కాచిగూడ,జూన్ 17: ఉద్యోగాల పేరుతో డబ్బులు దండుకున్న వ్యక్తిని కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కాచిగూడ అడ్మిన్ ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఎల్లయ్య కుమారుడు జెర్రిపోతుల బాల్రాజు(42)వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. గోల్నాక,కాచిగూడ,చెప్పల్బజార్ ప్రాంతాలకు చెందిన 8 మంది మహిళలు జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు. కొన్ని నెలల క్రితం బాల్రాజు ఆ మహిళలకు పరిచయం అయ్యాడు. మీ పిల్లలకు జీహెచ్ఎంసీలో కామాటి, స్వీపర్,సూపర్వైజర్ లాంటి ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. బాల్రాజు మాటలకు ఆకర్శితులైన 10 మంది మహిళలు ఎనిమిది నెలల్లో రూ.5 లక్షలకుపైనే ఇచ్చారు. నెలలు గడుస్తున్నా పిల్లలకు ఉద్యోగం రాలేదు. దీంతో మహిళలు అతన్ని నిలదీయంతో తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు కాచిగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాల్రాజును అదుపులో తీసుకుని గురువారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.జీహెచ్ఎంసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానన్న అసలు సూత్రదారి శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.