‘ఇప్పటి తరానికి మరీ చాదస్తం. ఇల్లంతా అద్దంలా ఉంచుకోవాలంటారు. పిల్లలకు మరీ అంత శుభ్రం కూడా మంచిది కాదు. వాళ్లు అన్నిరకాల వాతావరణాలకూ అలవాటు పడితేనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది’.. కాస్త అటూ ఇటుగా ఈ మాటలు చాలాసార్లు వింటూనే ఉంటాం. ఇందులో వాస్తవం ఎంతో తెలుసుకోవాలనుకున్నారు ‘లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్’ పరిశోధకులు. ఈ విషయం మీద విస్తృతమైన పరిశోధనలు చేసిన తర్వాత వాళ్లు తేల్చిన విషయాలు ఇవీ.. మన ఇండ్లలోని సూక్ష్మజీవులు, రోగనిరోధకశక్తిని పెంచడంలో ఏమాత్రం తోడ్పడవు. కాబట్టి, వాటిని తరిమేయడం వల్ల నష్టం లేదు; ఈ తరహా సూక్ష్మజీవులకంటే టీకాలవల్లే మన రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది; బయట పచ్చని వాతావరణంలో కనిపించే సూక్ష్మజీవులు కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతాయని చెప్పలేం! అలాగని ఇంటిని అద్దంలా ఉంచేందుకు నిరంతరం రసాయనాలను (ఫ్లోర్ క్లీనర్స్, రూమ్ ఫ్రెష్నర్స్…) వాడుతూ ఉంటే మాత్రం ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. శుభ్రత మంచిదే కానీ… దాన్ని సాధించే పద్ధతికూడా సహజంగా ఉండాలన్నమాట!