తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర పాడి పారిశ్రామాభివృద్ధి సహకార సమాఖ్య ‘విజయ తెలంగాణ’గా అవతరించింది. విజయ పాలు, పాల ఉత్పత్తులు ‘టేస్ట్ ఆఫ్ తెలంగాణ’గా ప్రాచుర్యం పొందాయి. పాడి రైతులనుంచి నిత్యం 4.5 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతున్నది. ఇది తెలంగాణ పాడి రైతుకు ‘విజయ తెలంగాణ’ పట్ల ఉన్న విశ్వాసానికి ప్రతీక.
2017-18లో రూ. 575.89 కోట్ల టర్నోవర్ ఉన్న పాల అమ్మకాలు, 2020-21లో రూ.750 కోట్ల కు చేరుకున్నాయి. పాల సేకరణ సగటున రోజుకు ఒక లక్ష లీటర్లనుంచి 4.5 లక్షల లీటర్లకు చేరటం విజయ పాల పట్ల వినియోగదారుల ఆదరణకు నిదర్శనం. విజయ పాల ఉత్పత్తుల అమ్మకాలు గతంలో నెలకు 15.36 లక్షల లీటర్లు ఉంటే, అది ఇప్పుడు నెలకు 55 లక్షల లీటర్ల మైలు రాయి దాటింది. విజయ డెయిరీ పార్లర్ల ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో నేడు 2000కి పైగా డెయిరీ పార్లర్లు ఏర్పడ్డాయి.
సంస్థ పనితీరును, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తూనే, జిల్లాల వారీగా పాల ఉత్పత్తి, మార్కెటింగ్ పోటీదారులను దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మక ధోరణిలో ముందుకు సాగడంతోనే ఈ ప్రగతి సాధ్యమైంది. మానవ వనరులను సమర్థవంతంగా పాలసేకరణకు, పాల అమ్మకాల పెంపుదలకూ వినియోగించటం జరి గింది. సక్రమ ఆర్థిక నిర్వహణతోపాటు పారదర్శక పద్ధతులను అవలంబించటం సమాఖ్య సుస్థిరతకు దోహదపడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పాడి రైతులకు కచ్చితంగా 15 రోజులకు ఒకసారి పాల డబ్బులు బ్యాంక్ అకౌంట్ల ద్వారా జమచేస్తున్నారు. రవాణాదార్లకు నిర్ణీతవ్యవధిలో బిల్లుల చెల్లింపు, పాలసేకరణ పరంగా మెరుగైన కృషి చేస్తున్న డెయిరీలకు ప్రోత్సాహకాలు, నాణ్యమైన విజయ దాణా తయారీ, సరఫరా లాంటి మౌలిక అంశాలు పాడిరైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
చిన్న పాలవ్యాపారులకు ప్రోత్సాహకాలతో కూడిన కమీషన్ వర్తింపు, డెయిరీ పార్లర్ల స్థాపనకు సులభతరమైన పద్ధతులు, ఈ-కార్డుల జారీ వంటి ప్రక్రియలతో పాల ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దూద్పేడ, నెయ్యి, సుగంధ పాలు విక్రయాలు కొత్త రకం ప్యాకింగ్లో జరుగుతున్నాయి. ఏపీ, పశ్చిమబెంగాల్, అసోంలలో విజయ పాల ఉత్పత్తుల అమ్మకాలు బిగ్బాస్కెట్, సూపర్ డెయిలీ, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ-కామర్స్ వేదికలపై జరుగుతున్నాయి. గతం లో అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవహారాల నిర్వహణను ప్రి-ఆడిటర్ వ్యవస్థ ద్వారా బలోపేతం చేసి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను గరిష్ఠంగా పొందటం లాంటి వినూత్న ఆలోచనలు డెయిరీని పరిపుష్టం చేశాయి.
ప్రస్తుతం తెలంగాణలో 160 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, పది పాల శీతలీకరణ కేంద్రాలు, 8 డెయిరీలు పనిచేస్తున్నాయి. గ్రామ స్థాయిలో పాల సేకరణను అత్యాధునిక మిల్క్ అనలైజర్ల ద్వారా చేపట్టడం పాడిరైతుల్లో విజయ డెయిరీ పట్ల నమ్మకాన్ని పెంపొందిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి లీటర్ పాలకు రూ.6 నగదు ప్రోత్సాహకం ఇస్తున్నది. అలాగే ఎస్సీ, ఎస్టీ రైతులకు 75శాతం సబ్సిడీ, బీసీ/ఓసీ రైతులకు 50శాతం సబ్సిడీతో పాడి పశువులు పంపిణీ చేస్తున్నది. రావిర్యాలలో రూ. 246 కోట్ల వ్యయంతో మెగా డెయిరీ ఏర్పాటుకు సన్నాహాలు రాష్ట్ర ప్రభుత్వానికి పాడిరైతు ప్రగతిపట్ల ఉన్న చిత్తశుద్ధికి తార్కాణంగా నిలుస్తుంది.
(వ్యాసకర్త: విజయ డెయిరీ ఉపసంచాలకులు, ఆదిలాబాద్)
మధుసూదనరావు, 91211 60553