బీజేపీపై యుద్ధవ్యూహం.. మతం- దేశభక్తి- అభివృద్ధి
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంగా పేరున్న భారతదేశం ఆ ప్రతిష్ఠను ఇక మీదట నిలుపుకోగలుగుతుందా? విభిన్న సంస్కృతులు, భాషలు, మతాలున్న భారత్లో విస్తృత వైవిధ్యం ఇక మీదట కూడా కొనసాగుతుందా? ఐదేండ్లకోసారి ప్రశాంతంగా, చట్టబద్ధంగా ప్రజల తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వాలు కొలువయ్యే పరిణత భారత ప్రజాస్వామ్యం ఇకపై నిలుస్తుందా?- మోదీ ప్రధానిగా అధికారం చేపట్టిన తర్వాత, ఈ ఎనిమిదేండ్లలో ఆయన పాలన చూసిన తర్వాత భారతీయుల్లో తలెత్తుతున్న ప్రశ్నలు.
పొరుగునున్న పాకిస్థాన్లాగా భారత్ కూడా మతరాజ్యంలాగా మారుతుందా? అధ్యక్ష తరహా పాలనలో దేశం క్రమంగా నియంతృత్వం వైపు అడుగులు వేస్తుందా? ఇటువంటి ఆందోళనలు ఎన్నో. మోదీని నిలువరించటం, దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటం అన్నవి చారిత్రక అవసరాలుగా ముందుకొచ్చాయి. ఆ కర్తవ్యాన్ని నెరవేర్చే మహానాయకుడి (లీడర్ ఆఫ్ ది లీడర్స్) కోసం యావత్దేశం ఎదురుచూస్తున్నది.
ఈ సంక్షోభ సమయంలో.. ‘బీజేపీ నుంచి దేశాన్ని రక్షించుకుందాం’ అంటూ కేసీఆర్ చేసిన సింహగర్జన దేశమంతటా ప్రతిధ్వనిస్తున్నది. ఎన్నడూ లేనంతటి ఒత్తిడికి, నిర్బంధానికి గురైన భారత ప్రజాస్వామ్యం తిరిగి స్వేచ్ఛగా తలెత్తుకొని నిలబడగలదన్న ఆశ మెల్లగానైనా అంకురిస్తున్నది. ఈ నేపథ్యంలో బీజేపీని ఎలా ఎదుర్కోవాలి? 2024లో జరిగే ఎన్నికల సమరాంగణంలో ఆ పార్టీని ఎలా ఓడించాలి? దేశంలో ప్రజాస్వామ్యానికి తిరిగి పట్టం ఎలా కట్టాలి? అన్న చర్చ కొనసాగుతున్నది.
హిందువులకు బీజేపీ ప్రతినిధి కాదు: గల్లీ ఎన్నికల నుంచి ఢిల్లీ ఎన్నికల వరకూ బీజేపీ ప్రయోగించే అస్త్రం హిందుత్వ. హిందూమతానికి, హిందువులకు తామే ప్రతినిధులమని, తాము లేకపోతే ఇస్లాం, క్రైస్తవం నుంచి హిందువులకు ముప్పు నెలకొంటుందని బీజేపీ ప్రచారం చేసుకుంటుంది. దీనిని ఎదుర్కోవటానికి ఇప్పటివరకూ కాంగ్రెస్ తదితర పార్టీల నేతలు అనుసరించిన వ్యూహం ఏమిటంటే.. గుళ్లను దర్శించుకోవటం, పురాణాలు వల్లె వేయటం. దీనివల్ల వారు తమకు తెలియకుండానే బీజేపీ విసిరిన వలలో పడుతున్నారు. ‘చూశారా! మాకు భయపడే రాహుల్గాంధీ గుడుల చుట్టూ తిరుగుతున్నాడు. మమత చండీపాఠం చదువుతున్నది. కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా పఠిస్తున్నాడు. వాళ్లను అలా మార్చింది మేమే!’ అంటూ బీజేపీ మరింత ఢంకా బజాయించుకొంటుంది. మరికొన్ని పార్టీలేమో.. బీజేపీ మతతత్వ పార్టీ అని, తమకు అన్ని మతాలూ సమానమని, తాము సెక్యులరిస్టులమని చెప్పుకొంటాయి. ఇది కూడా బీజేపీకి లాభం చేకూర్చే వైఖరే. ముస్లింలకు, క్రైస్తవులకు అడగకుండానే వరాలు ఇచ్చి.. హిందువులపై నిర్లక్ష్యం చూపటమే సెక్యులరిస్టు పార్టీల అసలు స్వరూపమని, దేశంలోని మెజారిటీ ప్రజలైన హిందువులను పట్టించుకునేది తామేనని బీజేపీ చెప్పుకొంటుంది. దీనికి ఉదాహరణగా హజ్ యాత్ర, క్రిస్మస్ వేడుకల వంటి సందర్భాల్లో ముస్లింలకు, క్రిస్టియన్లకు ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలను ప్రస్తావించి హిందువులను రెచ్చగొట్టే పనులకు పాల్పడుతుంది.
