ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో నీటి గోస తెలియని ఊరు లేదంటే అతిశయోక్తి కాదేమో. ఉత్తర తెలంగాణకు తలాపునే గోదావరి, దక్షిణ తెలంగాణకు పాదాల కింద తుంగభద్ర, కృష్ణమ్మలు పారినా వానకాలంలో కూడా పంటలు ఎండిపోయేవి. కానీ గత ఏడేండ్లుగా తెలంగాణలో ఏర్పాటైన సాగునీటి వనరులతో ఇప్పుడు మండువేసవిలోనూ రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో, చెరువుల్లో, కాల్వల్లో, బావుల్లో నీళ్లు కళకళలాడుతున్నాయి.
గజ్వేల్ నియోజకవర్గంలో పుట్టి, పారే రెండు ప్రధానమైన వాగులలో గోదావరి జలాలు పరుగెడుతున్నాయి. సిద్దిపేట జిల్లా ప్రస్తుత మర్కూక్ మండలం ఊరచెరువు కింద పుట్టి కొడకండ్ల, కూడవెల్లి ద్వారా ప్రవహించి మానేరులో కలిసే కూడవెల్లి వాగు మండువేసవిలో నీటితో కళకళలాడుతుండటమే మంచి ఉదాహరణ. ప్రస్తుతం 46 చెక్డ్యామ్లలో నీళ్లు నిండుగా ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వహస్తాలతో పవిత్ర హరిద్రా నది(హల్దీ వాగు)లోకి పవిత్ర గోదావరి జలాలను విడుదల చేశారు. తెలంగాణ సమాజం ఎన్నడూ ఊహించని కలను నిజం చేసిన ఘనత అపర భగీరథుడికే దక్కుతుంది.
ప్రాణహిత గోదావరి నదుల సంగమమైన కాళేశ్వరం నుంచి సుమారు 300 కి.మీ.కు పైగా ప్రయాణించి అత్యంత ఎత్తున ఉన్న దక్కన్ పీఠభూమికి గోదావరి నీరు చేరడం మహాద్భుతం. కొండపోచమ్మ సాగరం ఒక అద్భుతమైన మణిహారం. ఈ ప్రాజెక్టు ద్వారా ఎండకాలంలో ఎండిపోయే పైర్లకు ప్రాణం పోస్తూ నీళ్లిస్తున్న తెలంగాణ నిలిచి గెలుస్తుంది. ఇది ఒక్క రోజు కల కాదు. తెలంగాణ తరతరాల ఆశ, ఆకాంక్ష. మల్లన్నసాగర్ పూర్తికావడానికి మరొక ఆరు నెలలు పట్టే అవకాశం ఉన్నది. మరో రెండేండ్లలో ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న బస్వాపూర్ రిజర్వాయర్ పూర్తయితే ఇక పంట కాలువలు తవ్వి పైర్లకు నీళ్లందించడమే తరువాయి. గతజలసేతుబంధనం అనేది పాత మాట. ఇవాళ నదికి అడ్డంగా ఆనకట్టలు కట్టి ఆ నీటిని వెనక్కు నడిపిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకృతికే కొత్త నడకలు నేర్పిస్తున్నదనేది నేటి మాట. ఇదంతా అయ్యేదా పొయ్యేదా అన్న నోళ్లు ఇప్పుడు మూతపడుతున్నాయి. ఇప్పుడిప్పుడే వాస్తవం తెలుసుకొని నోరెళ్లపెడుతున్నాయి. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి పాదాల చెంత నుంచి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా రంగనాయకస్వామి సాగర్ దాటి, కొంచెం దూరంలోనే ఉన్న కొమురవెల్లి మల్లన్న పాదాలను ముద్దాడి, ఆయన చెల్లెలయిన కొండపోచమ్మ పేరు మీద నిర్మించిన కొండపోచమ్మ సాగర్కు నీరు చేరిన రోజే తెలంగాణ తాగు, సాగునీటి విజయపరంపర మొదలైంది. ఇక మిగిలింది హైదరాబాద్ గొంతు తడపడానికి రింగ్ రోడ్డు పక్కనే నిర్మాణం ప్రారంభం కావలసి ఉన్న కేశవాపూర్ రిజర్వాయర్ను నిర్మించి దాంట్లో నీరు నింపడమే. ఇప్పటికే నూటికి 90 శాతం గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా గోదావరి, కృష్ణా నదుల నుంచి రోజూ శుద్ధిచేసిన తాగునీటి జలాలు అందుతున్నాయి. ఇక తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మారడానికి ఎంతో దూరం లేదు.
సర్వేజనా సుఖినోభవంతు. జియో ఔర్ జీనేదో, బతుకూ బతుకనివ్వు ఇదే తెలంగా ణ సిద్ధాంతం. తెలంగాణ ఉద్యమ పోరాట సారం. కండ్ల ముందు గోదావరి జలాలతో సాకారం. సాక్షాత్కారం. ముంజేతి కంకణానికి అద్దం కావాలా? ఇంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఇంకేం కావాలి?
మంచి కాలం వచ్చింది. తెలంగాణ సాగునీటి ఫలితాలు రైతులకు అందడం ఇప్పుడే మొదలైంది. దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ మారింది. అనుకున్న లక్ష్యం చేరడానికి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ఏర్పాటుచేయడమే మిగిలింది. వీటి పని వీలైనంత తొందరగా పూర్తి కావాలి. ప్రాజెక్టుల వంట సిద్ధమైంది. ఇక వడ్డించడమే తరువాయి.
బండారు రామ్మోహనరావు
ఇవి కూడా చదవండి..