ఉన్నతవిద్య గురించి, ఉన్నత ఉద్యోగాల గురించి, గొప్ప గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణల గురించి, ఆర్థిక వ్యవస్థ పరుగు గురించి మాట్లాడుకోవాల్సిన ఆధునిక కాలమిది. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కారణంగా.. ఇటువంటివన్నీ పక్కనపోయి మతం గురించి చర్చించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. హింస, విబేధాలు, అసహనం- ఇవే మతం తాలూకు ఘనమైన చిహ్నలుగా పాలకులు ప్రజల మీద ఒక భావజాలాన్ని రుద్దుతున్న సమయంలో.. అసలు హిందూ మతం అంటే ఏమిటో, వందలు, వేల ఏండ్లలో ఈ మతాన్ని సుసంపన్నం చేసిన మహనీయులు చేసిన బోధనలేమిటో తెలుసుకోవాల్సిన అవసరం మన ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే, కర్ణాటకకు చెందిన ముకుందరావు ‘ఇండియాస్ గ్రేటెస్ట్ మైండ్స్’ పేరుతో రాసిన పుస్తకం పలువురిలో ఆసక్తిని కలిగిస్తున్నది. ఈ పుస్తకంలోని ముఖ్యాశాలు..
షిర్డీ సాయిబాబా (1838-1918) చనిపోయిన వంద ఏండ్ల తర్వాత కూడా ప్రజల చేత గొప్ప మహిమాన్విత సాధువుగా పూజింపబడుతున్నాడు. కోట్లాది మంది హిందువులు, ముస్లింలు అతన్ని పూజిస్తారు. సాయిబాబా హిందూ దంపతులకు పుట్టి ఒక ఫకీర్ వద్ద పెరిగి పెద్దయ్యాడు. సనాతనం పేరుతో కొనసాగే మూఢాచారాలను, హిందు-ముస్లింల మధ్య విభేదాలను తీవ్రంగా వ్యతిరేకించాడు. హైందవం, ఇస్లాం రెండు మతాల సారమూ ప్రేమ, సేవ, స్వేచ్ఛనేనని సాయిబాబా ప్రబోధించారు.
హిందూ, ముస్లింల చేత నేటికీ సమానంగా గౌరవింపబతున్న వ్యక్తి కబీర్ (1398-1448/55). కబీర్ చేనేత పని చేసే ముస్ల్లిం కుటుంబంలో జన్మించటమో లేక వారి చేత దత్తత తీసుకోబడటమో జరిగిందని చరిత్రకారుల అంచనా. అందువల్ల ఆయనకు ఇస్లాంపై పరిపూర్ణ అవగాహన ఉండేది. అలాగే అతని బోధనలు, పద్యాలను బట్టి అతనికి హిందూ పురాణ ఇతిహాసాలపైనా, హిందూ తాత్విక సిద్ధాంతాలపైనా అపార జ్ఞానం, పట్టు ఉన్నదని అర్థమవుతుంది. హిందూ, ఇస్లాం మతాల్లో ఉన్న ఛాందసవాదాన్ని, మూఢనమ్మకాలను కబీర్ తీవ్రంగా దునుమాడారు.
చాలామంది భావించినట్లుగా భారతీయ ఆధ్యాత్మికత అనేది కేవలం బ్రాహ్మనీయ నమ్మకాలు, చర్చలు, వివాదాలు, సంస్కృత సాహిత్యం, ఉపనిషత్తులు, భగవద్గీత, కులవ్యవస్థ మాత్రమే కాదు. దానికన్నా విస్తృతమైనది ఇంకా ఎంతో ఉంది. నిజానికి, ముకుందరావు అంచనా ప్రకారం, మన దేశంలో వివిధ కాలాల్లో వచ్చిన వైదిక సంప్రదాయపు ఆధ్మాత్మిక వాదాలు, సిద్ధాంతాలకన్నా వైదికేతర సంప్రదాయం నుంచి వచ్చిన ఆధ్మాత్మిక వాదాలు, సిద్ధాంతాలే చాలా ఎక్కువ. ఇవి వేద సంప్రదాయ ఆచరణను తీవ్రంగా వ్యతిరేకించాయి. పుట్టుకతో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి కులవ్యవస్థను ఇవి ఖండించాయి. మనుష్యులంతా సమానమన్న విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఇవి బోధించాయి. దీంట్లోభాగంగానే ఈ సంప్రదాయానికి చెందిన ఎంతోమంది ఆధ్యాత్మిక వేత్తలు తమ బోధనల ద్వారా హిందూ-ముస్లింల మధ్య ఐక్యత, సఖ్యత పెంచటానికి అవిరళ కృషి చేశారు. కాబట్టి, ఏదో ఒక సిద్ధాంతాన్ని చూపెట్టి ఇదే భారతీయ తత్వశాస్త్రం అని అనలేము. ఇంకా చెప్పాలంటే, భారతీయ తత్వశాస్ర్తాన్ని బహుళ రీతుల్లో అర్థం చేసుకోవాలి. దాంట్లో హిందూ, బౌద్ధం, జైనం, సిక్కు మాత్రమే కాదు, క్రైస్తవం, ఇస్లాం కూడా కలగలిసి ఉన్నాయి. ఇటువంటి మహత్తర తాత్విక, ఆధ్యాత్మిక చరిత్ర ఉన్న భారతదేశంలో నేడు.. ఈ విషయం చెప్పటం కూడా దైవదూషణగా భావించే పరిస్థితులు వచ్చాయి.