ఈ రెండు రకాలుగానూ బీజేపీని హిందూమతం అనే అంశంలో ఎదుర్కోవటం సాధ్యమయ్యే పని కాదు. మరి ప్రత్యామ్నాయం ఏమిటి? ఎప్పుడైనా పరోక్ష యుద్ధం కంటే ప్రత్యక్ష యుద్ధమే మేలైన ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ కూడా ఆ మార్గమే సరైనది. అంటే, బీజేపీ చెప్పే హిందూమతం ఏమిటో జనానికి తెలియాలి. మన ఇరుగు పొరుగున, మనతో తరతరాలుగా కలిసి మెలిసి ఉంటున్న ముస్లింలను, క్రైస్తవులను ద్వేషించటం, అబద్ధాలు ప్రచారం చేయటం, మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టటం – ఇదా హిందూమత సారం? వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఆధునిక హిందూ తాత్విక సిద్ధాంతాలు, హిందూమతంలో వచ్చిన సంస్కరణోద్యమాలు ఇదే చెబుతున్నాయా? సర్వజీవుల్లోనూ పరమాత్మను దర్శించుకొమ్మని చెప్పే హిందూమత బోధనకు.. విద్వేషాల మంటలు రేపే బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తుందా? ఆ పార్టీకి అసలు ఆ స్థాయి ఉందా? ఆ నాయకులు పాటించే ధర్మం, విలువలు ఏమిటి? ఈ చర్చ జనంలోకి వెళ్లాలి.
కేసీఆర్ వేస్తున్న ప్రశ్నలతో ఇప్పటికే ఈ చర్చ మొదలైంది కూడా. ‘దసరా, దీపావళి ఎప్పట్నించో జరుపుకొంటలేమా? గుడుల్లో మొక్కులు మొక్కుతలేమా? బీజేపీ వాళ్లే వచ్చి మనకు నేర్పిండ్రా?’ అని ఆయన సంధించిన ప్రశ్న.. బీజేపీ తన గురించి చెప్పుకొంటున్న ‘హిందూమత రక్షకురాలిని’ అనే వాదనను తుత్తునియలు చేసేదే. ఈ ప్రశ్నలను, ఈ చర్చను మరింత విస్తృతపరచాల్సిన అవసరం ఉంది. బీజేపీ అనుసరించే విద్వేష మార్గం.. హిందూమతం బోధించే సర్వమానవ సౌభ్రాతృత్వానికి పొసగనే పొసగదని ఉదాహరణలతో సహా ప్రజలకు తెలియాలి. బసవేశ్వరుడు, కబీర్, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, గాంధీజీ వంటి ఆధునిక హిందూమతోద్ధారకులు, సంస్కర్తల బోధనల ద్వారా అసలైన హిందూమతం అంటే ఏమిటో ప్రజలకు అర్థం చేయించాల్సిన అవసరం నేడు దేశవ్యాప్తంగా ఉంది. తనకు తానుగా ఎంతో జ్ఞానసంపదను ఆవిష్కరించిన హిందూమతం.. పరిణామక్రమంలో మంచిని స్వీకరించుకుంటూ ముందుకు వెళ్తున్నది. బౌద్ధం, జైనం వంటి ప్రాచీన మతాల నుంచి క్రైస్తవం, ఇస్లాం, సిక్కు వంటి ఆధునిక మతాల వరకూ.. వాటన్నింటిలోని మంచిని గ్రహిస్తూ, తన జ్ఞానభాండాగారాన్ని ఎప్పటికప్పుడు విస్తరించుకుంటూ ఉండటంతోనే వేల ఏండ్లు గా ఈ నేలపై కొనసాగుతున్నది. రామాయణ, భారతాలు, భగవద్గీత వందలు, వేల ఏండ్లుగా భారతీయుల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయంటే.. ఈ జ్ఞానమార్గం వల్లనే సాధ్యమైంది. విద్వేషాల మంటలు రేపటమే పనిగా పెట్టుకుంటే ఇన్నేండ్లు హిందూమతం ఉనికిలో ఉండగలదా? ద్వేషం పునాదిగా ఒక మతంగానీ, ఒక సిద్ధాంతంగానీ నిలదొక్కుకున్న దాఖలా మానవ సమాజ చరిత్రలోనే లేదు. ఈ సత్యం ప్రజలకు తెలిస్తే.. హిందూమతానికి, హిందూ మతం ప్రతిపాదించే విలువలకు బీజేపీ ప్రతినిధి కాదని, పైగా వాటికి ఆ పార్టీ అతిపెద్ద శత్రువనే విషయం దానంతట అదే అర్థమవుతుంది.
