మన కాలం కన్న కవి గోరటి వెంకన్న. కాలానికి అవసరమైన కవి. తన కాలం కన్నా ముందు నడిచే కవి. తెలుగు కవిత్వాన్ని సుసంపన్నం చేసిన సిసలైన కవి గోరటి. కవిత్వానికి కొత్తచూపునిచ్చిన కవి. ప్రకృతిని, పల్లెల్ని, భౌగోళిక జీవనసారాన్ని తన కవిత్వంతో సత్కరించడం గోరటి వెంకన్న కవితాతత్వంలోని మేలిమిదనం.
అభివృద్ధి చక్రాల వేగంలో జీవితాన్ని కోల్పోతున్న తరానికి అసలైన బతుకు ఎక్కడుందో, బతుకు మూలాలు ఎక్కడున్నాయో తెలియజెబుతున్న కవి వెంకన్న. ఆధునికత విసిరిన పంజాను తప్పించుకోవడమెలానో చెప్పే రసవిద్య అతనికే సొంతం. నలుగురు నడిచిన బాటన నడవలేదు, మరొకరిలా పలకలేదు. ఏం రాసినా, ఏం చెప్పినా, ఏది పలికినా అంతా తన సొంతం. పల్లె పచ్చదనం, మట్టి సుగంధం సంతరించుకున్న పదాలతో కవిత చెప్పడం అతనికే సాధ్యం. ‘వల్లంకి తాళం’లో ఆవిష్కృతమైన సౌందర్యం ఇందుకు సాక్ష్యం. ఇతరులు అనుకరించలేని కంఠస్వరం అతని కవిత్వ బలం. ‘మెరుపు లాంటి పదములకు/మరుపనేది ఒక వరం/కలల పలవరింత వోలె/ కవిత గొంతునొలకాలె..’ అంటున్న వెంకన్నకు తన కవితామార్గంపై స్పష్టత ఉన్నది.
తెలుగు కవితా ప్రపంచాన 1997లో వచ్చిన ‘ఏకునాదం మోత’ దగ్గర్నించి ఇప్పటి ‘వల్లంకి తాళం’ వరకు ఇతరుల ప్రభావాలకు లోబడకుండా తన పద్ధతిన తాను కవిత్వం రాస్తున్నాడు. వెంకన్న గాయకుడు, వాగ్గేయకారుడు మాత్రమే కాదు, సిసలైన కవి. అతనిది మౌఖిక కవిత్వమో, గేయ కవిత్వమో కాదు. గేయానికీ, వచన కవితకూ ఉన్న హద్దులు, ప్రమాణాలేవీ గోరటి వెంకన్న రాస్తున్న కవిత్వానికి వర్తించవు. అతనిది తత్వకవుల సంప్రదాయాన్ని అనుసరించే కవిత్వమని కొందరన్నా రు కానీ, అతని కవిత్వానికి ఏదో ఒక ముద్ర వేయనక్కర్లేదు. అసలు కవిత్వం అంటే ఏమిటో తన కవిత్వం ద్వారా పాఠకులను మేల్కొల్పుతున్న స్రష్ట గోరటి.
లోక వాస్తవికతను తన ఊహాశీలతతో ముడిపెట్టి బతుకు రీతిని, మనుషులను మనుషులకు దూరం చేసే కార్పొరేట్ దమననీతిని చెప్పడం ఈ కవిత్వంలో గమనించదగ్గ అంశం. తద్వారా మరిచిపోతున్న మన మూలాలను గుర్తుచేస్తున్నందునే ఎల్లలుదాటి ఎందరినో ఆకర్షించింది ఆయన కవిత్వం.
ప్రాంతాలు, పట్టణాలు, నగరాలను దాటి పల్లె సీమల్లోకి తరలివెళ్లి పామరజనాలను ఆకట్టుకుంది. అందుకే మన కాలాన జనం మెచ్చిన కవిగా, నచ్చిన కవిగా ప్రయాణిస్తున్నాడు వెంకన్న. అతని వాచకం, అతని పలుకు, అతని పదం వేలమందిని ప్రభావితం చేసింది, చేస్తున్నది. తెలుగునాట ‘పల్లె కన్నీరు పెడుతుందో’ ఏలికల్ని మార్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమ సమయాన తెలంగాణ నేల నలుచెరుగులా జనం వెంక న్న పాటతో గొంతు కలిపారు. తెలంగాణ రణనిన్నాదమై రాష్ట్రం సాకారమయ్యేందుకు తోడ్పడింది వెంకన్న కంఠస్వరం. తెలంగాణ ఉద్యమ కల నెరవేర్చిన అతని కవిత జీవన తాత్వికత చెప్తున్నది. మనిషి మనిషిగా మిగిలేందుకు, మానవీయతను కాపాడుకునేందుకు దివిటీలా వెలుగుతున్నది.
