందుబాటులో ఉంటే కార్డియాలజిస్ట్ ప్రైమరీ యాంజియోప్లాస్టీకి వెళ్లడం మంచిది. దీన్ని క్యాథ్ల్యాబ్లో స్థానిక అనెస్థీషియా ఇవ్వడం ద్వారా చేస్తారు. చేతి లేదా కాలులోని ధమని గుండా ఓ చిన్నగొట్టాన్ని పంపించడం ద్వారా ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. ఈ గొట్టం గుండా కాథెటర్ను పంపిస్తారు. ఇంకా రక్తనాళంలో అవరోధం ఎంతమేరకు ఉందో కనుక్కోవడానికి ఓ రంగును కూడా ఇంజెక్ట్ చేస్తారు. దీన్నంతటినీ ఎక్స్ రే తెరపై గమనిస్తూ ఉంటారు. ఒకవేళ అవరోధం శాతం మరీ ఎక్కువగా ఉంటేమాత్రం, ఆ రక్తనాళంలోకి ఓ తీగను పంపిస్తారు. బెలూన్ చొప్పించి రక్తనాళాన్ని పెద్దగా అయ్యేలా చేస్తారు. చాలా సందర్భాల్లో స్టెంట్గా పిలిచే మందుల పూత ఉన్న లోహపు గొట్టాన్ని అమరుస్తారు. ఇది గుండెకు రక్త సరఫరా సాఫీగా సాగేలా రక్తనాళాలను పునరుద్ధరిస్తుంది. కొన్నిసార్లు థ్రాంబోసక్షన్ అనే ప్రత్యేకమైన పరికరాలతో రక్తంలో అవరోధాలను నొక్కుతారు. ఇంకొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో రోటాబ్లేషన్ లేదా ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ లాంటి ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా రక్తనాళాల్లో పేరుకుపోయిన క్యాల్షియంను విచ్ఛిన్నం చేస్తారు.
ప్రాథమిక యాంజియోప్లాస్టీ తర్వాత రోగులను ఒకటిరెండు రోజులు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచుతారు. ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తారు. గుండె రక్తాన్ని సరఫరా చేసే సామర్థ్యాన్ని బట్టి రోగికి కొంతకాలం విశ్రాంతిని ఇవ్వాల్సి ఉంటుంది. గుండె పనితీరు మెరుగుపడటానికి, స్టెంట్లో అవరోధాలు రాకుండా నివారించడానికి, కొలెస్ట్రాల్ను, రక్తంలో చక్కెర స్థాయులను, రక్తపోటును అదుపులో ఉంచడానికి హృద్రోగులు అవసరమైన మందులు వాడాల్సి ఉంటుంది.
వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. రక్తపోటు, షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్ స్థాయులను అదుపులో ఉంచుకోవాలి. నిపుణుల పర్యవేక్షణలో తగిన వ్యాయామం చేయాలి. కార్డియాలజిస్ట్ దగ్గర కాలానుగుణంగా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే గుండె ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు. గుండె రక్తనాళాల్లో అవరోధాలు అభివృద్ధి చెందకుండా నివారించుకోవచ్చు.
యాంజియోప్లాస్టీ చికిత్స తర్వాత వైద్యులు ఏడాది వరకు రెండు యాంటీ ప్లేట్లెట్ ఔషధాలను సూచిస్తారు. ఆ తర్వాత చాలా కేసులలో గుండెకు సంబంధించిన మందులతోపాటు రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ అదుపులో ఉంచడానికి యాస్పిరిన్ జీవితాంతం వాడాల్సి ఉంటుంది. మందులు వాడటంతోపాటు రోగులు ఆరోగ్యకరమైన జీవనశైలి కొనసాగించాలి. క్రమం తప్పని వ్యాయామం, సమయానుకూలంగా పరీక్షలు చేయించుకోవడం, ఒత్తిడి లేకుండా చూసుకోవడం వీటిలో ప్రధానమైన అంశాలు. ఇలాచేస్తే గుండెజబ్బులు ఉన్నవాళ్లు కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.
– డాక్టర్ కె. శశి శ్రీవాస్తవ్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్