బీజేపీ ‘దేశభక్తి’.. వాస్తవం ఎంత?
బీజేపీ తనకు తాను ఇచ్చుకునే మరో పెద్ద సర్టిఫికేట్ దేశభక్త పార్టీ. దేశంలో తమను మించిన దేశభక్తి చూపే పార్టీ మరొకటి లేదని వారు మాట్లాడుతుంటారు. ఇంతకూ బీజేపీ దృష్టిలో దేశభక్తి అంటే ఏమిటంటే.. పాకిస్థాన్ను తిట్టటం, ఆ దేశంపైకి యుద్ధానికి వెళ్లాలంటూ ప్రగల్భాలు పలుకటం (దేశంలోకి చైనా చొచ్చుకొచ్చినా కూడా యుద్ధం కాదుగదా కనీసం నిలదీసేంత ధైర్యం కూడా చేయరు వీళ్లు), ముస్లింలను తిట్టటం, కొట్టటం, దళితుల్ని హీనంగా చూడటం, అవమానించటం, ప్రేమికుల రోజునాడు ప్రేమికులను పట్టుకొని వేధించటం, గోరక్షణ పేరుతో ముస్లింలు, దళితులపై మూకదాడులకు, హత్యలకు పాల్పడటం, లవ్జిహాద్ పేరుతో ముస్లిం యువకులను కొట్టటం- ఇవన్నీ దేశభక్తికి సంబంధించిన పనులు. ఈ పనులు చేసేటప్పుడు జైశ్రీరాం, భారత్మాతాకీ జై అనే నినాదాలు ఇస్తే చాలు.. వాళ్లు ఇక దేశభక్తులు అయినట్లే. ఇది నిజంగానే దేశభక్తా? అనేది అసలు చర్చ.
దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ. భారతదేశం అంటే 138 కోట్ల జనం. ఈ జనానికి కావల్సిన కనీస అవసరాలైన తిండి, బట్టలు, ఉద్యోగం, ఉపాధి కల్పించటం దేశభక్తా? లేక, మతపిచ్చి లేపి పరస్పరం కొట్టుకుచచ్చేవిధంగా రెచ్చగొట్టటం దేశభక్తా? ఈ దేశంలో ప్రజలు తమ తమ మతాల కారణంగా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? ముస్లింల నుంచి హిందువులు, క్రైస్తవుల నుంచి ముస్లింలు, హిందువుల నుంచి ముస్లింలో/క్రైస్తవులో ఏమైనా సమస్యలను ఎదుర్కొంటున్నారా? లేదే.. ఎవరి మతాలను వాళ్లు అనుసరిస్తున్నారు. ఎవరి పండుగలు వాళ్లు జరుపుకొంటున్నారు. వీలైతే పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకొంటున్నారు.