క్రీస్తుశకం 100-200 మధ్య జీవించిన సరహపాద.. సన్యాసం పేర సర్వం త్యజించాలనే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. దిగంబరత్వమే ముక్తికి మార్గమైతే దానికి కుక్కులు, నక్కలకే ఎక్కువ అర్హత ఉంటుందన్నాడు. వేదాలతోపాటు తన కాలంలో ఆధిపత్యంలో ఉన్న వాదాలన్నింటినీ ఆయన తర్కబద్ధంగా సవాల్ చేశాడు. ఆ తర్వాత కాలంలో ఆయన మహాసిద్ధగా ప్రసిద్ధి పొందాడు.
అభినవ గుప్త (క్రీ.శ.950-1016): శైవ సంప్రదాయానికి చెందిన గొప్ప తత్వవేత్త. అతడిని భూమి మీద అవతరించిన భైరవుడి అవతారంగా ఆయన అనుయాయులు భావించారు. భారతదేశంలో జన్మించిన అతిగొప్ప తత్వవేత్తలు, యోగులు, రచయితలు, మార్గనిర్దేశకుల్లో అభినవ గుప్త ఒకరు. ఆధ్మాత్మిక సాధనకు పరిశుద్ధ హృదయాన్ని మించినది లేదని, ఆ వ్యక్తి సాధువా, గృహస్థుడా, బ్రాహ్మణుడా, అంటరానివ్యక్తా అన్నది అసలు విషయమే కాదని బోధించారు ఆయన. నాటి కాలంలో ఇది ఒక విప్లవాత్మక సిద్ధాంతం.
దేశంలో గొప్ప ఆధ్యాత్మిక విప్లవకారుడుగా ప్రఖ్యాతి గాంచిన వాడు బసవన్న (క్రీ.శ.1136-96). బ్రాహ్మణవాదం చుట్టూ నిర్మితమై ఉన్న ఆచరణలను, ఆచారాలను, మత రచనలను బసవన్న తీవ్రంగా ఖండించాడు. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని, కులవ్యవస్థను, లింగవివక్షను తిరస్కరించాడు. వేదాల ఆధ్యాత్మిక ఆధిపత్యాన్ని సవాల్ చేశాడు. బసవన్న ప్రచారం చేసిన శైవతత్వం ఆ తర్వాత కాలంలో ‘లింగాయత వాదం’గా ప్రసిద్ధి చెందింది. శివ భక్తుల మధ్య ఎలాంటి కుల బేధాలు ఉండటానికి వీల్లేదని ఆయన తన అనుచరులకు బోధించారు. అందరూ కలిసి భోజనం చేయటాన్ని తప్పనిసరి చేశారు. దీనికే ‘దసోహ’ అని పేరు వచ్చింది. తర్వాతి కాలంలో వచ్చిన సిక్కు మతంలో గురుద్వారాల్లో లంగర్ పేరుతో ఇటువంటి సంప్రదాయమే నేటికీ కొనసాగుతున్నది.
సుమారు క్రీ.శ 1100 కాలంలో జీవించిన అల్లమ ప్రభు దేశదిమ్మరి సాధువు. ఆధ్యాత్మిక కవి. వైదిక ఆచారాలన్నింటినీ ఈయన ప్రశ్నించాడు. విగ్రహారాధనను అవహేళన చేశాడు. కులవ్యవస్థను, మతాచారాలను, మతపరమైన తంతులను తీవ్రంగా వ్యతిరేకించాడు.
