మే 11వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పులు ప్రస్తుత భారత రాజకీయాలకు ప్రతిబింబం. ఒకటి ఢిల్లీలో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని సక్రమంగా పనిచేసుకోకుండా చేస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు. రెండోది మహారాష్ట్రలో శివసేన పార్టీని చీల్చి అక్రమంగా అధికారంలోకి వచ్చిన షిండే సేన వర్గం-బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు తీరు గురించి. ఈ రెండు తీర్పుల్లోనూ ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తూ, అక్రమ పద్ధతులకు పాల్పడ్డ పాపం బీజేపీదే. ఢిల్లీ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా ఫెడరలిజం లేదా సమాఖ్యస్ఫూర్తి గురించి ప్రస్తావిస్తే, మహారాష్ట్ర కేసులో కేంద్రం కనుసన్నల్లో పనిచేసే గవర్నర్లు ప్రభుత్వాలను నిలపడం, కూల్చడంలో ఎలాంటి తప్పులు చేస్తారో చెప్పింది.
చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, అంటే ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానికే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులపై అంటే అధికార యంత్రాంగంపై అజమాయిషీ ఉంటుందని స్పష్టం చేసింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఢిల్లీలో ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ పనితీరును దెబ్బకొట్టడానికి కేంద్రం లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా చేయని ప్రయత్నం లేదు. ఢిల్లీని కేంద్రపాలిత ప్రాంతం నుంచి రాష్ట్రంగా మార్చినప్పటికీ అది దేశ రాజధాని కావడంతో శాంతిభద్రతలు, పోలీసులు, భూమి వంటి అంశాలు మాత్రం కేంద్రం చేతిలోనే ఉన్నాయి. మిగతా అన్నింటిలో ప్రజాస్వామికంగా ఎన్నికయ్యే ప్రభుత్వానికే నిర్ణయాధికారం ఉండాలి. 2013లో లెఫ్టినెంట్ గవర్నర్గా వచ్చిన నజీబ్ జంగ్ మొదలు, ఆ తర్వాత వచ్చిన అనిల్ బైజల్, ఇప్పటి వినయ్కుమార్ సక్సేనా వరకు అందరూ, కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్లో, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని తిప్పలు పెట్టినవాళ్లే. 2015లో లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న నజీబ్ జంగ్ అయితే ఢిల్లీలో స్టెనోగ్రాఫర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల వరకు నియామకాల మొదలు ట్రాన్స్ఫర్ల వరకు తనకే అధికారం ఉన్నదంటూ కేజ్రీవాల్కు ఉత్తరం రాశాడు. ఢిల్లీ రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వ అధికారాలపై కేంద్రం ఆధిపత్యానికి వ్యతిరేకంగా తొమ్మిదేండ్లుగా అరవింద్ కేజ్రీవాల్ రాజకీయంగానూ, న్యాయస్థానాల్లోనూ కొట్లాడుతూనే ఉన్నాడు. ఢిల్లీలో అధికార యంత్రాంగంలో భాగమైన ఐఏఎస్, ఐపీఎస్ వంటి యూపీఎస్సీ నియమించిన కేంద్ర సర్వీసు అధికారులపై ఎవరి అజమాయిషీ ఉంటుందనేది కాదు ఇప్పుడు ముందున్న సమస్య. ప్రజలచే ఎన్నుకోబడిన ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి, పక్కలో బల్లెంలా మారి తాము నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీ రాష్ట్రంలో పాలనను గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్న కేంద్ర నిరంకుశ ధోరణికి మధ్య పోరు ఇది. అన్ని రాజ్యాంగ, కార్యనిర్వాహక వ్యవస్థలన్నీ తమ గుప్పెట్లో పెట్టుకుంటూ, వ్యతిరేకించేవాటిని కూల్చేసే బీజేపీకి ఈ కోర్టు తీర్పు చెంపపెట్టు. ఎందుకంటే ఈ తీర్పుకు స్ఫూర్తి రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తి (ఫెడరలిజం). ఈ తీర్పు దేశ రాజకీయాల్లో నడుస్తున్న తప్పుడు పోకడలను, నిర్ణయాలను ఎదిరించేందుకు, తిరస్కరించేందుకు నైతిక బలాన్ని, రాజ్యాంగపరమైన హామీని ముందుంచుతుంది.
ఇక మహారాష్ట్ర సర్కారుపై చెప్పిన తీర్పు విషయానికి వస్తే.. గవర్నర్, స్పీకర్లు చేసిన తప్పులు ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైందని గుర్తించింది. శివసేనలోని అంతర్గత వ్యవహారం తేలకుండానే బీజేపీకి దోహదపడేవిధంగా అసెంబ్లీలో బల పరీక్షకు గవర్నర్ భగత్సింగ్ కోషియారీ ఆదేశం ఇవ్వడం తప్పని చెప్పింది. అయితే ఉద్ధవ్ థాక్రే బలపరీక్షకు ముందే స్వచ్ఛందంగా రాజీనామా చేసినందున ఆ ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేకపోతున్నామని చెప్పింది. ఇదిప్పుడు మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన షిండే-బీజేపీ సర్కారు తప్పుడు పద్ధతిలో వచ్చిందని చెప్పడమే.