ప్రకృతికి, పల్లెలకు పట్టం కట్టడం వెంకన్న కవిత్వంలోని మేలిమి అంశాలు. అయితే అక్కడికే పరిమితం కాదు అతని కవిత్వం. ప్రకృతి, పల్లె ఈ రెండింటినీ ఆలంబన చేసుకొని మనుషుల్లో మంచినీ, మమతనూ పెంచే మానవ ధర్మాన్ని గురించి చెప్తు న్నాడు. ‘వల్లంకితాళం’ కవితలో కొండలు, కోనలు, సెలయేరులు, పిట్టలు, తుమ్మెదలు, జింకలు, దుప్పులు, పాములు, చిరుతలు, ఈదురుగాలులు, ఈతకమ్మలు, వెదురు తడకల ఇండ్ల ప్రస్తావన ప్రత్యేకమైంది. ‘చెంచు నవ్వులే చెట్లకు పువ్వులు/ రాలె పుప్పొడి వాన అడివి పూల వీణ..’ అంటూ ప్రకృతిని, అడవిని దాన్ని అంటిపెట్టుకున్న సకల జీవరాశిని దృశ్యమానం చేసిన ‘వల్లంకి తాళం’లో ప్రాకృతిక నైసర్గిక స్వరూపం, జీవవైవిధ్యాలు దాగి ఉన్నాయి. వేల ఏండ్లుగా సహజ సిద్ధంగా వర్ధిల్లుతున్న ఈ పుడమిపై మార్కెట్ శక్తుల ఆధిపత్యాన్ని ఆక్షేపించడమే ఈ కవిత అంతఃసారం.
‘వల్లంకి తాళం’లో ఈ విధంగా ప్రకృతిని రూపుగట్టించిన తీరు కాకతాళీయం కాదు. ఇది కవితాత్మక వ్యూహం. అడవుల్ని, కొండల్ని, నదుల్ని, సముద్రాల్ని కబళించే గ్లోబలైజేషన్ కుతంత్రాల గురించి హెచ్చరించేందుకు అనుసరించిన సంవిధానం. ఈ రీతిన మనముందు ఉన్న ప్రాకృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవాలని ఎరుక జేస్తున్నాడు. ‘శివుడా..’ అనే కవితలో ఇది మరింత స్పష్టంగా, ఆర్ద్రంగా రూపు దాల్చింది.
‘పాల టెంకాయల పారేటి కృష్ణమ్మ తేనె పెదవులనూరి అలరించే అడివమ్మ జీవరాశులెల్ల బతికె నల్లమల తనువు జల్లెడచేసి తవ్వి బొందల పోసి కంటికందని లోయలంటి పెడతారంట’ అని నల్లమల ప్రాంతాన యురేనియం తవ్వకాల ప్రతిపాదనల దరిమిలా జరిగే విధ్వంసం గురించి చెప్తున్నాడీ కవి.
మానవ మనుగడకు చోదక శక్తులుగా నిలిచిన ప్రతి రంగాన్ని నీతిమాలిన వాణిజ్యమయం చేశాయి మార్కెట్శక్తులు. వాటి కుతంత్రాలపై వెంకన్నకు అవగాహన ఉండటమే కాదు, ఆగ్రహమూ ఉంది. పలు రూపాల్లో తన ఆగ్రహాన్ని, ధిక్కారాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. ‘ఏకునాదం మోత’, ‘రేలపూతలు’, ‘అలసెంద్రవంక’ పుస్తకాల్లోనూ దీన్ని చూడొచ్చు. ‘వల్లంకితాళం’ పుస్తకంలోని ‘దిగులు గూడు’ కవిత సైతం ఈ ధిక్కార స్వరానికి ప్రతీక. వ్యవసాయాన్ని జూదంగా మార్చడమే గాక, తన నేల తనకు కాకుండా చేసే కార్పొరేట్ల దుష్ట పన్నాగాలపై రైతు ఆవేదన స్వరాన్ని తన తిరుగుబాటు గొంతుకతో పలికిస్తున్నాడు వెంకన్న.
“ఎనకటరక సాగు సేత ఎంత సక్కదనం గీత పాడి మేడ ఆవు నీడ భూమి సత్తువ పెంచె పేడ కారమోలె మరిసె నేల మారెగద ఏమాయె పీడ గంటగంటకు రేటుగట్టె యంత్రభూతాలురుకులాడ టరటటట్టా ట్రాక్టర్ల మోత పరిగె పెంచె మిషిను కోత వెన్నులొంచె పనుల మరుపు రైతు మోమున అప్పు కురుపు’. ప్రగతి పేరుతో సేద్యంలోకి కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలతో మొత్తం వ్యవసాయరంగం ఛిద్రమైంది. వ్యవసాయాన్ని అంటిపెట్టుకున్న మానవీయ జీవన సంస్కృతి అంతరించింది. అందుకే ఈ కవి ఇలా అంటాడు ‘శెరల నాపే దీవెనేది చెప్పినా వినే నిలకడేది
పడమటి విషగాలిమాయ పల్లెగుడి వెలుగారిపాయె’.
