ప్రపంచవ్యాప్తంగా దాదాపు 135 కోట్ల మంది యువత వినికిడి సమస్యల బారినపడే ప్రమాదంలో ఉన్నారని బిఎంజే గ్లోబల్ హెల్త్ అనే జర్నల్లో వచ్చిన ఒక స్టడీ చెప్తోంది. అమెరికాలోని కరోలినా మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు పాల్గొన్న ఈ స్టడీ ఏం చెప్తోందంటే..12 నుంచి 34 ఏళ్ల వయసు ఉన్నవాళ్లు హెడ్ఫోన్, ఇయర్బడ్స్ ద్వారా ఎక్కువ సేపు సంగీతం వినడం, పెద్ద శబ్ధాలు వెలువడే ఫంక్షన్లు, సంగీత ప్రదర్శలకు వెళ్లడం వల్ల వినికిడి సమస్యలను కొని తెచ్చుకుంటున్నారట.
‘ప్రపంచవ్యాప్తంగా యువతలో పెరుగుతున్న వినికిడి సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వాలు, పరిశ్రమలు, పౌర సమాజం దృష్టి పెట్టాలి. సురక్షితమైన వినికిడి పద్ధుతులను ప్రమోట్ చేయాలి’ అని ఈ స్టడీలో పాల్గొన్న పరిశోధకులు తెలిపారు. దాదాపు 43 కోట్ల మంది వినికిడి సమస్యలతో బాధపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.
హెడ్ఫోన్లు, ఇయర్బడ్స్ ద్వారా మ్యూజిక్ వింటున్నప్పుడు చాలామంది105 డెసిబెల్స్ వరకు సౌండ్ పెంచుతారు. అదే సంగీత ప్రదర్శనల్లో 104 నుంచి 112 డెసిబెల్స్ శబ్దాలు వెలువడుతాయి. మామూలుగా అయితే పెద్దవాళ్లు 80 డెసిబెల్స్, పిల్లలు 75 డెసిబెల్స్ కంటే ఎక్కువ ఉన్న శబ్దాలు వినొద్దు.