నీళ్లు, నిధులు, నియామకాలే నినాదంగా ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు. వరుస నోటిఫికేషన్లు వెలువడుతుండడంతో తెలంగాణ యువతలో పండుగ వాతావరణం నెలకొన్నది. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచే నియామకాల ప్రక్రియ జోరందుకున్నది. ఉద్యోగ నియామకాల్లో మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది.
గత మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రవ్యాప్తంగా 91 వేల 142 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షి గా ప్రకటించారు. ప్రకటించినట్లుగానే వరుస నోటిఫికేషన్లు ఇస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మరోవైపు 11,000 మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయనున్నారు. అసెంబ్లీలో ప్రకటించినట్లే 80,039 పోస్టులకు విడతలవారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు 61 వేల 804 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. గ్రూప్-1, పోలీసు ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడమే కాకుండా ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించి త్వరలో మెయిన్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది.
నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తు న్న గ్రూప్-4 పోస్టుల నోటిఫికేషన్ కూడా వెలువరించి ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 9168 గ్రూప్-4 ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్న యువతీ యువకుల్లో ఉత్సాహం నెలకొన్నది. టీఎస్పీఎస్సీ ఇంత భారీ సంఖ్యలో గ్రూప్స్ కొలువుల భర్తీకి ప్రకటన వెలువరించడం ఇదే తొలిసారి. వీటిలో మున్సిపాలిటీలకు సంబంధించి 1862 వార్డ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. మున్సిపాలిటీలలో ఒక్కో వార్డు కు ఒక్కో ఆఫీసర్ను నియమించబోతున్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు గతంలో ఒకేసారి 9,000 మందికి పైగా కార్యదర్శుల పోస్టులను భర్తీ చేశారు. ఇది గ్రామపంచాయతీలో పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం కావడానికి, జాతీయస్థాయిలో అత్యధిక స్థాయిలో అవార్డులు రావడానికి దోహదపడింది.అదేవిధంగా మున్సిపాలిటీల లో,కార్పొరేషన్లలో పరిపాలన మెరుగుపరిచేందుకు ప్రతి వార్డుకు ఒక ఆఫీసర్ విధానాన్ని దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో తొలిసారిగా అమ లు చేయనున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలవబోతున్నది.
వీటితో పాటుగా నిరుద్యోగ యువత ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 783 గ్రూప్-2 పోస్టులు,1373 గ్రూప్-3 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. త్వరలోనే వీటికి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. వీటితో పాటుగా 1000కి పైగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేసే ఆలోచనలో ఉన్నది. అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన వైద్య ం, వైద్య విద్యను అందించడం కోసం జిల్లాకో వైద్య కళాశాల నెలకొల్పాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ లక్ష్యం దిశగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యా సంచాలకుల పరిధిలో వచ్చేఏడాది కొత్తగా ఏర్పాటు చేసే తొమ్మిది బోధన ఆసుపత్రుల్లో 3897 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసింది. వీటితో పాటుగా గురుకులాల్లో 12 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి గురుకుల విద్యాసంస్థల బోర్డు ఇప్పటికే చర్యలు చేపట్టింది. త్వరలోనే వీటి నోటిఫికేషన్లు కూడా వెలువడనున్నా యి. రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించి స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. దీంతో నియామకాల్లో 95% ఉద్యోగాలు స్థానికులకే లభించబోతున్నవి. విద్యార్థులు, యువత కోరిక మేరకు ప్రభుత్వం వయోపరిమితిని సడలించడం ద్వారా మరింత మందికి ఉద్యోగాల కోసం పోటీపడే అవకాశం లభించింది.
ఈ నియామకాలతో మారుమూల ప్రాంతాల్లోని సిబ్బంది కొరత పూర్తిగా తీరనున్నది. మరోవైపు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించడమే కాకుండా ప్రజలకు నాణ్యమైన పౌర సేవలు త్వరితగతిన లభించే అవకాశముంటుంది. దానితోపాటు ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులపై పని భారం తగ్గనున్నది.
నూతన ఉద్యోగాల భర్తీతో ప్రభుత్వంపై వేలకోట్ల రూపాయల అదనపు భారం పడే అవకాశం ఉన్నది. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ భారం అనుకోకుండా ఒక సామాజిక బాధ్యతగా భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే గాకుండా ప్రైవేట్ రంగంలోను భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. 17 లక్షల మందికి పైగా ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి కల్పించిన ఘనత తెలంగాణ రాష్ర్టానికి దక్కింది. సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజాసేవే లక్ష్యంగా భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు.
‘తెలంగాణ యువత కష్టపడి చదివి తమ కలలను నిజం చేసుకోవాలి. ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, పట్టుదల, ప్రణాళికతో సాధన చేసి ఉద్యోగాలు సాధించాలి. తద్వారా కుటుంబానికి అండగా నిలవాల’ని పరిశ్రమలు, ఐటీశాఖ మాత్యులు కేటీఆర్ యువతకు ఆత్మీయ లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల నేపథ్యంలో సీఎం కేసీఆర్ సూచన మేరకు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న యువత కోసం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత స్థాయిలో కోచింగ్ సెంటర్లను ఇతర వసతులను ఏర్పాటు చేశారు. అదే విధంగా వారు చదువుకోవడానికి వీలుగా లైబ్రరీలను బలోపేతం చేశారు. నిరుద్యోగ యువత ఈ సౌకర్యాలను వినియోగించుకొని ఉద్యోగాలు సాధించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్త్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు విద్యార్థులు, యువత వారి కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.
(వ్యాసకర్త : అసోసియేట్ అధ్యక్షులు, టీఎన్జీవో)
-పుల్లూరు వేణుగోపాల్
97010 47002