ఆర్ఎస్ఎస్ కార్యకర్త, బీజేపీ నేత అయిన భగత్సింగ్ కోషియారీకి మహారాష్ట్రలో ఎలాగైనా బీజేపీ సర్కారు ఉండేందుకు విశ్వ ప్రయత్నం చేసిన చరిత్ర ఉన్నది. ఎన్సీపీ ఆమోదం లేకుండానే ఆ పార్టీ నాయకుడు
అజిత్ పవార్తో చేతులు కలిపి సరిగ్గా మూడురోజుల ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సహాయం చేశాడు.
కర్ణాటకలో కూడా ఈ రోజు మధ్యాహ్నానికే ఎన్నికల ఫలితాలు వస్తాయి. బీజేపీయేతర పార్టీలు పూర్తిస్థాయిలో సీట్లు గెలుచుకోలేకపోతే మహారాష్ట్రలో జరిగిన పరిణామాలే చోటుచేసుకునే అవకాశం ఉన్నది. అక్కడ కూడా గవర్నర్ థావర్ సింగ్ గెహ్లాట్, మహారాష్ట్రలో కోషియారీ చేసిన నిర్వాకం లాంటిది చేయకుండా ఉండేందుకు మహారాష్ట్ర సర్కారు ఏర్పాటుపై సుప్రీంకోర్టు తీర్పు ఒక గైడ్లైన్గా ఉంటుంది.
బీజేపీ డీఎన్ఏలోనే ఆధిపత్య ధోరణి ఉన్నది. అది ఆ పార్టీని పుట్టించిన ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల సైద్ధాంతిక పునాది నుంచి వచ్చిన లక్షణమే. మెడికల్ సీట్లు కేంద్రీకరించే ప్రయత్నం, పెరుగు ప్యాకెట్పై దహీ అని రాయాలన్న అహంకారపూరిత నిర్ణయాలు మొదలు గతేడాది నిర్మలా సీతారామన్ కామారెడ్డిలో రేషన్షాప్పై మోదీ ఫ్లెక్సీకి కలెక్టర్ కాపలాగా ఉండాలని హుకూం జారీచేయడం వెనుక కూడా ఈ అహంకారమే ఉన్నది. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాహాటంగా వ్యాఖ్యలు చేసే గవర్నర్ ఆర్.ఎన్.రవి, తెలంగాణలో బిల్లులను తొక్కిపెట్టిన గవర్నర్ ధోరణి ఇవన్నీ ఈ కోవలోకే వస్తాయి. వేరే పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో డబుల్ ఇంజిన్ సర్కారు స్లోగన్, కేంద్రంలో ఉన్న పార్టీనే రాష్ట్రంలో ఉంటే తప్ప అభివృద్ధి జరగదని బీజేపీ బ్లాక్మెయిల్ చేయడం కూడా ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమే.
ప్రజాస్వామ్యం నిలవాలంటే రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ప్రభుత్వాలు, వ్యవస్థలు బలపడాల్సిన అవసరం ఉన్నది. వ్యవస్థలను నీరుగార్చడం లేదా నిరంకుశ అస్ర్తాలుగా మార్చి బ్రూట్ ఫోర్స్తో అధికారం చెలాయిస్తున్న కేంద్రానికి వ్యతిరేకంగా కలవాల్సిన శక్తుల మధ్య ఐక్యతకు ఫెడరలిజం ఒక ఆయుధం మాత్రమే కాదు షరతు కూడా. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ న్యాయమూర్తులు ఎం.ఆర్.షా, కృష్ణ మురారి, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఈ ఏకగ్రీవ తీర్పు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన ఫెడరల్ లక్షణాలను అన్వయిస్తూ వ్యాఖ్యానించింది. బహుళత్వ లక్షణాలున్న (ప్లూరలిస్టిక్) సమాజానికి ఉండే ప్రాంతీయ ఆకాంక్షలను గుర్తిస్తేనే దేశ ఐక్యత, ప్రజాస్వామిక స్ఫూర్తి బలపడుతుందని తీర్పులో చెప్పింది. ఈ అంశాలనే ప్రస్తుత దేశ రాజకీయాల్లో తిరిగి ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉన్నది. గత తొమ్మిదేండ్లలో బీజేపీ పాలన రాజ్యాంగంలోని అనేక అంశాలను తుంగలో తొక్కింది. ‘అచ్ఛే దిన్’తో మొదలైన మోదీ మన్కీ బాత్, 2047లో అందుకోబోయే అమృత్కాల్ వరకు భారత రాజకీయాలను ఫాసిస్టుగా మార్చే ప్రయత్నం చేస్తున్న బీజేపీ రాజకీయాలకు ఇలాంటి తీర్పులు సుప్రీంకోర్టు ద్వారా రాజ్యాంగం చేసే హెచ్చరికలు.
ఎం.ఏ.శ్రీనివాసన్: 81069 35000