తల్లి గర్భం నుంచి భూమ్మీదికి వచ్చినప్పుడు మానవుడి జీవితం మొదలవుతుంది. ప్రాణోత్క్రమణం జరిగి శరీర పతనంతో భూగర్భం చేరుకోవడంతో ఆ జీవితం పరిసమాప్తమవుతుంది. ఆ మధ్యకాలంలో మానవుడి ప్రశాంతతను కొల్లగొట్టడానికి ఈషణ త్రయం, అరిషడ్వర్గాలు మొదలైనవి ఎన్నో కమ్ముకుంటాయి. వాటివల్ల ఒక్కోసారి జీవితమే అతలాకుతలమవుతుంది. అందుకే అలాంటివాటిని జయించాలన్నారు. యధార్థానికి వాటిని జయించడానికి గానీ, తట్టుకోవడానికి గానీ ఎంతో మానసిక ధైర్యం కావాలి. ఈషణ త్రయం అంటే దారేషణ, ధనేషణ, పుత్రేషణ. దారేషణ అంటే భార్య మీద బలమైన మోహం. ధనేషణ అంటే ధనం పట్ల తీరని దాహం. పుత్రేషణ అంటే సంతానం మీద వ్యామోహం. ఈ మూడూ మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వాటిని ఎదుర్కొని నిలబడ్డాడా, మనిషి జీవితం ఉన్నతంగా సాగిపోతుంది. వాటికి లోబడితే జీవితం దుర్భరం అవుతుంది.
ఈషణ త్రయంలో ధనేషణ ప్రభావం తీవ్రం అని చెప్తారు పెద్దలు. సంపాదన వెంట పరుగులు తీస్తూ మనిషి ఎలా జీవించాలో మర్చిపోతున్నాడు. సంపాదించిన ధనాన్ని కాపాడుకోవడానికి నానా తంటాలూ పడుతుంటాడు. ధనేషణ ప్రభావం గురించి శేషప్ప కవి రచించిన ప్రసిద్ధమైన నరసింహ శతకంలోని పద్యం స్పష్టంగా తెలియజేస్తుంది.
సీ॥ తల్లిగర్భము నుండి ధనము తేడెవ్వడు
వెళ్లిపోయెడినాడు వెంటరాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని
మెరుగు బంగారంబు మ్రింగబోడు
విత్తమార్జన చేసి విర్రవీగుట కాని
కూడబెట్టిన సొమ్ము కుడువబోడు
పొందుగా మరుగైన భూమిలోపల బెట్టి
ధానధర్మములేక దాచిదాచి
తే॥ తుదను దొంగలకిత్తురో దొరలకగునొ!
తేనె జుంటీగలీయవా తెరువరులకు
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
పై పద్యంలో ధనేషణ మనిషిని ఎంత ప్రలోభానికి గురిచేసి, ఎలాంటి అనుచిత కృత్యాలకు పాల్పడేలా చేస్తుందో చిత్రీకరించాడు కవి. తల్లి కడుపులోంచి భూమ్మీద పడేటప్పుడు ఎవ్వడూ ధనాన్ని తీసుకురావడం లేదు. పుట్టిన కొన్నేండ్లకు డబ్బు అవసరం గుర్తించి సంపాదిస్తాడు. ఎంతో కష్టపడి కూడబెట్టిన డబ్బు ఆ వ్యక్తి చనిపోయేటప్పుడు వెంట ఉండదు. సంపాదన అంతా ఇక్కడే వదిలిపెట్టి ఉత్త చేతులతో వెళ్లవలసి ఉంటుంది. అంటే ఏ మానవుడూ తొలిజన్మ నుంచి ఈ జన్మకు ధనాన్ని తీసుకురావడం లేదు. ఈ జన్మ నుంచి మరుజన్మకు తీసుకుపోవడమూ లేదు.
ధనంతో అవసరాలు తీరుతాయి. కూడు, గూడు మొదలైనవి లభిస్తాయి. కానీ, మౌలిక అవసరాలు తీరాక మానసిక సంయమనం చాలక మనిషి ఆలోచన ఆడంబరం మీదికి, విలాస జీవనం, అధికారం మీదికి పోతుంది. వీటికి విపరీతమైన డబ్బు కావాలి కాబట్టి, ధనం సంపాదించే క్రమంలో ధర్మానికి తిలోదకాలిచ్చి పక్కదారులు తొక్కుతాడు. దురాశకు లోనవుతాడు. ఫలితంగా సాటివారి సానుభూతి కోల్పోతాడు. ఎంత శ్రీమంతుడైనా మామూలు అన్నమే తింటాడు. పెట్టె నిండా బంగారం ఉందని, ఆహారంగా బంగారం తింటాను అంటే కుదురుతుందా?
పద్యంలోని తొలి రెండు పాదాలు మననం చేయదగినవి. దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగితే మనసు దృఢత్వం రెట్టింపై ధనేషణను జయించవచ్చు. లేకపోతే, రోజురోజుకూ బలహీనత పెరుగుతుంది. ధనంపై వ్యామోహంతో వింతగా ప్రవర్తిస్తుంటాడు. ‘ధనమెచ్చిన మదమెచ్చును’ అని హెచ్చరించాడు కవి. ఇక ఎవరినీ లక్ష్యపెట్టడు. పోని తను సంపాదించిన సొమ్మును అనుభవిస్తాడా? అంటే అదీ ఉండదు. సంపాదనలోనే వయసైపోతుంది. తనకు కాకపోయినా, తర్వాతి తరాలకు ఎప్పటికైనా చెందుతుందిలే అనుకొని ఆ ధనాన్ని భూమిలో పాతిపెడతాడు. కానీ ఆ సొమ్ము ఏ దొంగలు దోచుకుంటారో ఎవరికి ఎరుక? తేనెటీగలు ఎంతో కష్టపడి తేనెను సేకరిస్తే, బాటసారులు దోచుకోవడం లేదా! ధనమూ అంతే, ఎవరి పాలవుతుందో చెప్పలేం! అందుకే, ధార్మికంగా సంపాదించి డబ్బును సద్వినియోగం చేయడం ఒక్కటే మంచి లక్షణం.
– డాక్టర్ వెలుదండ
సత్యనారాయణ
94411 62863