కోట్లాదిమంది భారతీయులు ఈ రోజు ఉపాధి, ఉద్యోగం లేక, పంటపొలాలకు నీళ్లు లేక, జబ్బు వస్తే వైద్యం అందక, పిల్లలకు విద్య అందక, కనీసావసరాలు తీర్చుకునే ఆదాయం లేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ.. ప్రధాని పదవి కోసం రంగంలోకి దిగినప్పుడు కూడా ఆయన దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఈ సమస్యల పరిష్కారమే కదా! ఉద్యోగాలు, ఉపాధి, సాగునీరు, విద్య, వైద్యం.. వీటి మీద హామీలివ్వటం వల్లనే కదా ఆయనను జనం ఎన్నుకున్నారు. అంతేగానీ, హిందూమతానికి మరో ఇతర మతం నుంచి ముప్పు ఉందని, హిందువులను రక్షిస్తానని చెప్పి ఆయన ఓట్లు అడిగారా? అలా అడిగి ఉంటే జనం ఓట్లేసేవారా? అంటే, ‘అధికారం వచ్చేంతవరకూ జనం నిజమైన సమస్యల్ని ప్రస్తావించాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యల్ని జనం మర్చిపోయే విధంగా మతచిచ్చు రేపి అధికారాన్ని నిలబెట్టుకోవాలి’- ఇదేనా దేశభక్తి? దేశభక్తికి సంబంధించిన మరో ఆసక్తికరమైన కోణం ఏమిటంటే.. బ్రిటీష్ వారి పాలనలో భారతదేశం మగ్గుతున్నప్పుడు, బానిసత్వానికి వ్యతిరేకంగా యావత్ జాతి పోరాడుతున్న కాలంలో బీజేపీ పూర్వీకులు ఆ మహోన్నత ఉద్యమంలో పాల్గొన్నారా? వారి పాత్ర ఏమిటి? అన్నది కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
అవినీతిరహిత పాలన ఒట్టి అబద్ధం
మచ్చలేని పాలన అందిస్తామని, ఒక్క అవకాశం ఇవ్వమని ప్రజల్ని అర్థించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ, అది నిజమేనా? అవినీతి జరుగలేదా? లేనిదే.. అంబానీ, అదానీ వంటి కొందరు పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయా? బ్యాంకుల్లో వేల కోట్ల ప్రజల సొమ్మును దోచుకొన్న గజదొంగలు దేశం విడిచి పారిపోతే దానికి బాధ్యత కేంద్ర హోంమంత్రిది, ప్రధానమంత్రిది కాదా? లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఎల్ఐసీ వంటి అద్భుతమైన ప్రభుత్వసంస్థలను అమ్ముతున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి దేశాన్ని పాలించే అర్హత ఉందా? అవినీతి గురించి, ఒక్కో మంత్రిత్వశాఖలో జరిగిన దోపిడీ గురించి గణాంకాలతో సహా జనం ముందు బట్టబయలు కావాలి.
సైన్యంతో రాజకీయాలు.. ప్రమాదకరం
పరిపక్వత కలిగిన ఏ ప్రజాస్వామ్య దేశం కూడా సైన్యాన్ని రాజకీయాల్లోకి తీసుకురాదు. తీసుకొస్తే అది అత్యంత ప్రమాదకరమైన పరిణామాలకు, నిరంకుశత్వానికి దారితీస్తుంది. కానీ, బీజేపీ హయాంలో ఇటువంటి ధోరణి మొదలైంది. దేశ సరిహద్దులను రక్షిస్తున్న మన వీరోచిత సైన్యం జరిపే ఆపరేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం అన్నది బీజేపీ హయాంలోనే మొదలైన ప్రమాదకరమైన ధోరణి.
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు భారత్-పాకిస్థాన్ మధ్య రెండు యుద్ధాలు (1965లో, 1971లో) జరిగాయి. ఈ రెండింటిలోనూ భారత సైన్యం ఘన విజయం సాధించింది. రెండోసారైతే పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోవటానికి, ఆ దేశ విముక్తికి భారత్ గొప్ప దన్నుగా నిలబడింది. అయినప్పటికీ, సైన్యాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలుగానీ, ఆ విజయాల్ని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలుగానీ అప్పుడు జరుగలేదు. కానీ, నేడు మోదీ హయాంలో సైన్యం జరిపే ఆపరేషన్లను, వీర సైనికుల త్యాగాలను బీజేపీ ఘనతలుగా చెప్పుకోవటం, ఎన్నికల ప్రచారంలో పోస్టర్లు వేసి చాటుకోవటం చూస్తున్నాం. ఇది ఎంతమాత్రం సరైనది కాదు. దీనివల్ల సైన్యానికి, ఇటు దేశ ప్రజాస్వామ్యానికి దీర్ఘకాలంలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
ఇవన్నీ ప్రజలు తెలుసుకోవాలి. బీజేపీ పాలన కొనసాగితే దేశ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించుకోవాలి. అంతర్జాతీయ సమాజంలో 75 ఏండ్లుగా భారత్ సాధించుకున్న గౌరవాన్ని, విలువల్ని నిలబెట్టుకునేవిధంగా కార్యాచరణకు పూనుకోవాలి. 138 కోట్ల మంది సౌభాగ్యం, సంక్షేమమే లక్ష్యంగా కదలాలి. – రవికుమార్