తమిళనాడు తంజావూరులో జన్మించిన నందనార్ (క్రీ.శ.700-800) ప్రఖ్యాత శివ భక్తుడు. అంటరాని కులమైన పులైయాలో పుట్టిన ఆయన నేడు అనేక శివాలయాల్లో పూజలందుకుంటున్నారు. దేశంలోనే గొప్ప సాధువుగా ప్రసిద్ధి నొందిన భక్త తుకారాం (1608-50) తన జీవితకాలంలో నాటి బ్రాహ్మణుల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. 1371లో జన్మించిన సంత్ రవిదాస్ వేదాల ప్రామాణికతను, బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించాడు. తులసీదాస్ కూడా ఇదే దారిలో పయనించారు.
1819-89 ప్రాంతంలో నాటి ప్రజానీకం మీద తీవ్ర ప్రభావం చూపిన శిశునాల షరీఫా హిందు, ముస్లిం తాత్వికతను ప్రచారం చేశాడు. ఈయన శివభక్తులైన ముస్లిం ఖాద్రీ కుటుంబంలో జన్మించాడు. లింగాయత సిద్ధాంతాలను, పురాణాలను, ఇతిహాసాలను ఔపోసన పట్టాడు. నాటి సనాతన బ్రాహ్మణులు ఇతడిని తీవ్రంగా వ్యతిరేకించారు. హిందూ-ముస్లింల సౌభ్రాతృత్వాన్ని జీవితాంతం బోధించాడు షరీఫా. ఈయన సమాధి వద్ద ముస్లింలు ఖురాన్ పఠిస్తే, హిందువులు వేదాలను చదువుతూ ప్రార్థిస్తారు. కర్ణాటకలోని శిశువినహలలో ఉన్న ఆయన సమాధిని హిందువులు, ముస్లింలు నేటికీ దర్శించుకుంటారు.
ఇస్లాంలో ఒక శాఖగా కాకుండా, ఇస్లాం తాలూకు ఆధ్మాత్మికధారగా ముందుకొచ్చిన సూఫీతత్వం గురించి కూడా ముకుందరావు తన పుస్తకంలో చర్చించారు. సూఫీతత్వాన్ని బోధించిన నజీముద్దీన్ ఆలియా (1238-1325).. ఇతర మతస్థులను ఇస్లాంలోకి మారకుండానే చిస్తీ మార్గంలోకి రావాల్సిందిగా ఆహ్వానించేవారు. ఇస్లాంను సంపూర్ణంగా విశ్వసించిన బుల్లే షా (1680-1758) హిందూమతంతోపాటు ఇతర ఆధ్యాత్మిక సిద్ధాంతాలలోని మంచిని కూడా బోధించేవారు.
లోతుగా పరిశోధించి రచించిన ఈ గ్రంథంలో ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే, మన యోగులు, రుషులు, మహనీయులు చెప్పిన హిందూమతం ఏమిటో తెలుసుకోవటానికి ఇవి సరిపోతాయి. వారి ఆలోచనల్లో, వారు ప్రబోధించిన సిద్ధాంతాల్లో ఎక్కడా కూడా కోపం, దురాశ, అసూయ లేనేలేవని వీటిద్వారా తెలుస్తుంది. నిజానికి కోపం, దురాశ, అసూయ, విభజన, హింస మీదనే వారు జీవితాంతం పోరాడి ప్రేమ, సహోదరత్వం, జ్ఞానం, స్వేచ్ఛామార్గాలను ప్రబోధించారు.
భారతదేశ చరిత్రలో ఆధ్యాత్మికరంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహిళలు కూడా ఎందరో ఉన్నారు. పురుషులతోపాటు సాధువులుగా మహిళలు కూడా ప్రఖ్యాతిగాంచారు. క్రీ.శ.1130-60 కాలానికి చెందిన అక్కమహదేవి.. కుటుంబం, దుస్తులతో సహా సర్వస్వాన్నీ త్యజించి శివ భక్తురాలిగా సమాజంలోని సమస్త వర్గాలను ప్రభావితం చేసింది. నేడు కర్ణాటకలో ఇంటిల్లిపాది పేరుగా అక్కమహాదేవి మారిపోయింది. అనేక యూనివర్సిటీలకు, సంస్థలకు, రోడ్లకు కర్ణాటక ప్రభుత్వాలు ఆమె పేరు పెట్టాయి. శ్రీనగర్లో జన్మించిన లల్లేశ్వరి (క్రీ.శ. 1320-92) సన్యాసినిగా ఆ ప్రాంతమంతా పర్యటించింది. ఆమెను ముస్లింలు లల్లా అరిఫా అని, హిందువులు లల్లా యోగిశ్వరి అని పిలుచుకొనేవారు. అక్కమహదేవి లాగానే లల్లేశ్వరి కూడా దిగంబరం యోగినిగా ప్రసిద్ధి చెందారు.