కవుల్లో ఎంతో వైవిధ్యం-వారి కవితల్లాగే! కొందరు సామాజిక సమస్యలను ఎండగడితే, మరి కొందరు భావుకత్వంలో తెలియాడతారు. ఎవరు ఎలాంటి కవిత్వం రాసినా అది చదువరులలో స్పందన కలిగించేందుకే! అయితే కవులు ఏ కోవకు చెందినావారైనా, వారు అనుభూతి చెంది రాయకపోతే, ఆ కవిత్వం ఉద్దేశిత పాఠకులలో ఆ అనుభూతి కలిగించలేదు. కవులు ఎంత గాఢంగా తమ కవిత్వం పట్ల అనురక్తి కలిగి ఉంటే అంత ప్రభావశీలంగా వారి కవిత్వం ఉంటుంది.
కవులు రాసేందుకు మథనపడాలి. ఒక్కో పదాన్నీ శిల్పంలా చెక్కాలి. అందులో వారి హృదయ లయ సంగీతంలా వినిపించాలి. వారి ఆత్మ వారి కవితల్లో ప్రతిఫలించాలి.అలా జనించిన కవిత్వం ఉత్తమ స్థాయిలో ఉంటుంది. కవులకు తమ కవిత్వం పట్ల చక్కని అభిరుచి ఉండాలి. జీవితం పట్ల సమ్యక్ దృక్పథం ఉండాలి. తమ కవిత్వం చదివే పాఠకుల పట్ల గౌరవం ఉండాలి. ముఖ్యంగా కవిత్వం పట్ల నిబద్ధత ఉండాలి.అపుడా కవిత్వం ఉత్తమోత్తమంగా విరాజిల్లుతుంది. తమ పేరు చూసుకోవాలనే ఉత్సుకత, గొప్ప పేరు సంపాదించుకోవాలనే తపన రెండూ వేరు. కేవలం పేరు చూసుకుంటే చాలనుకుంటే ఉత్తమ కవిత్వం రాయలేరు. గొప్ప పేరు సంపాదించుకోవాలంటే అందుకు నిజాయితీగా కృషి చేయాలి. గొప్ప కవుల రచనలు చదవడం అందులో ఒక భాగం మాత్రమే! జీవితా న్ని పరిశీలించే ఆసక్తి ఉండాలి. సమాజం పట్ల బాధ్య త ఉండాలి. తమకంటూ ఒక ప్రత్యేక వైఖరి ఆ కవిని భిన్నంగా నిలబెడుతుంది. కవి సంస్కారం అతని రచనల్లో ప్రతిబింబిస్తుంది.
కవి ప్రాపంచిక దృక్పథం అతని కవిత్వానికి నిం డుతనం తెస్తుంది. ముందుగా భాషాశుభ్రత, పదసంపద, వాక్య నిర్మాణ కౌశలం పెంపొందించుకోవడం కవి తొలి మెట్టు. తర్వాత ఎంత సుందరంగా కవితా భవంతి నిర్మిస్తాడో అతని నిరంతర కృషిపై ఆధారపడి ఉంటుంది. కవిత్వాన్ని సీరియస్గా తీసుకోవడమంటే, జీవితాన్ని సీరియస్గా తీసుకోవడమే! అలా నిబద్ధతతో కవిత్వం రాసినట్టయితే ఆ కవి తప్పక కవన జగత్తులో తన ముద్ర వేయగలడనడంలో ఎలాంటి సందేహం లేదు!!
-దండమూడి శ్రీచరణ్
98661 88266