న్యూ ఢిల్లీ: మెదడు.. మన శరీరంలోని అన్ని అవయవాలను నియంత్రిస్తుంది. అందుకే మెదడును మానవ శరీరంలో ప్రధాన అంగం అని పిలుస్తారు. శరీరంలో జరిగే అన్ని క్రియలకు మెదడుతో సంబంధం ఉంటుంది. జీర్ణాశయం, గుండె, లివర్, కిడ్నీల పనితీరును నియంత్రించే శక్తి మెదడుకు ఉంటుంది. అందుకే మెదడు ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టిపెట్టాల్సిందే. దీనికోసం ఆరు రకాల పదార్థాలను తీసుకోవాలని హార్వర్డ్కు చెందిన న్యూట్రిషనిస్టులు సూచించారు. వీటిని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడడంతోపాటు మెదడు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.
1. డార్క్ చాక్లెట్స్..
డార్క్ చాక్లెట్స్ కొంచెం చేదుగా ఉన్నా ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇందులో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని రోజూ తీసుకుంటే కుంగుబాటు సమస్య 70శాతం తగ్గుతుంది. మెదడు చురుగ్గా మారుతుంది.
2.సుగంధ ద్రవ్యాలు..
మన వంటగదిలో లభించే పసుపు, అల్లం, కుంకుమపువ్వులాంటి సుగంధ ద్రవ్యాలు మెదడు పనితీరు మెరుగుపర్చడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడి, కుంగుబాటునుంచి రక్షిస్తాయి. అలాగే, బ్రెయిన్ కెమిస్ట్రీని మెరుగుపరుస్తాయి. కుంకుమ పువ్వును రోజూ తీసుకోవడం వల్ల మానసిక కుంగుబాటునుంచి ఉపశమనం లభిస్తుంది.
3. డ్రైఫ్రూట్స్..
బాదాం, జీడిపప్పు, వాల్నట్స్, పిస్తాల్లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే, జిగురును పెంచి కీళ్ల ఆరోగ్యానికి దోహదపడుతాయి. గుండె ఆరోగ్యాన్ని కూడా ఇవి మెరుగుపరుస్తాయి. వాల్నట్స్లో లభించే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్లోగల యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థాన్ని మెరుగుపరుస్తాయి. రోజూ పిడికెడు డ్రైఫ్రూట్స్ను రోజూ తీసుకుంటే మెదడు ఆరోగ్యం బాగుంటుంది.
4.అవకాడో..
ఇది భారతదేశంలోనే అత్యంత ఖరీదైన పండు. ఇందులో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మెగ్నీషియం వల్ల తీవ్రమైన కుంగుబాటునుంచి ఉపశమనం లభిస్తుంది. మెగ్నీషియం లోపం వల్ల డిప్రెషన్ సమస్య పెరుగుతుందని పలు అధ్యయనాల్లో కూడా తేలింది.
5.పులియబెట్టిన ఆహారాలు..
ఫర్మెంటెడ్ ఫుడ్స్ లేదా పులియబెట్టిన ఆహారాల్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఆపిల్ పళ్లరసం, పళ్లరసం (ఆపిల్ రసం), కిమ్చి (చైనీస్ క్యాబేజీ), కొంబుచా (తియ్యటి నలుపు లేదా గ్రీన్ టీ), బార్లీ లాంటి తృణ ధాన్యాలు, హార్డ్ జున్ను, బ్లూ చీజ్ (పాలు), యోగర్ట్ లాంటివి తీసుకోవాలి. ఇవి గట్ ఫంక్షన్ను మెరుగుపర్చడం వల్ల మనోవ్యాకులత తగ్గిపోతుంది. పులియబెట్టిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల జంతువుల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుందని 2016లో నిర్వహించిన 45 అధ్యయనాల్లో వెల్లడైంది.
6. ఆకుకూరలు..
పాలకూర, బచ్చలికూర, గోంగూర, కొత్తిమీరలాంటి ఆకుకూరలు మనకు తక్కువ ధరలో లభిస్తాయి. ఇందులో ఫోలేట్, ఐరన్, విటమిన్ బీ 9, పీచుపదార్థం పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు ఇందులో ఉండే పోషకాల వల్ల జ్ఞాపకశక్తి క్షీణతలో తగ్గుదల నెమ్మదిస్తుంది. మెదడు ఆరోగ్యం బాగుంటుంది.