డిమెన్షియా అంటే చిత్తవైకల్యం.. వృద్ధాప్యంలో ఈ సమస్య ఎక్కువ మంది ఎదుర్కొంటారు. ఇది మెదడులోని కణాలు దెబ్బతినడం వల్ల వస్తుంది. వృద్ధాప్యం వచ్చినా డిమెన్షియా బారినపడొద్దంటే ప్రతిరోజూ వ్యాయామం చేయాల్సిందేనని ఫ్రాన్స్ పరిశోధకులు అంటున్నారు. ప్రతిరోజూ వ్యాయామం చేసేవారిలో ఇన్సులిన్ నియంత్రణలో ఉంటుందని, బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) స్థాయిలు తక్కువగా ఉంటాయని, తద్వారా మెదడు కణాలు సురక్షితంగా ఉంటాయన్నారు. దీనివల్ల వృద్ధాప్యంలోనూ డిమెన్షియా ముప్పు ఉండదని తేల్చారు. ఈ అధ్యయన ఫలితాలు ‘న్యూరాలజీ’ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి.
ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 134 మందిని ఎంచుకున్నారు. ఇందులో 69 మందికి ఎలాంటి మతిమరుపు సమస్యలు లేవు. ఏడాదికాలంపాటు వారి ఫిజికల్ యాక్టివిటీని పరిశీలించారు. వారి మెదడును స్కానింగ్ చేసి, రిపోర్టులను అధ్యయనం చేశారు. వారి బీఎంఐ, ఇన్సులిన్ స్థాయిలు, కొవ్వుశాతం, బీపీ, ఇతర కారకాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు.
కాగా, అత్యధిక శారీరక శ్రమ చేసిన వ్యక్తులు వారి మెదడులో తక్కువ మొత్తంలో శారీరక శ్రమ ఉన్న వ్యక్తుల కంటే ఎక్కువ మొత్తంలో బూడిదరంగు పదార్థం కలిగి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అల్జీమర్స్ బారినపడిన వారి మెదడులో ప్రాంతాలను పరిశీలించినప్పుడు ఈ బూడిద రంగు పదార్థం తక్కువగా ఉంది. అంటే ఎవరైతే తక్కువ శారీరక శ్రమ చేశారో వారిలో డిమెన్షియా ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. ఈ పరిశోధనా ఫలితాలు జ్ఞాపకశక్తి, ఆలోచనా నైపుణ్యాల్లో వయస్సు సంబంధిత క్షీణతను నివారించేందుకుగానూ వ్యూహాలను అభివృద్ధి చేయడంలో తమకు మార్గనిర్దేశం చేస్తాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన గెరాల్డిన్ పోయిస్నెల్ పేర్కొన్నారు.