ప్రపంచంలో యుద్ధోన్మాదపు హుంకారాలు, ఘీంకారాలు అంతకంతకు పెచ్చరిల్లుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఓ వైపు ఎడతెరిపి లేకుండా కొనసాగుతూనే ఉన్నది. ముగింపు కనుచూపు మేరలో కనిపించడం లేదు. మరోవైపు గాజా మారణహోమం భగభగ మండుతూనే ఉన్నది. అదలా ఉండగానే ఇంకోవైపు ఇజ్రాయెల్-ఇరాన్ కీచులాట శ్రుతిమించి పూర్తిస్థాయి యుద్ధంగా పరిణమిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అటు తైవాన్ మీదికి ఎప్పుడు కాలు దువ్వుదామా అని చైనా ఉరుకులాడుతున్నది. ఇవన్నీ ప్రపంచ శాంతిని ప్రమాదంలో పడవేస్తున్న ఘటనలే. హమాస్ దాడికి ప్రతీకారమంటూ గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ అక్కడ మారణహోమం సృష్టిస్తున్నది. ఇప్పటివరకు 30 వేల మందికి పైగా పౌరుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వారిలో అత్యధికులు స్త్రీలు, పిల్లలే కావడం అత్యంత బాధాకరం. సిరియా, లెబనాన్ తదితర దేశాల్లోని పాలస్తీనా అనుకూల దళాలపైనా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నది. అందులో భాగంగా సిరియాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ కాన్సులేట్ ధ్వంసమైంది. ఈ దాడిలో ఇరాన్ దౌత్య సిబ్బందితో పాటు పలువురు సీనియర్ సైనికాధికారులు కూడా మరణించారు. దీంతో ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది.
1991లో ఇరాక్ తర్వాత ఇజ్రాయెల్పై ఓ శత్రుదేశం ప్రత్యక్ష క్షిపణి దాడులకు దిగడం ఇదే ప్రథమం. అయితే ఇరాన్ ప్రయోగించిన దాదాపు అన్ని క్షిపణులను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ (ఉక్కు గోపురం) వ్యవస్థ సాయంతో నేలకూల్చింది. ఇదిలా ఉండగా ఇరాన్పై ఎదురుదాడికి ఇజ్రాయెల్ సమాయత్తమవుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇజ్రాయెల్ అప్రకటిత అణ్వాయుధ దేశం. ఇరాన్ కూడా అణ్వాయుధాల కోసం తీవ్రంగా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ రెండు శక్తివంతమైన దేశాలు ప్రత్యక్ష యుద్ధంలో తలపడటం ఏ మాత్రం వాంఛనీయం కాదు. ఈ ఘర్షణ చిలికిచిలికి గాలివానగా మారి పశ్చిమాసియాను అగ్నిగుండంగా మారుస్తుందేమోననే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ తరపున రంగంలోకి అమెరికా దిగితే ఇరాన్ తరపున తామూ సమరానికి సై అంటామని రష్యా చేసిన ప్రకటన ఉద్రిక్తతను మరింతగా పెంచుతున్నది. ఈ సరికే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రావణకాష్టంలా మారి రెండేండ్లుగా రగులుతూనే ఉన్నది.
అమెరికా నేతృత్వంలోని నాటో నుంచి ఎదురవుతున్న ముప్పును తప్పించుకునేందుకు ఉక్రెయిన్ మీదకు రష్యా ఉరికింది. ఈ యుద్ధం వల్ల ఎంతో ధననష్టం, ప్రాణనష్టం సంభవిస్తున్నది. ఉక్రెయిన్కు అమెరికా తదితర పశ్చిమ దేశాలు ఆయుధాలు సమకూరుస్తున్నాయి. ఒకరకంగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్నది. ఉక్రెయిన్ ఒకవేళ యుద్ధం నుంచి గెలిచి లేదా ఓడిపోయి బయటపడినా అప్పుల బాధ నుంచి తప్పించుకోవడం కష్టమవుతుందని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచానికి కావాల్సింది దేశాలను బూడిద కుప్పలుగా మార్చే యుద్ధాలు కాదు. పేదరికంపై, ఆకలిపై యుద్ధం చేయాల్సి ఉంది. అవిద్యపై, రోగాలపై యుద్ధం చేయాల్సి ఉంది. ఇంకా చెప్పాలంటే పతనం అంచుకు చేరిన పర్యావరణానికి పచ్చదనంతో తిరిగి ప్రాణం పోసేందుకు యుద్ధం చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో యుద్ధ నివారణకు అమెరికా తదితర దేశాలు, ఐక్యరాజ్య సమితి పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచశాంతి నెలకొల్పేందుకు భారత్ అండదండలు ఎటూ ఉండనే ఉంటాయి.