భక్తి ప్రధాన ఉద్దేశం జ్ఞాన సముపార్జనమే! ఇదే విషయాన్ని యోగ వాశిష్ఠంలోని ప్రహ్లాద ఉపాఖ్యానం వివరిస్తుంది. హిరణ్యకశిపుడి సంహారం జరుగుతుంది. ప్రహ్లాదుడు రాజై సర్వజన ఆమోదకంగా రాజ్యపాలన చేస్తుంటాడు. నిత్యం మహావిష్ణువును పూజిస్తూ తరిస్తూ ఉంటాడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు ప్రహ్లాదుడికి ప్రత్యక్షమవుతాడు. ‘ప్రహ్లాదా! నీ అనన్య భక్తికి మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో’ అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడికి ఏం కోరుకోవాలో తోచదు. కాసేపటికి ‘స్వామీ! నాకు ఏది శ్రేష్ఠమైన వరమో, దానినే ప్రసాదించమ’ని అడుగుతాడు.
మహావిష్ణువు అంతటి దైవం ప్రత్యక్షమైతే ఏం కోరుకోకుండా, శ్రేష్ఠమైనది ఏమిటో దాన్ని వరంగా ప్రసాదించమన్నాడు ప్రహ్లాదుడు. మరి జీవుడికి అత్యంత శ్రేష్ఠమైనది ఏమిటి? ఐష్టెశ్వర్యాలా, స్వర్గ సుఖాలా, పదవులా, చిరంజీవత్వమా.. ఏది ఉన్నతమైనది? వీటన్నిటినీ మించిన శ్రేష్ఠమైనది మరేదైనా ఉందా? ఆ ఉన్నతమైన వరాన్ని తనకు అనుగ్రహించమన్నాడు ప్రహ్లాదుడు. ‘అన్ని వరాల్లో కన్నా ఉత్తమమైనది ఏమిటో, దానిని నాకు ప్రసాదించు’ అని కోరుకున్నాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు చిరునవ్వుతో ‘ప్రహ్లాదా! ఆత్మసాక్షాత్కారం కలిగే వరకు నీలో జ్ఞాన విచారణ కలుగుగాక’ అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు.
ప్రహ్లాదుడు అడగాలే కానీ.. మరుక్షణంలో భగవానుడు ముక్తిని ప్రసాదించేవాడే! ప్రహ్లాదుడి మాట మేరకు క్షణం ఆలస్యం చేయకుండా నరసింహస్వామిగా స్తంభంలో ఉద్భవించిన శ్రీమన్నారాయణుడికి మోక్షం ప్రసాదించడం పెద్ద విషయం కాదు! తనకోసం విచిత్రాకృతి దాల్చిన విష్ణువును ఏదైనా అడిగే స్వతంత్రం ప్రహ్లాదుడికి ఉంది. కానీ, తనకు ఏం కావాలో.. తనకన్నా ఆ దైవానికే కచ్చితంగా తెలుసు అనుకున్నాడు ప్రహ్లాదుడు. అకుంఠిత భక్తితో తనను మెప్పించిన ప్రహ్లాదుడికి ఏం వరం ఇవ్వాలో నారాయణుడికీ తెలుసు. అందుకే, ప్రహ్లాదుడు అడగకపోయినా, అతణ్ని ఉద్ధరించడానికి మోక్షప్రాప్తి కోసం కావలసిన బుద్ధియోగాన్ని అనుగ్రహించాడు. జ్ఞాన విచారణతో ఆత్మసాక్షాత్కారం పొందమని వరం ఇచ్చాడు. ఒక్క ప్రహ్లాదుడే కాదు, ఎందరో భక్తులు భగవంతుడిని కోరికలు కోరకుండా జ్ఞానమార్గాన్ని అనుసరించారు. భగవత్ తత్తాన్ని తెలుసుకొని ముక్తిపథాన్ని చేరుకున్నారు. జ్ఞానాన్ని ప్రసాదించే సాధనం భక్తి. మోక్షం కోరుకునే వాళ్లు భక్తిపథంలో అంచెలంచెలుగా ఎదగాలి. తద్వారా జ్ఞానం కలుగుతుంది. దాని ఫలితంగా అంతిమంగా మోక్షాన్ని పొందుతాం. – టి.వి.ఫణీంద్రకుమార్