నీళ్ల కోసం వేల అడుగులు బోర్లు వేసి నేలతల్లి గుండెకు గాయం చేయడం, అయినా ఫలితం దక్కని రైతులు దిక్కుతోచక ప్రాణాలను తీసుకొనే పరిస్థితి దారుణం. ఈ కారణంగానే.. ‘ఎద్దు ఏడుపు రైతు ఏడుపు లేని కాలమే మేలికాలం ఏలికల ఎద కరిగెదెప్పుడో నేలకల నెరవేరెదెప్పుడో’ అని ప్రశ్నిస్తాడు. మార్కెట్ ముట్టడిలో అణగారిపోతూ, తనను తాను కోల్పోతున్న మనుషుల గురించి పలవరిస్తాడు ఈ కవి. మనుషుల్ని మనుషులుగా గాక వినియోగదారులుగా పరిణమింపజేసిన కార్పొరేట్ వాణిజ్య కుటిల నీతి బండారాన్ని ‘అద్దాల అంగడి’లో బయటపెడతాడు. ‘అద్దాల అంగడి మాయ/ దాని సూపుకు నరుని బతుకు/ బొంగరమై పాయెర’ అంటూ మనుషుల జేబులు కొల్లగొట్టె బేహారుల దుర్మార్గాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్తాడు.
ప్రపంచీకరణపై ధిక్కారం స్థానికతకు పట్టం గట్టడంలోనే ఉంది. మన జీవన మూలాలను గుర్తించి కాపాడుకోవడంలోనే దాగుంది. సంపన్న దేశాల అభివృద్ధి నమూనాలు మనకు సరిపడవు. మన జీవన సౌందర్యం శ్రమలో ఉంది. మన బతుకు పచ్చదనం చెట్లతో, పుట్టలతో, నదులతో, చెరువులతో ముడిపడింది.
ప్రశాంతంగా రేపు ఎలా అనే చింత లేకుండా బతకడంలోనే బతుకు విలువ దాగుంది.
తనదైన ఊహాశీలతతో, అభివ్యక్తితో ఆవిష్కరించడమే గోరటి వెంకన్న కవితా వైశిష్ట్యం. అతని ఊహాశీలత ‘కానుగనీడ’, ‘సీకటి బయలు’, ‘నల్లతుమ్మ’, ‘కావి కోవెల’, ‘సలువ వేళ’, ‘పూల సందడి’, ‘నెనరు’ వంటి కవితల్లో విరాట్రూపంతో వ్యక్తమైంది. నిజానికి ‘వల్లంకి తాళం’లోని 32 కవితలు వేటికవే ప్రత్యేకమైనవి.
మన పల్లెలకూ, ప్రకృతికీ మనం జరుపుకొనే పండుగలకూ, మన బతుకు రీతికీ నడుమ గల అవినాభావ సంబంధాన్ని రమణీయంగా రసార్ద్రంగా వ్యక్తం చేసిన కవితల సమాహారమే ‘వల్లంకి తాళం’. అయితే ఈ రమణీయతను, దయాపూరిత స్వభావాన్ని ధ్వంసం చేసే పరిణామాలు పేట్రేగిపోతున్న నేపథ్యాన మనవైన మానవీ య మూలాలను గుర్తుచేస్తున్నదీ కవిత్వం.
స్వార్థం నిండిన మనుషుల నైజాన్ని తేటతెల్లం చేస్తా యి గోరటి కవితలు. మంచిని, మమతను పెంచే స్వభా వం సంతరించుకోడం ద్వారానే సాటివారికి తోడ్పడటం సాధ్యమన్నది వెంకన్న ఆకాంక్ష. లోకంలో ఎన్ని దుష్కృత్యాలు జరిగినప్పటికీ మనుషులుగా మెలగడం అవసరమనే స్పృహని అందిస్తుందీ కవిత్వం. కవి అభివ్యక్తిలోని సొగసుదనం, పదచిత్రాలు, అలంకారికత, కవితా నిర్మాణంలో దేశీ సంప్రదాయాన్ని వాడుకోవడం వల్ల వెంకన్న కవిత్వం పరిపుష్టమైంది. అలాంటి ఉత్తమ కవితా సంపుటి ‘వల్లంకి తాళం’ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికవడం ముదావహం.
– గుడిపాటి, 94900 99327
(మార్చి 11న గోరటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకోబోతున్న సందర్భంగా..)